.
కొండా సురేఖ వెనుక ఎవరున్నారు..? ఈ ప్రశ్నపై అనేక చర్చలు, ఊహాగానాలు మూణ్నాలుగు రోజులుగా జోరుగా సాగుతున్నాయి… నా బిడ్డ మాటలకూ నాకూ ఏం సంబంధం అనే సురేఖ సన్నాయి నొక్కులు ఎవరూ నమ్మరు, కానీ హఠాత్తుగా ఎందుకు ఈ వివాదాన్ని గోక్కున్నట్టు..? పరకాలలో రేవూరి నిలబడతాడు అని రేవంత్ రెడ్డి ఏదో సభలో చెప్పడం అనేది ప్రధాన కారణం కాదు, అసలు ఆ సీఎం వరంగల్ టూర్నే సురేఖ బహిష్కరించింది… అంటే అప్పటికే ఏదో మొదలైందీ అన్నట్టు..!
అసలు ఎక్కడి నుంచి మొదలెట్టాలి..? రకరకాల కథనాలు, అభిప్రాయాలు, సందేహాలను వడగట్టి, ఓ ఫ్రేములో బిగిస్తే ఓ సమీకరణం కనిపిస్తోంది… నిజం ఇదేనని చెప్పలేం, రాజకీయాల్లో ఇదే నిజం, ఇది నిజం కాదూ అని కూడా చెప్పలేం… కేసీయార్ బిడ్డ కవిత నుంచి మొదలుపెట్టాలి…
Ads

ఆమెకు కారణాలేమైనా గానీ, కేసీయార్ కుటుంబంతో పొసగలేదు, కేసీయార్కు కోపమొస్తే బిడ్డా, కొడుకు అని కూడా చూడడు, కోపగించాడు, ఫలితంగా ఆమె పార్టీకి, కుటుంబానికి దూరమైంది… ఓ పార్టీ పెట్టుకుని జనంలోకి పోతోంది… ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎంతోకొంత నష్టం… ఆమె కాళేశ్వరం అవినీతి నుంచి మొదలుపెట్టి అనేక అక్రమాల కథలు చెబుతోంది, ఇంకా చెబుతుంది కాబట్టి… అది కాంగ్రెస్ పార్టీకి, అనగా రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది రాజకీయంగా…

సో, ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే కాంగ్రెస్ వోట్లకు గండి కొట్టాలి, అందుకని తన జాన్ జిగ్రీ దోస్తు జగన్మోహన్ రెడ్డిని కదిలించాడు కేసీయార్… కాంగ్రెస్కు పడుతున్న వైఎస్ లెగసీ బాపతు వోట్లను దెబ్బతీయాలి, తద్వారా కాంగ్రెస్కు నష్టం కలిగించాలి… కవిత బాపతు నష్టానికి ఇది విరుగుడు అన్నమాట… నిజంగానే ఈరోజుకూ ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ తదితర పాత జిల్లాల పరిధుల్లో వైఎస్ మీద అభిమానం జనంలో ఉంది… హైదరాబాద్ నగర శివార్లలోనూ..!

అందుకని తెలంగాణలో మూసేసిన తన పార్టీ దుకాణాన్ని మళ్లీ తెరవాలి జగన్… ఎలాగూ జనసేన, తెలుగుదేశం కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాయి కదా, తన జెండా కూడా మళ్లీ ఎగరాలి… అది కాంగ్రెస్ వోట్లను చీల్చి కేసీయార్కు ఫాయిదా చేకూర్చాలి, తన ప్రబల ప్రత్యర్థి చంద్రబాబుపైన వ్యతిరేకత ప్రభావంతో జగన్ ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కూడా వ్యతిరేకిస్తున్నాడు బలంగానే… సో, తెలంగాణలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావొద్దు, కేసీయార్ రావాలి, అదొక సంకల్పం…

అందుకేనేమో, ఈమధ్య తనకు దగ్గరగా ఉండేవాళ్లతో ఓ మాట అంటున్నాడట… వారానికి 2, 3 రోజులు హైదరాబాదులోనే ఉంటాననీ, తెలంగాణలోనూ పార్టీ మీద కాన్సంట్రేట్ చేస్తాననీ, మరో 2, 3 రోజులు తాడేపల్లిలో ఏపీ రాజకీయాలు చూస్తాననీ చెబుతున్నాడని ఓ సమాచారం… కట్ చేస్తే…

కొండా సురేఖ జగన్ మనిషి… తన కోసం రోశయ్య ప్రభుత్వంలోని మంత్రి పదవికి కూడా రాజీనామా చేసింది, మానుకోట రాళ్ల దాడినీ ఎదుర్కుంది… సేమ్, కోమటిరెడ్డి కుటుంబానికీ వైఎస్, జగన్ పట్ల వీరాభిమానం… రాజగోపాలరెడ్డి కూడా రేవంత్ వ్యతిరేక క్యాంపు మనిషిగా గమనార్హం… పొంగులేటి కూడా జగన్ వీర ఫ్యాన్, కానీ ఇప్పుడు బయటపడటం లేదు…

చిన్నారెడ్డి, సురేఖ, రాజగోపాలరెడ్డి… జీవన్రెడ్డి నిష్క్రమణ… పైకి కారణాలు వేర్వేరుగా కనిపిస్తున్నా, ఒకే అంతఃసూత్రంలో ఇమిడిపోతున్నాయి… సో, జరుగుతున్న పరిణామాలన్నీ ఓ ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేసి, దెబ్బతీయడానికేనా అనే సందేహాలు… సుస్మిత మాటల్ని ఓసారి గమనించండి… అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్… అంటే రేవంత్ రెడ్డిని ఇంకా ఇంకా తెలుగుదేశం మనిషిగానే ముద్రవేయడం..!

మరి కేసీయార్, బీజేపీ కలిసి నడవబోతున్నాయి కదా, జగన్కు ఫాయిదా ఏమిటి ఈ క్యాంపుకి సహకరిస్తే..? ఇదీ ఒక ప్రశ్న.., పైకి మాత్రమే బీజేపీ కూటమి వేరు, జగన్ వేరు ఏపీలో… కానీ ఎప్పుడూ జగన్ బీజేపీకి రహస్య స్నేహితుడే… తెలంగాణలో బీజేపీ- బీఆర్ఎస్ నెయ్యంలాగా !

ఈ కోణంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసే ప్లాన్లు ఆచరణలోకి వస్తున్నాయని కాంగ్రెస్ హైకమాండ్ అవగాహన చేసుకుందా..? మీనాక్షి నటరాజన్, భట్టి, ఉత్తమ్కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల నిజంగానే సానుకూలంగానే ఉన్నారా..? అసలు వాళ్లు హైకమాండ్కు చేరవేస్తున్న సమాచారం, నివేదికలు ఎలాంటివి..? ఇది మరో కోణం…

సో, రేవంత్ రెడ్డి చుట్టూ ఇన్నిరకాల దిగ్బంధనాలు… అందరి టార్గెట్ రేవంత్ రెడ్డే..! ఎందుకు..? కేసీయార్ను గద్దె దించింది తనే… ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ మెయిన్ ఫేస్, క్రౌడ్ పుల్లర్, రాష్ట్రవ్యాప్తంగా కేడర్ను కదిలించగలిగేదీ తనే… అందుకే రేవంత్ రెడ్డిని కొట్టగలిగితే చాలు, మిగతా కాంగ్రెస్ నేతల్లో ఎవరికైనా అవసరం ఉంటే ఆసరాగా నిలబడటానికి కూడా కేసీయార్ క్యాంపు రెడీ… ఒక్కసారి రేవంత్ రెడ్డి దెబ్బతింటే వచ్చే ఎన్నికల్లో ఇక మళ్లీ నాకు అధికారం చాలా సులభమనేది కేసీయార్ ఆలోచనల సారాంశం…

ఎహె, ఇదంతా ఓ కంగాళీ సమీకరణంలాగా, చిత్రమైన పజిల్లాగా ఉందీ అనుకుంటున్నారా..? ప్రస్తుతం అస్పష్టంగా ఉన్న ఈ పిక్చర్లో సురేఖపై హైకమాండ్ యాక్షన్ తరువాత ఇంకొంచెం స్పష్టత వస్తుంది… తెర వెనుక సూత్రధారుల యవ్వారమూ బయటికొస్తుంది… డీలిమిటేషన్, జమిలి వైపు ప్రయాణించేకొద్దీ తెలంగాణ రాజకీయాల దిశ కూడా మారబోతోంది… మొన్నటి తన కొత్త పలుకుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మర్మగర్భంగా చెప్పుకొచ్చింది కూడా దాదాపు ఇదే..!! ఒకటి మాత్రం క్లియర్… రేవంత్ రెడ్డి బలహీనపడితే, కాంగ్రెస్ పుట్టి మునగడం మాత్రం ఖాయం..!!

Share this Article