.
బనకచర్ల ప్రణాళిక బద్దలు కొట్టాడు రేవంత్రెడ్డి తన తాజా వ్యూహంతో… ఎందుకు? ఎలా? తెలియాలంటే కాస్త వివరంగా చదవాలి… అర్థం చేసుకోవాలి… బాబుకు కూడా ఈ కొత్త అస్త్రంతో చుక్కలు కనిపిస్తున్నాయి…
ఇది ఊహించని హరీశ్ రావు మాటల్లో అంతులేని ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది… ఏవేవో మాట్లాడేస్తున్నాడు… ఏ తెలంగాణ ప్రయోజనాల సెంటిమెంటుతో ఇన్నేళ్లు రాజకీయం చేశారో, నిజానికి కేసీయారే తెలంగాణ ప్రయోజనాలకు పాతరేశాడనే నిజం బయటపడి, ఆ సెంటిమెంటే తమకు ఎదురుతిరుగుతున్న తీరు ఆ క్యాంపుకి జీర్ణం కావడం లేదు…
Ads
మధ్యలో తెలంగాణ సాగునీటి సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ మీద నోరు పారేసుకున్నాడు హరీశ్ రావు… నిజంగా రేవంత్ రెడ్డి విసిరిన తాజా అస్త్రం వెనుక మాస్టర్ మైండ్ ఆదిత్యనాథ్ దాసే… కాస్త వివరాల్లో వెళ్దాం…
రేవంత్ రెడ్డి ప్లస్ ఉత్తమకుమార్ రెడ్డి నిన్న ఢిల్లీలో జలవనరుల కేంద్ర మంత్రిని కలిసి, బనకచర్లను మేం ఆమోదించం అని క్లియర్ కట్గా చెప్పారు, అంతేకాదు… మీరు ఇచ్చంపల్లి – సాగర్ లింక్ కెనాల్ చేపట్టండి అని ఓ కొత్త ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారు… అది ఎన్నికోణాల్లో ప్రయోగించిన పాశుపత అస్త్రమో చెప్పాలంటే…
1) అది నిజానికి కొత్తది కాదు… కేంద్రమే నదుల అనుసంధాన పథకంలో భాగంగా తనే డీపీఆర్ కూడా ప్రిపేర్ చేసి, ఆమోదించిన ప్రాజెక్టు… (రేవంత్ రెడ్డి తెలివిగా బాల్ను చంద్రబాబు చేతుల్లో నుంచి లాగి మోడీ కోర్టులో వేశాడు… ఇప్పుడిక బనకచర్లకు ఆమోదం చెప్పలేడు, చంద్రబాబు బ్లాక్మెయిల్ చేసినా ప్రయోజనమూ ఉండదు… ఎలాగంటే..?)
2) ఇచ్చంపల్లి నుంచి సాగర్కు లింక్ చేస్తే అది గోదావరి- కృష్ణా అనుసంధానం… వరద రోజుల్లో రోజూ 2.2 టీఎంసీలను సాగర్కు తరలిస్తే, అక్కడి నుంచి కుడికాలువ ద్వారా పెన్నా దాకా తీసుకుపోయి, ఏకంగా కావేరి రిజర్వాయర్కు కలపాలి… అంటే గోదావరి టు కృష్ణా వయా పెన్నా అప్టు కావేరి…
3) దీనివల్ల తమిళనాడుకు కావేరి మీద డిపెండెన్స్ కొంత తగ్గుతుంది… ప్రత్యేకించి కర్నాటక మీద బర్డెన్ తగ్గుతుంది… అంటే, ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఉమ్మడి ప్రయోజనం… నిజం చెప్పాలంటే జాతీయ కోణంలో గోదావరి జలాల సద్వినియోగ ప్రాజెక్టు…
4) అన్నింటికన్నా ముఖ్యంగా చంద్రబాబు పదే పదే చెబుతున్న బనకచర్ల ప్రయోజనాలన్నీ నెరవేరతాయి ఈ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనతో… దాంతో చంద్రబాబు కక్కలేక, మింగలేక… పైగా ఇది కేంద్ర ప్రాజెక్టు… అదే నిధులిస్తుంది… చంద్రబాబు కొత్త రుణాలు తీసుకురానక్కర్లేదు… (అఫ్కోర్స్, ఇదీ ఓ కాళేశ్వరం బాపతు స్కాం, స్కీం అనే ఆరోపణలు ఆల్రెడీ వస్తున్నాయి కదా…)
5) ఎప్పుడైతే తమిళనాడుకూ ప్రయోజనం, కావేరీ డిపెండెన్సీని తగ్గిస్తాం అంటున్నామో తమిళనాడు కూడా ఈ ప్రతిపాదనకే సై అంటుంది… అన్నింటికీ మించి కర్నాటక తేలికగా ఊపిరి పీల్చుకుంటుంది… తరతరాల కావేరి తగాదాలకు కొంతైనా పరిష్కారం… సో, కేంద్రం తప్పించుకోలేదు…
6) ఈ ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి నుంచి 247 టీఎంసీలను తరలించవచ్చు… ఏపీ, తెలంగాణ, తమిళనాడు మూడు రాష్ట్రాల్లోనూ కొత్త ఆయకట్టు, ఉన్న ఆయకట్టుకు స్థిరీకరణ… ఏపీ 79.9 టీఎంసీలు, తమిళనాడు 84 టీఎంసీలు, తెలంగాణ 65 టీఎంసీలను వాడుకోగలదు…
7) బనకచర్ల ఖర్చుతోనే ఇలా నాలుగు రాష్ట్రాలకూ ప్రయోజనకారి, ప్రయోజలకారి ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు… సో, రాజకీయంగా నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలనూ ఇందులోకి లాగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం… వెరసి ఇది ఓ జాతీయ సమస్య ప్లస్ జాతీయ ప్రాజెక్టు… మాకూ లాభం, మీరూ లాభం పొందండి, అంతేగానీ బనకచర్ల పేరిట దోచుకుంటే సహించం అనేది ఈ అస్త్రం పరమార్థం, మర్మం, స్ట్రాటజీ…
8) ఐతే దీనికి చత్తీస్గఢ్ అభ్యంతరాలున్నాయి… కేంద్రం ఓ స్థిర నిర్ణయం తీసుకుంటే అది పెద్ద సమస్య కాకపోవచ్చు… మహానది- గోదావరి లింక్ను అది వ్యతిరేకిస్తోంది… సో, అకినేపల్లి, తుపాకులగూడెం వంటి ఆల్టర్నేట్స్ ఆలోచించారు కానీ ఇచ్చంపల్లికే కేంద్రం ఇన్నాళ్లుగా మొగ్గుచూపుతోంది… కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించిన ప్రాజెక్టు ఇది…
9) ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మరో బ్రహ్మాండమైన మెలిక పెట్టింది… పోలవరం పార్లమెంటు ఆమోదించిన జాతీయ ప్రాజెక్టు… రాష్ట్ర విభజన చట్టంలోనూ కేంద్రం చేపట్టాలని చెప్పిన ప్రాజెక్టు… సో, పోలవరం- బనకచర్ల వంటి కొత్తవి జతచేస్తే… అంటే పోలవరం ఒరిజినల్ ప్లాన్ మారిస్తే అది చట్టవ్యతిరేకం అవుతుంది… పోనీ, కొత్త ప్లాన్ ఆమోదించాలంటే తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర అంగీకరించాలి, అది అంతర్రాష్ట్ర సమస్య…
10) ఇదంతా అర్థమైంది కాబట్టే చంద్రబాబు అబ్బే, మీరు ఎగువన ఎన్నయినా కట్టుకొండి, నేను కాదనను, దిగువకు వదిలేసిన నీళ్లే వాడుకుంటాను, బాబ్బాబు అంటున్నాడు ఇప్పుడు…
… ఆదిత్యనాథ్ దాస్ మాస్టర్ మైండ్ ఈ వ్యూహం వెనుక ఉంది కాబట్టే నిన్ను హరీశ్ రావు తన మీద అడ్డగోలుగా నోరుపారేసుకున్నాడు… ఆదిత్యనాథ్ జలయజ్ఞం సమయంలో ఉమ్మడి ఏపీ సాగునీటి ముఖ్య కార్యదర్శి, తరువాాత ఏపీకి, ఏపీ చీఫ్ సెక్రెటరీ, ఇప్పుడు తెలంగాణ సాగునీటి సలహాదారు… రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మధ్యతరహా, భారీ ప్రాజెక్టుల అంశాలు క్షుణ్నంగా తెలిసినవాడు… ఏ ప్రాజెక్టు వెనుక ఏ వివాదం, ఏ రాజకీయం ఉందో కూడా తెలుసు.,.
చివరగా… బనకచర్ల అనేది ఓ ప్రాంతీయ సెంటిమెంట్ అస్త్రంగా మారింది… జలం ఎప్పుడూ కీలకమే కదా… సో, రేవంత్ రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేసి, రాజకీయంగా పైచేయి సాధించకతప్పదు… అది తన విధి… చేస్తున్నదీ అదే… ప్రస్తుతానికి వేసిన అడుగులు పర్ఫెక్ట్… ఈ టెంపో కంటిన్యూ చేయడమే తను చేయాల్సింది… తోడుగా అదే ఆదిత్యనాథ్ను వెంటేసుకుని..!!
Share this Article