.
ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఓ డిఫరెంట్ లీడర్… చాలా అంశాల్లో, ప్రత్యేకించి విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి తన ఆలోచన ధోరణి కొత్తగా ఉంటుంది… రొటీన్ రాజకీయ నాయకులకు అంత త్వరగా జీర్ణం కావు తన ఆలోచనలు… మొన్నామధ్య సీట్ల డీలిమిటేషన్ పీటముడి పడినప్పుడు, ప్రతిపక్షాలన్నీ మోదీ బిల్లును వ్యతిరేకించి, విఫలం చేసినప్పుడు… తను ఓ ఇంట్రస్టింగ్ ప్రతిపాదన చేశాడు గుర్తుందా..?
‘బ్లాంకెట్గా అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం సీట్లు పెంచినా మా దక్షిణాదికి అన్యాయమే, సో, ఆ 50 శాతంలో సగం అందరికీ సమానంగా పెంచేయండి, మిగతా సగమేమో జీఎస్డీపీ ఆధారంగా పెంచండి… తద్వారా అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా ఉంటుంది’ అన్నాడు… మంచి ప్రతిపాదనే…
Ads
కానీ ప్రజాప్రాతినిధ్య చట్టం కేవలం జనాభాను బట్టి సీట్లు అంటోంది కాబట్టి కొత్త ఫార్ములాలు రూపొందించలేం అని మోదీ సర్కారు పట్టించుకోలేదు… ఫలితం… ఈరోజుకూ డీలిమిటేషన్ బిల్లు ఓ పరిష్కారం దొరకని చిక్కు ముడి, పీట ముడి… మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ, మోడల్ స్కూళ్లు వంటివి కూడా రేవంత్ కొత్త ఆలోచనలే…!!
- ఇప్పుడు తాజాగా మరో ప్రతిపాదన చేశాడు, దీన్ని రాష్ట్ర శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపిస్తామనీ అంటున్నాడు… ఆ ప్రతిపాదన ఏమిటంటే..? ‘‘శాసనసభ, శాసనమండలి, లోక్సభ, రాజ్యసభల్లో జెన్ జీ తరం కూడా ప్రాతినిధ్యం వహించాలి, ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో 21 ఏళ్లకే ప్రధానమంత్రులు అవుతున్నప్పుడు మన దేశ యువతకు ఎందుకు ఆ అవకాశం ఉండకూడదు?’’
శనివారం రాత్రి నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వెల్లడించిన కొత్త ఆలోచన ఇది… నిజంగా ఆసక్తికరం, ఉపయుక్తం… ఎందుకంటే..? రాజకీయాల్లో కొత్త రక్తం రావాలి, అదీ యువరక్తం రావాలి… వాళ్లు వీథుల్లోకి కాదు రావల్సింది, చట్టసభల్లోకి… జెన్-జీ తరంలో ఆగ్రహం, అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో వాళ్లనే చట్టసభల్లోకి తీసుకురావడం ద్వారా వాళ్లకూ ఓ జవాబుదారీతనాన్ని అప్పగించవచ్చు…
దీనివల్ల అనుభవం- కొత్తరక్తం మధ్య సమతూకం కూడా సాధించవచ్చు… ‘‘రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 61వ రాజ్యాంగ సవరణ చేసి ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించాడు… పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో మేయర్లు, జడ్పీ ఛైర్మన్లు వంటి పోస్టులకు ఎన్నికయ్యే వయస్సును 25 నుంచి 21 ఏళ్లకే తగ్గించాడు…
- 21 ఏళ్లకే ఒక మహిళ తిరువనంతపురం మేయర్గా ఎంపిక కావడానికి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశమే కారణం… లోక్సభలో 543 మంది ఎంపీలు ఉంటే ఒక్క శాతానికిలోపే జెన్ జీ ప్రాతినిధ్యం… 30 శాతంగా ఉన్న జెన్ జీ తరానికి లోక్సభలో ఒక శాతం కన్నా తక్కువ ప్రాతినిధ్యం ఉండడం సరికాదు…’’
సో, జెన్ జీ సమస్యలు పరిష్కారం కావాలంటే చట్ట సభల్లోనూ వాళ్ల ప్రాతినిధ్యం ఉండాలి… ఇందుకోసం శాసనసభ, లోక్సభలకు 21 ఏళ్లకు, శాసనమండలి, రాజ్యసభకు 25 ఏళ్లకే పోటీ చేసే అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి డిమాండ్…
- దేశంలో అత్యున్నతమైన సివిల్ సర్వీసుకు 21 ఏళ్లకే ఎంపికయ్యే అవకాశం ఉన్నప్పుడు చట్టసభలకు ఎందుకు వెళ్లకూడదు అదే వయస్సులో..? 1 ఏళ్ల వయస్సుకే శ్రీలక్ష్మి, 22 ఏళ్లకే మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అనన్య, 22 ఏళ్లకే ప్రస్తుత డీజీపీ సి.వి.ఆనంద్ ఐపీఎస్లుగా ఎంపికైన విషయాన్ని సీఎం గుర్తు చేశాడు…
అవును, జెన్జీ ఎలుగెత్తాల్సింది జంతర్ మంతర్ లో కాదు, సడక్ సే సంసద్… విద్యా శాఖ, ఐటీ శాఖ వంటి కీలకమైన శాఖలు.. 60, 70, 90 ఏళ్ల వాళ్లకు కాదు 21 వాళ్లకే ఇవ్వాలి, వాళ్లకేం కావాలో వాళ్లకే తెలుసు కదా… సరే, రేవంత్ రెడ్డి ప్రతిపాదన పట్ల సహజంగానే అనుకూల, వ్యతిరేక వాదనలు, భిన్నాభిప్రాయాలు వస్తాయి, ప్రత్యేకించి రాజకీయ నాయకులు ఓ పట్టాన మార్పును అంగీకరించరు కదా… కానీ ఇది మాత్రం ఆలోచించదగిన ప్రతిపాదనే… జెన్జీ తరం సడక్ మీద కాదు, సంసద్లో… అనుభవం, పరిణతి అంటారా..? అవే వస్తాయి!!
(ప్రస్తుతం లోకసభ, శాసనసభలకు పోటీపడాలంటే కనీస వయోపరిమితి 25 ఏళ్లు… రాజ్యసభకు, శాసనమండలికి 30 ఏళ్లు… రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ పదవులకు 35 సంవత్సరాలు… స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి 21 ఏళ్లు…)
Share this Article