.
Subramanyam Dogiparthi …. రజనీకాంత్ కెరీర్లో ఓ మైలురాయి ఈ దళపతి సినిమా . తెలుగులోకి డబ్ అయిన సినిమా అని ఈరోజుకీ ఎవరూ భావించరు . డైరెక్ట్ టేక్ సినిమాకు ఎలా అయితే ఆదరణ ఉంటుందో అలాగే ఉంటుంది . It’s a great heart-touching , sentimental , emotional , action-filled , musical splendour .
చాలామంది మహాభారతంలోని కర్ణ దుర్యోధనులతో రజనీకాంత్ , మమ్ముట్టి పాత్రలను పోలుస్తూ ఉంటారు . కేవలం కని వదిలేస్తుంది కాబట్టి రజనీకాంత్ పాత్రను కర్ణుడితో పోల్చుకుంటారేమో ! అంతవరకే . ఈ సినిమా క్లైమాక్సులో మమ్ముట్టి స్నేహితుడి కుటుంబమే తన కుటుంబంగా భావించి కలెక్టర్ వద్దకు లొంగిపోవటానికి సిధ్ధపడి వచ్చి ప్రాణాలను కోల్పోతాడు .
అందువలన మహాభారతంలోని కర్ణ , దుర్యోధన పాత్రలతో పోల్చటం సరి కాదని నా భావన . అదంతా ఎలా ఉన్నా అద్భుతమైన కధను నేసుకుని , బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకుని , శ్రావ్యమైన సంగీతంతో ఓ ఏక్షన్ సినిమాను దృశ్య శ్రవణ కావ్యంగా మార్చారు దర్శకుడు మణిరత్నం . Hats off to him .
Ads
సినిమా ప్రియులు ఈ సినిమా చూడకుండా ఉండే ప్రసక్తే లేదు . Gen-Z వాళ్ళు ఏమయినా చూసి ఉండకపోవచ్చు . ఇద్దరు హీరోలు ఒకరికి ఒకరు ప్రత్యర్ధులుగా తారసపడి ప్రాణస్నేహితులు అవుతారు . ఆ నగరానికి కలెక్టరుగా వచ్చిన అరవింద స్వామి ఈ ఇద్దరిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం .
సినిమా మధ్యలో రజనీకాంతుకు ఆ కలెక్టర్ తన తమ్ముడే అని తెలవటంతో సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది . కలెక్టర్ని తుదముట్టించాలని పట్టుబట్టుతున్న మమ్ముట్టికి రజనీకాంత్ నిజం చెప్పేస్తాడు . నీ కుటుంబమే నా కుటుంబమని కలెక్టర్ వద్దకు సరెండర్ అవటానికి వెళ్లి ప్రాణాలను కోల్పోతాడు .
తన మిత్రుని చంపిన ప్రత్యర్ధులను చంపేస్తాడు రజనీకాంత్ . అతనిని అరెస్ట్ చేయటానికి తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవంటూ SP అరెస్ట్ చేయనంటాడు . కలెక్టరుకు బదిలీ కావటం , తల్లి రజనీకాంత్ దగ్గరే ఉంటానని చెప్పటంతో సినిమా ముగుస్తుంది .
నటనపరంగా రజనీకాంత్ , మమ్ముట్టి అదరగొట్టేసారు . డాన్సుల్లో , ఫైటింగుల్లో , ఎమోషనల్ సీన్లలో , అన్నింటిలో తినేసారు . మహిళామణులు శ్రీవిద్య , శోభన , గీత , భానుప్రియ , నిర్మలమ్మ గొప్పగా నటించారు . ఇతర పాత్రల్లో జయశంకర్ , నగేష్ , చారుహసన్ , పి యల్ నారాయణ , కిట్టి , అమ్రీష్ పురి , ప్రదీప్ శక్తి తదితరులు నటించారు . అరవింద స్వామి అరంగేట్రం ఈ సినిమా ద్వారానే .
తెలుగులో విజయవంతం అవటానికి ప్రధాన కారకుడు మాటల్ని , పాటల్ని వ్రాసిన రాజశ్రీ . అసలు డబ్బింగ్ పాటల్లాగా అనిపించవు . అంత చక్కటి సాహిత్యాన్ని అందించారు రాజశ్రీ . ఇళయరాజా సంగీతం గురించి చెప్పేదేముంది . సుందరం మాస్టారు , ప్రభుదేవా డాన్సుల కంపోజింగ్ అద్భుతం . ముఖ్యంగా గ్రూప్ డాన్సులు .
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి గ్రూప్ డాన్స్ అద్భుతం . అలాంటి ఊపయిన మరో పాట చిలకమ్మా చిటికేయంట నువ్ రాగాలే పాడాలంట . ఈ పాటలో Femina Miss India-1985 సోనూవాలియా తళుక్కుమంటుంది .
చాలా శ్రావ్యమైన పాట యమునా తటిలో నల్లనయ్యకై ఎదురుచూసెనే రాధ . చాలా బాగుంటుంది . శోభన , రజనీకాంత్ మీద సాగే సుందరీ నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట చిత్రీకరణ బాగుంటుంది . విషాదంగా ఉన్నా శ్రావ్యంగా ఉంటుంది ఆడజన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో పాట . మరో పాట ముద్దబంతి పూచేనులే . పాటల్ని బాలసుబ్రమణ్యం , జేసుదాస్ , సుశీలమ్మ ,చిత్ర , స్వర్ణలత అత్యంత శ్రావ్యంగా పాడి సూపర్ హిట్ చేసారు .
సినిమాలో సంతోష్ శివన్ ఫొటోగ్రఫీని కూడా మెచ్చుకోవలసిందే . వెరశి అద్భుతమైన సినిమా . గతంలో ఎన్నిసార్లు చూసినా మరలా మరలా చూడతగ్గ సినిమాయే . యూట్యూబులో ఉంది …
Share this Article