.
రేవంత్ రెడ్డి కేసీయార్ను తిట్టాడు సరే… తాను లేవనెత్తిన ప్రశ్నలపై బీఆర్ఎస్ క్యాంపు కిక్కుమంటే ఒట్టు… తప్పదు కాబట్టి హరీష్ రావు కూడా అలా తిట్టడం మర్యాద కాదు అన్నాడే తప్ప రేవంత్ వదిలిన ప్రశ్నల్లో ఒక్కదానికీ సమాధానం లేదు తన దగ్గర… కేసీయార్ ప్రజాతీర్పును కించపరుస్తున్నాడు ఒకరకంగా… ఎలా..? ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం…
హైదరాబాదులో నిన్న రేవంత్ రెడ్డి ఓ సభలో మాట్లాడుతూ బరస్ట్ అయ్యాడు… కేసీయార్ మీద విరుచుకు పడుతున్నప్పుడు తను అసహనంగా కనిపించాడు… ఆగ్రహాన్ని అణుచుకోలేకపోయాడు, కనిపిస్తూనే ఉంది… తన ప్రభుత్వాన్ని కూల్చడానికి, తన పార్టీలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి, కొందరిని కేసీయార్ జగన్ సాయంతో ఎగదోస్తున్నాడనే సమాచారం బలంగా ఉందేమో తెలియదు… కారణం లేకుండా ఈ రేంజులో పంది అనే పోలికతో కేసీయార్ మీద చెలరేగిపోడు…
Ads

ఐతే తను కొన్ని కీలక ప్రశ్నల్ని చర్చకు లేవనెత్తాడు… ఈ ప్రశ్నలు ఏపీలో జగన్కూ వర్తిస్తాయి… కేసీయార్, జగన్ సంపాదించిన ఆస్తుల్లో వాళ్లకు ఇచ్చే జీతభత్యాలు ఆఫ్టరాల్ నథింగ్ కావచ్చుగాక… కానీ కేసీయార్ 1000 రోజుల జీతమే 1.24 కోట్లు, తన సెక్యూరిటీ, వాహనాలు, ఇతరత్రా ఖర్చులు ఏకంగా 21 కోట్లు… వెరసి ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా పనిచేయని కేసీయార్కు అక్షరాలా రోజుకు 6 లక్షలకు పైగా ఖర్చు !!
నిజానికి అధికారం ఇస్తేనే ప్రజాజీవితంలో ఉండాలా..? లేదంటే మొహం చాటేయాలా..? ఇష్టం లేకపోతే ఆ ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయొచ్చు కదా… అవును, రేవంత్ సంధించిన ప్రశ్న కూడా అదే… రాజీనామా చెయ్, ఆ రాజీనామా కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేయాలనీ పిలుపునిచ్చాడు…

నిజమే కదా… ప్రజలు ఏమని తీర్పు చెప్పారు..? నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, పదేళ్లు సీఎంగా సరిగ్గా పనిచేయలేదు, సో, ఈసారి ప్రతిపక్షంలో ఉండు, ఆ బాధ్యతల్ని నిర్వర్తించు అని చెప్పారు గత ఎన్నికల్లో… కానీ తనేం చేశాడు, ప్రజల తీర్పును తుంగలో తొక్కి, నేలరాచి… జనానికి మొహం చాటేశాడు… రేవంత్ చెబుతున్నట్టు ఆ ప్రతిపక్ష నేత కొలువుకు, ఎమ్మెల్యే పోస్టుకు న్యాయం చేయలేనప్పుడు రాజీనామా చేయడమే నైతికత కదా…
ఇక్కడ కేసీయార్ ఖర్చు రోజుకు 6 లక్షలు అనేది నథింగ్… కానీ అధికారం దక్కకపోతే జనాన్ని పట్టించుకోకూడదా..? దాన్ని ప్రజాజీవితం అంటారా..? మనమడికి దెబ్బ తగిలితే, సమీప బంధువు మరణిస్తే, తన హాస్పిటల్ చెకప్స్ కోసం తప్ప… అసెంబ్లీ సీటు రెన్యువల్ కోసం తప్ప కేసీయార్ అసలు బయటికి వచ్చింది ఎక్కడ..?

నిజంగా ప్రతిపక్ష నేతగా తను ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఇష్యూస్ లేవా..? అసెంబ్లీకి వస్తే దారుణంగా ర్యాగింగ్ ఉంటుందని భయపడుతున్నాడా..? సరే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, జనంలో ఉండొచ్చు కదా..? బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ప్రజాసమస్యలపై పోరాడవచ్చు కదా..? అసెంబ్లీకి రానివాళ్లకు జీతాలు ఎందుకనేది కాదు ప్రశ్న… అసలు ఆ హోదాలో కొనసాగడం దేనికనేదే కీలక ప్రశ్న…
ఏపీలో స్పీకర్ కూడా ఇదే అడిగినట్టు గుర్తుంది జగన్ గురించి ! కానీ జగన్ మంచో చెడో అప్పుడప్పుడైనా జనంలోకి వస్తున్నాడు, పాదయాత్రతో మళ్లీ రాష్ట్రాన్ని చుట్టేయబోతున్నాడు… ఏపీ ప్రజలకు వేరే దిక్కులేదు, మళ్లీ నన్నే కుర్చీ ఎక్కించక గత్యంతరం లేదనే ధీమా ఉంది తనలో… నిజంగానే ఏపీలో ఆల్టర్నేట్ లీడర్ అంటూ లేరు…

కానీ తెలంగాణలో ఆ సిట్యుయేషన్ లేదు… బీజేపీ ఉంది, వాళ్లలోవాళ్లు ఎంత తన్నుకుంటున్నా సరే, బీఆర్ఎస్కన్నా బీజేపీకే కాస్తో కూస్తో ఆదరణ కనిపిస్తోంది… కాకపోతే సరైన లీడర్షిప్ లేకపోవడం దానికి శాపం… సో వాట్, పార్టీలోని తన ‘మద్దతుదారుల’ సాయంతో బీజేపీతో పొత్తు పెట్టుకుని, మళ్లీ అధికారంలోకి రావాలని కేసీయార్ విశ్వప్రయత్నం…

మోదీని నానా మాటలూ అని, బీజేపీని జాతీయ స్థాయిలో బదనాం చేయాలని ఏదో ఎమ్మెల్యేల కొనుగోలు నాటకం ఆడి, అభాసుపాలై, చివరకు బీజేపీ ప్రధాన కార్యదర్శిని కూడా లిఫ్ట్ చేయాలని చూసిన కేసీయార్ ఇప్పుడేమో అక్కడ దేబిరింపులు… కనీసం ఈ మూడేళ్లకాలంలో జనంలో ఉంటే, జనంతో ఉంటే ఈ దురవస్థ ఉండేది కాదేమో… ఐనా దొరతనం… ఆఫ్టరాల్ జనం, మనం చెప్పినట్టు వినాలె… వాళ్లు చెప్పినట్టు మనం వింటామా..? ఇదేనా ఈ పోకడకు అర్థం… అదే నిజమైతే తను రాజీనామా చేస్తేనే ప్రజాతీర్పును గౌరవించినట్టు !! నైతికత కూడా !!
Share this Article