.
అహోబిలం… ఇప్పుడు వివాదాల తెరమీదకు వచ్చింది చదువుతున్నారు కదా… అక్కడ భక్తులు సమర్పించే జుట్టు సేకరించే టెండర్పై అక్కడి నాయకుల లాభాపేక్ష, పెత్తనపు పోకడలపై వార్తలొస్తున్నాయి… ప్రత్యేకించి భూమా అఖిలప్రియ… (‘జుత్తు’లమారి దందా అని సాక్షి శీర్షిక బాగుంది, ఈ యవ్వారంపై కథనానికి)…
సరే, ఏ గుడీ అక్రమ ధనార్జనకు కాదు అతీతం… అంతటి అయోధ్య, శబరిమల, తిరుమలలకే తప్పలేదు… అహోబిలం ఎంత అంటారా..?
Ads
గుడికి కావల్సిన దినుసుల కొనుగోళ్లు, కేశ కంట్రాక్టుల కోట్ల దందాల కథనాల గురించి వదిలేస్తే… చిన్నాచితకా చిల్లర దోపిడీకి, దర్శనం బ్రోకర్ల మాయలకు, మోసాలకు కూడా అహోబిలం ఫేమసే… ఫేస్బుక్లో Dr Vivekanand Rayapeddi పోస్టు ఒకటి దాన్నే చెబుతోంది… ఇలా… (స్వీయానుభవమే)…
కారులో అహోబిలం వెళుతున్నారా?
ఊరిలోకి ప్రవేశించటానికి ₹150 కట్టాలి, గ్రామ పంచాయితీ వారి తనిఖీ కేంద్రంలో, ఎగువ అహోబిలం కొండ మొదట్లో ఇంకో ₹70 అటవీ శాఖ వారి తనిఖీ కేంద్రంలో కట్టాలి.
ఇంతా చేస్తే గుడికి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో కార్ పార్క్ చేయాలి. అక్కడి నుంచి గుడి వాళ్ళ ఒక చిన్న వాహనంలో ఉచితంగా గుడి మెట్ల దాకా వెళ్ళాలి. అది ఎప్పుడొస్తుందో తెలియదు.
మధ్యవర్తులు ఇక్కడే రంగంలోకి దిగుతారు.
“అటవీ శాఖ వారితో లోపాయికారిగా మాట్లాడాము, మీరేమి కంగారుపడే పని లేదు, ఒక ₹ 1000 ఇవ్వండి, మీ కార్ కొండ మెట్ల దాకా తీసుకువెళ్లొచ్చు, అదీ గాక మీకు విఐపి దర్శనం కల్పిస్తాము, నవ నారసింహులను కూడా చూడొచ్చు ” అని భరోసా కల్పిస్తారు.
ఈ కింది వివరాలు ఇస్తారు
టోల్ గేట్ కి ₹300 (అనధికారికంగా )
విఐపి దర్శనం ₹ 400 (తలకి ఒక ₹ 100… టోకెన్ ఇవ్వరు )
గైడ్ కి టీ ఖర్చులకి ₹ 300
సరే. ఆ అడవిలో ఘాట్ రూట్ లో ఎత్తు దారిలో ఒక కిలోమీటర్ ఎక్కడ నడుస్తాము అని మనం కూడా అతని ప్రపోసల్ తో ఏకీభవిస్తూ ముందడుగు వేస్తాము.
సరే… ఇక్కడ అసలు ట్విస్ట్
తీరా కొండ పైకెళ్ళాక గుడి దగ్గర గుహలో ఉన్న గుడి ఒక్కటే దర్శనం లభిస్తుంది
“ఏమయ్యా!” అని అడిగామా,
“మీకు పిచ్చా! నవ నరసింహుల దర్శనం అంటే మజాకా! మీ వల్ల ఏమవుతుంది? అథవా, మీరు వెళదామన్నా ₹ 4000 తీసుకుంటాము, అదీ గాక ఇది సమయం కాదు. నవ నారసింహుల దర్శనానికి వెళ్లాలంటే పొద్దున ఆరున్నరకల్లా రావాలి ”
“ఆ మాట మొదలె చెప్పాలి కదయ్యా ” అంటే చేతులు పిసుక్కుంటూ నవ్వేశాడు, మనం సంభాషణ ఇంకా పొడిగిస్తే ఆ గైడ్ ఉగ్ర నరసింహావతారం చూపాడు. అతనికి స్థాన బలిమి కూడా ఉంది.
సరే… ఏదో ఒక రూపంలో ఇలా నరసింహ స్వామి దర్శనం అయింది.

ఇక్కడ అర్థం కానిదేమిటంటే..? దేవాదాయ శాఖ వసూళ్లు వేరు- పంచాయతీ పేరిట వసూళ్లు వేరు – ఫారెస్ట్ వసూళ్లు వేరు – బ్రోకర్ల వసూళ్లు వేరు …. ఇవన్నీ గాకుండా నాయకులు, కంట్రాక్టర్లు, అధికారుల అసలు దోపిడీ వేరు… ప్చ్ ఆయన ఉగ్రనరసింహ స్వామి అనుకున్నాం, శాంత నరసింహుడే, ప్రేక్షక నరసింహుడే!!
Share this Article