.
మీకు తెలుసా..? ఓ పే-ద్ధ ఆర్థిక, మీడియా, సినిమా, టీవీ, చిట్ సామ్రాజ్యాన్ని నిర్మించిన తెలుగు గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ రామోజీరావు వారసుల గురించి… ఇద్దరు పిల్లలు… ఒకరు కిరణ్… ఈటీవీ, ఈనాడు తనే చూస్తాడు… తన భార్య శైలజ కీలకమైన మార్గదర్శి చిట్స్ తనే చూస్తుంది… చిన్న కొడుకు సుమన్…
2012లో మరణించాడు… ఈటీవీ వ్యవహారాలు తనే చూసుకునేవాడు… ఆయన భార్య విజయేశ్వరికి కూడా రామోజీరావు తన సామ్రాజ్యంలో కీలకమైన బాధ్యతలే అప్పగించాడు… ఫిలిమ్ సిటీ, డాల్ఫిన్ ఎట్సెట్రా…
Ads
కిరణ్ సంతానం సహరి, బృహతి, దివిజ… అందరూ రామోజీ సామ్రాజ్యంలోని పలు బాధ్యతలు చూస్తారు… సుమన్ కూతురు కీర్తి సోహన కూడా మంచి బాధ్యతల్లోనే ఉంది… ఇక ఏకైక మగవారసుడు, సుమన్ కొడుకు పేరు సుజయ్… అసలు ఇన్నాళ్లు తన ఫోటో గానీ, వీడియో గానీ చూసి ఉండరు కదా…
తొలిసారి ఈటీవీ ఫ్యామిలీ స్టార్స్ షో తాజా ప్రోమోలో కనిపించాడు… తను ఈటీవీ డైరెక్టర్గా పూర్తి స్థాయి పగ్గాలు తీసుకున్నట్టున్నాడు… తెలుగు వినోద చానెళ్లలో మరీ మూడో స్థానానికి పడిపోయి, పరువు పోతున్న స్థితిలో… ఈమధ్య పలు మార్పులు కనిపిస్తున్నాయి… సీరియల్స్లో, ప్రత్యేకించి రియాలిటీ షోలలో…

ఎందుకు మార్పు అంటే..? ఒకప్పుడు ఈటీవీ అంటే సుమన్… కానీ తను కుటుంబం నుంచి దూరమయ్యాక, పాపం ఈ లోకం వీడిపోయాక… సుమన్ పేరు తలిచేవాళ్లే లేకుండా పోయారు… ఇప్పుడు మళ్లీ సుమన్ పేరు, ఫోటో కనిపిస్తోంది… తన అచ్చమైన వారసుడు సుజయ్ పూర్తి స్థాయి పగ్గాలు చేపట్టాడు కాబట్టి…
సుమన్ కృష్ణుడిగా నటించి, దర్శకత్వం కూడా వహించిన అప్పటి శ్రీకృష్ణ బలరామ యుద్ధం ప్రోమో కనిపించింది… ఆహా… అప్పట్లో ఆ కంటెంటు క్వాలిటీ మీద చాలా వెటకారాలు, విమర్శలు వచ్చాయి కానీ ఫీల్డులో అవన్నీ కామనే కదా… ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ స్పెషల్ షో (రాబోయే) సుమన్కు నివాళి… అప్పటి సీరియల్స్లో ప్రముఖంగా వెలిగిన నటీనటుల్ని తీసుకొచ్చారు…
యమున, సమీర్ తదితరులు కనిపించారు… అప్పటి సీరియల్స్ సిగ్నేచర్ ట్యూన్లు, సాంగ్స్ను సింగర్ కౌసల్య పాడుతోంది… ఇదే కాదు… ఈటీవీ రేటింగ్స్కు బలమైన దన్నుగా ఉన్న జబర్దస్త్లో కూడా మార్పులు… (ఆ షో మీద విమర్శలు ఏమున్నా సరే)… నాగబాబు మల్లెమాలకు తోడుగా సహనిర్మాత… వదిలేసి వెళ్లిన కేరక్టర్లను అందరినీ పట్టుకొస్తున్నారు…
ఈటీవీ విన్, ఈటీవీ బాధ్యతల్లోకి బాగా చదువుకున్న ఐఐటీ, ఐఐఎం మెరికలను… విదేశాల్లో చదువుకున్న వారిని ఎంపిక చేసి మరీ తీసుకొస్తున్నారు… అదీ ఈ మార్పులకు ఓ కారణం కావచ్చు బహుశా… కానీ ఈటీవీకి ఓ కొత్త దశ తీసుకొచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి…
బాగా ఖర్చు పెడుతున్నారు… కొత్త కొత్త సెలబ్రిటీలను పట్టుకొచ్చి స్కిట్లలో నటింపచేస్తున్నారు… అసలు సుడిగాలి సుధీర్ మళ్లీ మల్లెమాల ప్రొడక్షన్స్ కంటెంటులో కనిపించడు అనుకున్నాం, మళ్లీ వచ్చాడు… వదిలేసి వెళ్లిన హైపర్ ఆది కనిపిస్తున్నాడు… పాత సంగతులు చెప్పుకుంటూ రష్మి కన్నీళ్లు పెట్టుకుంది… ఎటొచ్చీ శ్రీదేవి డ్రామా కంపెనీయే నానాటికీ తీసికట్టు యవ్వారంలా ఉంది… ప్రదీప్ను యాంకర్గా తెచ్చుకున్నా సరే…
ఎస్, నిజంగానే సంజయ్ మాంచి బలమైన కొరడా పట్టుకుని ఫస్ట్ రియాలిటీ షోల ప్రక్షాళన, తరువాత సీరియల్స్ నాణ్యత గురించి పట్టించుకుంటే… చానెల్ను కాస్త మంచి స్థితిలో నిలబెడితే… అది సుమన్కు నిజమైన నివాళి… అలాగని ఈటీవీ ప్రభాకర్ను రంగప్రవేశం చేయించాల్సిన అవసరం లేదు..!!
Share this Article