.
రాజకీయాల్లో కొన్నిసార్లు వ్యక్తుల కంటే ప్రక్రియలే పెద్దవిగా మారతాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు వివాదం కూడా అలాంటిదే. ఇది కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వ్యవహారం కాదు. ఒక అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించే ముందు అతనికి లేదా ఆమెకు తన వాదన వినిపించే అవకాశం ఇవ్వాలా వద్దా అనే ప్రాథమిక ప్రజాస్వామ్య ప్రశ్న.
మీనాక్షి నటరాజన్ పేరు జాతీయ రాజకీయాలను గమనించే వారికి కొత్తది కాదు. విద్యార్థి ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి, లోక్సభ సభ్యురాలిగా పనిచేసి, పార్టీ వ్యవస్థలో వివిధ బాధ్యతలు నిర్వహించిన నాయకురాలు. టీవీ స్టూడియోలలో అరుపులతో కాకుండా, సంస్థాగత రాజకీయాల ద్వారా ఎదిగిన తరం ప్రతినిధి. అలాంటి నాయకురాలి నామినేషన్ తిరస్కరణ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది.
Ads
ఆమెపై ఆరోపణ ఏమిటంటే, ఎన్నికల అఫిడవిట్లో ఒక కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదని. ఒకవేళ అది నిజమైతే చట్టం తన పని తాను చేసుకోవచ్చు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు వంటి వివరాలను వెల్లడించాల్సిందే. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో కఠిన వైఖరినే తీసుకుంది. ఓటర్లకు పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది.
కానీ ఇక్కడ వివాదం ఆరోపణ గురించి కాదు. ఆ ఆరోపణను ఎలా పరిశీలించారు అన్న దాని గురించి.
ఒక అభ్యర్థిపై అభ్యంతరం వచ్చినప్పుడు ఆ అభ్యంతరాన్ని అతనికి తెలియజేశారా? వివరణ అడిగారా? ఆ వివరణను రికార్డులోకి తీసుకున్నారా? కారణాలతో కూడిన ఉత్తర్వు ఇచ్చారా? ప్రస్తుతం రాజకీయంగా, న్యాయపరంగా ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశాలు ఇవే.
- భారత న్యాయవ్యవస్థలో “ఆడి ఆల్టరమ్ పార్టమ్” అనే సహజ న్యాయ సూత్రం ఉంది. పేరు కాస్త కష్టంగా ఉన్నా భావం చాలా సులభం. ఎవరిపైనా ప్రతికూల నిర్ణయం తీసుకునే ముందు అతని వాదన వినాలి. కోర్టుల్లోనే కాదు, ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ఎందుకంటే ఒక పక్షం మాట మాత్రమే విని తీసుకునే నిర్ణయం న్యాయంగా కనిపించదు.
అవును, ఎన్నికల ప్రక్రియ కోర్టు విచారణలా నెలల తరబడి సాగదు. నామినేషన్ల పరిశీలనకు నిర్దిష్ట సమయం ఉంటుంది. రిటర్నింగ్ అధికారికి చట్టబద్ధమైన అధికారాలు కూడా ఉంటాయి. కానీ అందుకే అభ్యర్థిని పూర్తిగా పక్కన పెట్టి నిర్ణయం తీసుకోవచ్చని ఎక్కడా చెప్పలేదు. కనీసం అభ్యంతరం ఏమిటో తెలియజేయడం, వివరణ కోరడం, ఆ వివరణను పరిగణనలోకి తీసుకోవడం ప్రజాస్వామ్య మర్యాదలో భాగం.
ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ప్రతి తప్పు ఒకేలా ఉండదు. ఒక అఫిడవిట్లో టైపింగ్ పొరపాటు, ఒక సాంకేతిక లోపం, ఒక కాలమ్లో వివరాల అస్పష్టత వేరు. ఉద్దేశపూర్వకంగా కీలక సమాచారాన్ని దాచిపెట్టడం వేరు. చట్టం కూడా ఈ రెండింటిని ఒకే తూకంతో చూడదు. అందుకే మీనాక్షి నటరాజన్ విషయంలో అసలు ప్రశ్న — ఆమె వెల్లడించలేదని చెబుతున్న అంశం నిజంగా చట్టం ప్రకారం తప్పనిసరిగా వెల్లడించాల్సిన విషయమా? కాదా? అనేదే. (ఓ ప్రైవేటు కేసు అది)…
ఈ వివాదంలో నాకు ఆసక్తికరంగా అనిపించిన విషయం మరోటి. దేశ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో విధానాలపై మాట్లాడే, చట్టాలపై చర్చించే, సంస్థాగత అనుభవం ఉన్న నాయకుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. రాజ్యసభ అసలు ఉద్దేశం కూడా అదే. అది ఎన్నికల హోరాహోరీ రాజకీయాల సభ కాదు. అనుభవం, అధ్యయనం, విధానపరమైన అవగాహన ఉన్న వ్యక్తులు దేశ చట్టాలపై మాట్లాడే వేదిక.
(ఎవరెవరో ధనబలంతో ప్రవేశిస్తున్నారు రాజ్యసభలోకి, వారికన్నా మీనాక్షి చాలా బెటర్ కదా… అప్పట్లో వ్యక్తిగత పాపులారిటీ కోసం ఏమాత్రం సహేతుకత లేని పాదయాత్రతో కొద్దిగా బదనాం అయినా సరే మీనాక్షికి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నేతలతో వైరం లేదు, వైరుధ్యం లేదు…)
ఆ కోణంలో చూస్తే మీనాక్షి నటరాజన్ లాంటి నాయకులు రాజ్యసభలో ఉండటం ప్రజాస్వామ్యానికి ఉపయోగమే తప్ప నష్టం కాదు. ఆమె కాంగ్రెస్ నాయకురాలు కావచ్చు. ఆమె అభిప్రాయాలతో అందరూ ఏకీభవించకపోవచ్చు. కానీ రాజకీయాలను కేవలం నినాదాల స్థాయిలో కాకుండా, విధానాల స్థాయిలో చర్చించే వ్యక్తులు పార్లమెంట్లో ఉండాలి.
అందుకే ఈ వ్యవహారం ఒక పార్టీ గెలుపు-ఓటమి కంటే పెద్దది. నేడు మీనాక్షి నటరాజన్కు వర్తించే నిబంధన, రేపు బీజేపీ అభ్యర్థికీ వర్తించాలి. ఎల్లుండి ప్రాంతీయ పార్టీ అభ్యర్థికీ వర్తించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యక్తులను బట్టి మారకూడదు.
చివరికి కోర్టులు, ఎన్నికల అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక విషయం మాత్రం ఎప్పటికీ స్థిరంగా ఉండాలి. తీర్పు ముందే ఉండకూడదు… వినిపించే అవకాశం ముందుండాలి. అదే సహజ న్యాయం. అదే ప్రజాస్వామ్యానికి అసలు బలం.
Share this Article