.
మూసీ ఒడ్డున ఆధ్యాత్మిక – పర్యాటక ‘మకుటం’.. మంచిరేవులలో సరికొత్త వైభవం! హైదరాబాద్ అంటే ఇప్పటిదాకా బిర్యానీ, చార్మినార్, లాడ్బజార్ గాజులు, పాతబస్తీ ముత్యాలు, టెక్నో పార్కులు, నాలెడ్జ్ పార్కులు, హైటెక్ థియేటర్లు, ఐటీ టవర్లు… కానీ త్వరలోనే సీన్ మారబోతోంది…
లండన్ వెళ్తే థేమ్స్ నదిని చూసినట్టు, రేపు పొద్దున్న మన హైదరాబాద్ వస్తే ‘మంచిరేవుల’ ఆధ్యాత్మిక వైభవాన్ని చూడాల్సిందే అనేలా రేవంత్ సర్కార్ ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది… మూసీ పునరుజ్జీవనంలో భాగంగా… అటు మోడ్రన్ లుక్, ఇటు ప్రాచీన భక్తి భావం కలగలిపి ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించబోతున్నారు…
Ads
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటి దశకు… ఇక్కడ ఓ హరిహర క్షేత్ర నిర్మాణానికి శంకుస్థాపన ద్వారా శ్రీకారం చుట్టబోతున్నది రేవంత్ రెడ్డి సర్కారు… అసలు మంచిరేవులలోనే ఎందుకు..? భక్తి సరే, పర్యాటకె ప్రాధాన్యం ఏమిటి అనేది సహజంగా తలెత్తే ప్రశ్న కదా… వివరాల్లోకి వెళ్దాం… మొదట ఈ మ్యాప్ చూడండి…

హైప్రొఫైల్ ఏరియాలో.. హరిహర క్షేత్రం! నార్సింగి, కోకాపేట, మణికొండ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్… ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్… ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్ భవనాలు, విల్లా ప్రాజెక్టులు, సాఫ్ట్వేర్ కంపెనీలతో కిటకిటలాడే ఈ ఏరియాకు అతి సమీపంలోనే, గండిపేట- శంకర్ పల్లి రూట్… దగ్గరలోనే గండిపేట, చిలుకూరు గుడి… బోలెడు రిసార్ట్స్, డెస్టినేషన్ వెడింగ్ స్పాట్స్… ఫారెస్ట్రెక్ పార్క్… ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్ ఉన్న ఈజీ యాక్సెస్… వాట్ నాట్..? మంచిరేవుల ఇప్పుడు భక్తి టూరిజం హాట్ స్పాట్గా మంచి ఎంపిక…
ఇక్కడ 800 ఏళ్ల నాటి వీరభద్రస్వామి ఆలయం ఉంది…, 1400 ఏళ్ల చరిత్ర ఉన్న మచిలేశ్వర ఆలయం… ఇప్పుడు కొత్తగా ‘ఓంకారేశ్వర మందిరం’ కొలువుదీరబోతోంది… వేములవాడలో ఆలయ పునర్నిర్మాణం పర్యవేక్షిస్తున్న శృంగేరీ పీఠమే ఈ మందిరానికి ఆర్కిటెక్చర్, ఆగమ సాయం అందించబోతోంది… అదీ విశేషం…

శృంగేరి శైలిలో… 100 అడుగుల శివుడు! ఈ ఆలయ నిర్మాణం సాదాసీదాగా ఉండబోవట్లేదు… కర్ణాటకలోని ప్రసిద్ధ శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనల మేరకు అత్యంత గంభీరమైన, భిన్నమైన శిల్పకళతో ఇది రూపుదిద్దుకోనుంది…
-
గర్భాలయ వైభవం..: 14 అడుగుల పొడవు, వెడల్పుతో… ఏకంగా 64 అడుగుల ఎత్తున గర్భాలయ గోపురం నిర్మిస్తారు…
-
జలధారలో జటాధారి…: ఆలయం సమీపంలో మూసీ నదిపై ఒక చిన్నపాటి ఆనకట్ట కట్టి, నీటిని నిల్వ చేస్తారు… ఆ నీటి మధ్యలో 100 అడుగుల ఎత్తున నిల్చున్న భంగిమలో ఉండే శివుని విగ్రహం పర్యాటకులను మంత్రముగ్ధులను చేయనుంది…
-
వసతులు…: విశాలమైన గాలి గోపురాలు, మండపాలు, ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ, భారీ పార్కింగ్ ఏరియా… ఇలా భక్తులకు ఏ లోటూ లేకుండా ప్లాన్ చేశారు…
మత సామరస్యానికి ‘మూసీ’ సాక్షి! కేవలం హిందూ దేవాలయాలే కాదు… మూసీ తీరాన్ని సర్వమత సౌభాతృత్వానికి వేదికగా మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పం… మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయం. పురానాపూల్ వద్ద భారీ మసీదు. గౌలిగూడ వద్ద గురుద్వారా. నాగోల్ ప్రాంతంలో చర్చి. నది వెంబడి ఈ నాలుగు ప్రార్థనా స్థలాలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలవనున్నాయి…
బాపూఘాట్ టు మంచిరేవుల.. అంతర్జాతీయ పర్యాటకం! బాపూఘాట్ దగ్గర 150 మీటర్ల గాంధీ విగ్రహం, మ్యూజియం, గేట్ వే ఆఫ్ హైదరాబాద్, మెట్రో-2 యాక్సెస్, నైట్ లైఫ్ యాక్టివిటీ తదితరాలు ఒకెత్తయితే… మంచిరేవుల ఆధ్యాత్మిక టూరిజం మరో ఎత్తు… నదిలో బోటింగ్, చుట్టూ పచ్చని పార్కులు, ఆధ్యాత్మిక ప్రశాంతత.. వెరసి ఇదొక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేషన్ కాబోతోంది…
సుమారు రూ. 700 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ మంచిరేవుల ప్రాజెక్టుకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నాడు… అదనపు నిర్మాణాలు, సౌకర్యాలకు ప్రైవేటు విరాళాలు సేకరించే ఆలోచన ఉంది… (సీఎస్ఆర్ నిధులు కూడా- నిన్న దీనిపై సమీక్ష పెట్టాడు సీఎం…) మొత్తానికి, అన్నీ అనుకున్నట్టు సాగితే గనుక… ఐటీ హబ్కు పక్కనే ఉన్న ఈ ‘డివైన్ హబ్’ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరో లెవల్కు తీసుకెళ్లడం ఖాయం…! ఆశిద్దాం…
Share this Article