.
సోషల్ మీడియా ట్రోలింగ్ వర్సెస్ సామాన్యుడి హక్కు: వేదాంత్ ఉదంతం ఒక గుణపాఠం
ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఒక విద్యార్థి జీవితంలో ఎంతటి మానసిక ఆందోళనకు, సామాజిక వేధింపులకు కారణమయ్యాయో తెలిపే ఒక సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన మార్కులపై నమ్మకంతో హక్కుగా రీ-వెరిఫికేషన్ కోరుకున్న ఒక 17 ఏళ్ల విద్యార్థిని, వ్యవస్థ చేసిన పొరపాటును ప్రశ్నించినందుకు సోషల్ మీడియా వేదికగా “దేశద్రోహి”గా చిత్రీకరించే ప్రయత్నం జరగడం ఆందోళన కలిగిస్తోంది.
అసలేం జరిగింది?
వేదాంత్ అనే 17 సంవత్సరాల విద్యార్థికి సీబీఎస్ఈ 12వ తరగతి ఫిజిక్స్ పరీక్షలో తాను ఆశించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చాయి. దాంతో అతను నిబంధనల ప్రకారం తన ఆన్సర్ షీట్ (సమాధాన పత్రం) నకలు కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, సీబీఎస్ఈ బోర్డు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వేదాంత్కు అతడి పత్రానికి బదులుగా వేరే విద్యార్థి ఆన్సర్ షీట్ పంపబడింది.
Ads
వ్యవస్థలోని ఈ లోపాన్ని సరిదిద్దాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆ బాలుడు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీబీఎస్ఈ బోర్డును టాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు.
ప్రభుత్వ పరిధిలోని ఒక విద్యా సంస్థ చేసిన పొరపాటును ఎత్తిచూపడాన్ని జీర్ణించుకోలేని కొందరు సోషల్ మీడియా విశ్లేషకులు, రాజకీయ పార్టీల ఐటీ సెల్ ప్రతినిధులు, తీవ్ర ధోరణుల నెటిజన్లు ఆ 17 ఏళ్ల మైనర్ బాలుడిపై మూకుమ్మడి ట్రోలింగ్ దాడికి దిగారు.
కల్పిత ఆరోపణలు…: ఆ అకౌంట్ అసలు భారతదేశం నుంచే నడవడం లేదని, పాకిస్తాన్ నుండి నడుస్తోందని కొందరు ప్రచారం చేశారు.
రాజకీయ రంగు…: ఆ అబ్బాయి వెనుక ప్రతిపక్ష పార్టీల హస్తం ఉందంటూ రాజకీయ ముద్రలు వేశారు…
బెదిరింపులు…: కేవలం ఒక విద్యార్థి తన ఆన్సర్ షీట్ అడిగినందుకు అతడిని మానసికంగా కుంగదీసేలా బూతులతో, బెదిరింపులతో నెటిజన్లు రెచ్చిపోయారు…
నిజం గెలిచింది.. కానీ మిగిలిన ప్రశ్నలేంటి?
ఈ వివాదం ముదిరిన తర్వాత సీబీఎస్ఈ బోర్డు స్పందించింది. సాంకేతిక లోపం వల్ల వేరే విద్యార్థి పత్రం వెళ్లిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూ, తమ వైపు ఉన్న తప్పును సరిదిద్దుకుని వేదాంత్కు చెందిన అసలైన ఆన్సర్ షీట్ను అతనికి పంపారు. దీంతో ఆ బాలుడి వైపు ఎలాంటి తప్పు లేదని, అతను చేసింది ధర్మపోరాటమేనని రుజువైంది.
ఆలోచింపజేసే సామాజిక కోణాలు
ప్రశ్నిస్తే దేశద్రోహమా?…: ప్రభుత్వ పరిధిలోని విభాగాలు తప్పు చేసినప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించింది. ప్రశ్నించిన ప్రతి ఒక్కరికీ పాకిస్తానీ అని, అర్బన్ నక్సల్ అని, మతాంతర ముద్రలు వేయడం దేశ సమగ్రతకే ప్రమాదకరం.
సనాతన ధర్మానికి నిజమైన నష్టం ఎవరి వల్ల?…: సనాతన ధర్మం సత్యం, కరుణ, విచక్షణను నేర్పుతుంది. కానీ ధర్మ రక్షణ పేరుతో అకృత్యాలకు, సైబర్ వేధింపులకు పాల్పడే వారి వల్లనే ఆ ధర్మానికి మచ్చ వస్తోంది.
వేదాంత్ అనే ఒక హిందూ మైనర్ బాలుడికే ఈ స్థాయి వేధింపులు ఎదురైతే… అదే స్థానంలో ఒక మైనారిటీ విద్యార్థి ఉండి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకోవడానికే భయమేస్తుంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా, దేశంలో పౌరుల హక్కులు ముఖ్యం. వ్యవస్థల లోపాలను ఎత్తిచూపిన వారిపై దేశద్రోహం ముద్ర వేసే ఈ సంస్కృతికి స్వస్తి పలకకపోతే, రేపు ఏ సామాన్యుడూ గొంతు విప్పలేని భయానక వాతావరణం ఏర్పడుతుంది…
Share this Article