.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక మూసీ ప్రాజెక్టుకు అనేకానేక అబద్ధాల వ్యాప్తితో బీఆర్ఎస్, కొన్ని సన్నాయినొక్కులతో బీజేపీ అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నాయి… సుందరమైన హైదరాబాద్ జీవనధార ఓ మురుగు కాలువగా మారితే, మరి గత ముఖ్యమంత్రులు ఏం చేశారు..? ఎలా చేతులెత్తేశారో ఓసారి తెలుసుకోవాలి… అప్పుడే రేవంత్ రెడ్డి సంకల్పం విశిష్టత తెలుస్తుంది… ఇదెంత పెద్ద టాస్కో అర్థం అవుతుంది…
- మూసీ ప్రక్షాళన- సుందరీకరణ ప్రణాళిక తొలిసారిగా 1995లో వచ్చింది… చంద్రబాబు మూసీ నదిపై అనేక అధ్యయనాలు చేయించాడు… తను స్వయంగా పర్యటించాడు… కానీ 3 వేల ఎకరాలను ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి కట్టబెట్టే కుట్ర చేస్తున్నాడని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి… (ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అలాంటి ఆరోపణల్నే అందుకుంది… మరి ఇదే బీఆర్ఎస్ దాదాపు 17 వేల కోట్లతో మూసీ ప్రాజెక్టు రచించింది కదా, అప్పుడు కూడా అది కేసీయార్ భారీ భూముల ఆక్రమణ ప్రయత్నమని అంగీకరిస్తున్నట్టేనా..?)…
1997లో చంద్రబాబు మూసీ నందనవనం ప్రాజెక్టు తీసుకొచ్చాడు… 20 వేల మంది నిర్వాసితులుంటారనే అంచనా… నిర్వాసితులు లేకుండా సమగ్ర ప్రాజెక్టు పూర్తి కాదు, అది రియాలిటీ… ఒక్క ఇల్లూ కూలకుండా డెవలప్ చేయాలని బీజేపీ, బీఆర్ఎస్ డిమాండ్లు ఎంత అర్థరహితమో చెప్పడానికి 1997లోనే 20 వేల మంది నిర్వాసితుల అంచనాలే నిదర్శనం… అందుకే రేవంత్ రెడ్డి నిర్వాసితులకు మోడల్ కాలనీలు, పరిహారాల భరోసా ఇస్తున్నాడు…
Ads

- చంద్రబాబు నందనవనం కాలనీ నిర్మించాడు… కేవలం 1095 కుటుంబాలకు కాలనీ కట్టించింది ఆ ప్రభుత్వం… అంతే… తన హాయంలో అంతకుమించిన దుర్మార్గపు ప్రయత్నాలు ఏం జరిగాయి అంటే… చాదర్ఘాట్ ఏరియాలో నదీగర్భంలో పది మీటర్ల కాంక్రీట్ ఛానెల్ కట్టించాడు… అంటే మూసీ ప్రవాహ పరిధిని చివరకు ఓ డ్రైనేజీ కాలువ స్థాయికి కుదించడం… తరువాత చంద్రబాబు మూసీని వదిలేశాడు… అత్యంత విఫల ప్రయత్నం అది…
2005… సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘సేవ్ మూసీ’ అని ఓ క్యాంపెయిన్ చేపట్టాడు… నేషనల్ రివర్ కన్జర్వే షన్ ప్లాన్ (NRCP), JNNAURM ల నుంచి నిధుల్ని సమీకరించి ఈ ప్రాజెక్టు చేపట్టారు… బడ్జెట్లోనే 900 కోట్ల దాకా కేటాయించినట్టు గుర్తు… ఇది ప్రధానంగా మురుగునీటి శుద్ధికే ప్రాధాన్యం ఇచ్చింది… అంటే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం… మూసీలో రబ్బరు డ్యామ్లు నిర్మించి, బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఓ ప్లాన్… తరువాత అరకొర పనులు చేసి, వైఎస్ చేతులెత్తేశాడు… చంద్రబాబులాగే వదిలేశాడు… మరో విఫల ప్రయత్నం… (మెట్రో, ఓఆర్ఆర్, గోదావరి వాటర్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వంటివి హైదరాబాద్ అభివృద్ధికి ఎన్నో పనులు చేసిన వైఎస్ మూసీ విషయంలో ఫ్లాప్ కావడం ఓ విషాదమే)…

- కేసీఆర్ వచ్చాడు, సొంత రాష్ట్రం… తను ఏదైనా చేస్తాడని తెలంగాణ జనం ఆశించింది… 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు… 2018లో డ్రోన్ సర్వే… బాపూఘాట్కు ఎగువన సుమారు 57.5 కిలోమీటర్లు, తర్వాత దిగువ భాగంలో మరో 57.5 కిలోమీట ర్లు.. మొత్తం 115 కి లోమీటర్లు ఈ కార్పొరేషన్ పరిధి… మూసీ సుందరీకరణ, అభివృద్ధికి రూ.16,635 కోట్లతో అంచనాలు వేశారు…
అంటే… కేసీయార్ తను భారీగా సంకల్పించి, చేయలేక చేతులెత్తేసి… ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో… ఆ అసహనాన్ని వ్యక్తీకరిస్తూ అడ్డుపడే ప్రయత్నాలు చేస్తోంది… ఇంత ఖర్చా అని నోళ్లు తెరుస్తున్న నేతలు, అప్పట్లోనే కేసీయార్ దాదాపు 17 వేల ప్రాజెక్టును ఆలోచించాడనే నిజాన్ని మాత్రం విస్మరిస్తున్నారు… ఇదొక పారడాక్స్…

- కొత్తపేట నుంచి నాగోలు, హైకోర్టు, ఛాదర్ ఘాట్ ప్రాంతాల్లో వాకింగ్ ట్రాకులు, పార్కులు, ఓపెన్ జిమ్లు ఆ ప్లాన్లో భాగం… మూసీపై మొత్తం 14 వంతెనలు ప్లాన్ చేశారు… బహుశా ఒకటో రెండో శంకుస్థాపనలూ చేసినట్టుంది… తన ప్లాన్లో ప్రధానమైంది అప్పటికే ఉన్న 25 ఎస్టీపీలకు తోడు మరో 31 కట్టాలని… రోజూ మూసీలోకి విడుదలయ్యే 2000 మిలియన్ గ్యాలన్ల మురుగును శుద్ధి చేయడానికి..! ఒకట్రెండింటికి శంకుస్థాపనలు చేశారు. కానీ నిధుల లేమితో అరకొర పనులు… కేసీయార్ కూడా చంద్రబాబు, వైఎస్ఆర్లాగే చేతులెత్తేశాడు…
నిజానికి మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, పునరుజ్జీవం అంటే కేవలం మురుగునీటి శుద్ధి మాత్రమే కాదు, దాంతోపాటు మురుగు నీటిని రానివ్వకుండా చర్యలు… రోజూ మూసీలో నీళ్లు పారే ప్రణాళిక… మూసీకి ఇరువైపులా నగర జీవనాన్ని ప్రమోట్ చేయడం… పర్యాటక ప్రాధాన్యం కల్పించడం… నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లాల దాకా మురుగునీరు కాదు, కాలుష్యరహిత నీరు పారడం… పాత సీఎంలతో పోలిస్తే రేవంత్ రెడ్డి ప్లాన్లో ఉన్న విశేషం ఇదే…

- అంతర్జాతీయ నిపుణులైన కన్సల్టెంట్లతో ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు… అంతకుముందు ప్రపంచంలోని కొన్ని ప్రధాన నగరాల్లో నదుల పునరుజ్జీవం, నిర్వహణ ఎలా సాగుతున్నాయో అధ్యయనం కూడా జరిగింది… మొత్తం మూసీ పరీవాహకాన్ని 5 జోన్లుగా విభజించి, నైట్ ఎకానమీ పేరుతో నగరంలో వైబ్రెంట్ సిటీని ఆవిష్కరించేలా ప్రణాళిక…
ఇప్పుడూ ప్రధానమైంది నిర్వాసితుల సమస్యే… వారికి పరిహారాలు, ప్రత్యేకంగా మోడల్ కాలనీలు అనేది రేవంత్ రెడ్డి ఆలోచన… అదే చెబుతున్నాడు… నిధులు మరో సమస్య… చట్టపరమైన ఇబ్బందులు మరో సందేహం… అందుకే ఇది చాలా పెద్ద టాస్క్… రేవంత్ రెడ్డి తనకు తానే ఓ పెద్ద పరీక్ష పెట్టుకున్నాడు… అదీ కథ..!! 20 కిలోమీటర్ల ఫస్ట్ ఫేజ్కు ఏడీబీ 4000 కోట్ల పైచిలుకు రుణం ఇస్తోంది కాబట్టి నిధుల లేమి సమస్య లేదు…
అనుకున్నది అనుకున్నట్టు గనుక సక్సెసయితే దేశం నివ్వెరబోయే చరిత్ర..!! ఇతర నగరాల్లోని నదీప్రవాహాలకూ ఓ మోడల్..!! అదే ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం..!!
Share this Article