.
సోషల్ మీడియా కదా, ఎవరు ఏదైనా రాసుకోవచ్చు… ఏదైనా ప్రాపగాండా చేసుకోవచ్చు… అపరిమిత స్వేచ్ఛ… చైనాలాగా ఉక్కుపాదం మోసే సాహసం మోడీకి లేక ఎవడేం రాసుకున్నా చెలామణీ అయిపోతోంది… ఫేస్బుక్ వంటి ప్లాట్ఫారాలు చెత్తా ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీల పేర్లతో నిజమైన జర్నలిస్టుల అకౌంట్లకు ఆంక్షలు పెడతాయి, బ్యాన్ చేస్తాయి, సరే, వాడి ‘దిక్కుమాలిన కమ్యూనిటీ స్టాండర్డ్స్’ దరిద్రాన్ని, వరస్ట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్టులను కాసేపు వదిలేస్తే…
ఒక పోస్టు ఈమధ్య బాగా కనిపిస్తోంది… చదవడానికి బాగుంది… సదరు పోస్టు రచయిత ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాదు గానీ… ఓసారి చదవండి ముందుగా…
Ads
◆ మారువేషంతో కారులో…
1983 జనవరి 3 ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ. 1982 డిసెంబరు 31 వ తేదీన ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లాలి. ఆ సీటును సంజయ్ విచార్ మంచ్ కు కేటాయించడంతో మేనకాగాంధీ కూడా రామారావు గారితో ప్రచారంలో పాల్గొనాలి.
ఆదిలాబాద్ నుంచి చెన్నూరు చేరేందుకు గోదావరి దాటాలి. చిన్న నాటు పడవలో రామారావు గారు, మేనకాగాంధీ కూర్చున్నారు. రామారావు గారు 16 గంటలు ఆలస్యంగా వచ్చారని మేనకా గాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
అప్పటికే రామారావు గారు జ్వరంతో ఉన్నారు, అయినా ప్రచారం ఆపలేదు. చెన్నూరులో సభ ముగిసిన తర్వాత జగిత్యాల చేరుకున్నారు. అప్పుడు రామారావు గారికీ గుడివాడ గుర్తొచ్చింది. అక్కడ ఆయనే అభ్యర్థి. నామినేషన్ వేశాక ఒక్కసారైనా వెళ్లలేదు. అక్కడికి వెళ్లి మళ్లీ మూడో తేదీకి తిరుపతి వెళ్లి సభలో పాల్గొని ప్రచారం ముగించాలి, అక్కడా ఆయనే అభ్యర్థి.
చైతన్యరథం మీద వెళ్తే గుడివాడ, తిరుపతి కాదు కదా, హైదరాబాద్ కు కూడా పోలింగ్ రోజుకు వెళ్లలేమని అక్కడున్నవారన్నారు. దీంతో ఒక కారును, రహస్యాన్ని కడుపులో దాచుకోగల ఒక డ్రైవరు ను సిద్ధం చేయాలని జీవన్ రెడ్డికి చెప్పారు. ఎవరికీ కనిపించకుండా గెస్ట్ హౌస్ వెనుక తలుపు నుంచి బయటికొచ్చి కారు ఎక్కారు.
కారు సిద్ధిపేట సెంటర్ కు చేరేసరికి తెల్లవారుజామున రెండున్నరైంది. ఎవరో కారును ఆపమని చేతులు ఊపారు. రోడ్డును ఆనుకుని ఒక వేదిక 200 మంది గుంపుగా ఉన్నారు. కారు ఆపిన మనిషి ఎన్టీఆర్ ఎక్కడున్నారో మీకేమైన ఎరికేనా..? అని డ్రైవర్ని అడిగారు. కారు ఆపిన మనిషి గొంతును రామారావు గారు గుర్తుపట్టారు.
చంద్రశేఖర్ రావ్.. అని పిలిచారు. రామారావు గారి పిలుపును గుర్తుపట్టారు కేసీఆర్. అన్నా, మీరొస్తుండ్రని రాత్రి లక్ష మంది పోగైనారు. అయిదారు గంటల ముందుగా వస్తే గెలిచేవాణ్ణి. అంతా అయిపోయింది అని కన్నీళ్ల పర్యంతమయ్యారు.
కేసీఆర్ ను ఎలా ఓదార్చాలో రామారావు గారికి తెలియలేదు. అక్కడి నుంచి బయల్దేరిన ఆయన చివరకు గుడివాడ వెళ్లి… ఆ మర్నాడు విజయవాడ నుంచి తిరుపతికి విమానంలో చేరి, చివరి ప్రచార సభను ముగించారు…
.

చదవడానికి బాగుంది… ఎస్, ఆ ఎన్నికల్లో సంజయ్ విచార్ మంచ్తో టీడీపీ పొత్తు నిజం… మనేకా గాంధీతో కలిసి ప్రచారం చేయడం నిజం… జీవన్రెడ్డి పోటీ నిజం… కానీ అంత రహస్యంగా ఎవరికీ తెలియకుండా వస్తున్నప్పుడు ఆ కారునే కేసీయార్ ఎందుకు ఆపాడు..? పైగా ఆ ఎన్నికలకు సంబంధించి ఎన్టీయార్కూ కేసీయార్కూ ఏం సంబంధం..?
ఆ ఎన్నికల్లో తను రాజకీయ గురువు మదన్మోహన్ మీదే పోటీచేశాడు కదా… రోడ్డు మీద అలా అర్ధరాత్రి దాటేదాకా జనం ఎవరి కోసం ఎదురు చూసినట్టు మరి… లక్ష మంది ఎవరి కోసం పోగైనట్టు అంతకుముందు..? భలే రాస్తార్రా భయ్..!! ఇది చదివితే కేసీయార్ కూడా పకపకా నవ్వుకుని ఉంటాడు ఫామ్ హౌజులో కూర్చుని..!!
Share this Article