.
టీఎంసీ ఎంపీల ‘ప్రత్యేక గ్రూప్’ ఆలోచనకు బ్రేక్: రాజ్యాంగం ప్రకారం విలీనమే ఏకైక మార్గం! బెంగాల్ ఎన్నికల తదనంతర పరిణామాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన కొందరు ఎంపీలు తిరుగుబాటు బాట పట్టారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దాదాపు 20 మంది ఎంపీలు పార్లమెంట్లో ఒక ‘ప్రత్యేక బ్లాక్’ (Special Block) లేదా ‘ప్రత్యేక వర్గం’గా ఏర్పడి, కేంద్రంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, ప్రస్తుత రాజ్యాంగ నిబంధనలు, కఠినమైన ఫిరాయింపు నిరోధక చట్టం (Anti-Defection Law) ప్రకారం ఇలాంటి ‘ప్రత్యేక వర్గాల’కు చట్టసభల్లో మనుగడ లేదు. తిరుగుబాటు ఎంపీల ముందున్న చట్టపరమైన చిక్కులు, మహువా మొయిత్రా తాజాగా లేవనెత్తిన పాయింట్లలోని వాస్తవికత, మహారాష్ట్ర తరహా వ్యూహాలు ఇక్కడ ఎందుకు వర్తించవు అనే అంశాలపై మాట్లాడుకుందాం…
Ads
1. చీలిక (Split) చట్టబద్ధం కాదు: ‘ప్రత్యేక వర్గం’ అనే మాటే లేదు
రాజకీయాల్లో తరచూ వినిపించే మాట— “పార్టీలో మూడింట రెండొంతుల (2/3) మంది ప్రజాప్రతినిధులు విడిపోతే వారికి ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు.” కానీ ఇది సగం నిజం మాత్రమే.
గతంలో (2003 కంటే ముందు) ఒక పార్టీలోని 1/3 వంతు మంది సభ్యులు విడిపోయి ప్రత్యేక గ్రూప్గా ఏర్పడితే చట్టం రక్షణ కల్పించేది. కానీ, రాజకీయ ఫిరాయింపులను అరికట్టేందుకు పార్లమెంట్ 91వ రాజ్యాంగ సవరణ (2003) ద్వారా ఈ చీలక (Split) నిబంధనను పూర్తిగా రద్దు చేసింది.
ప్రస్తుత చట్టం ఏం చెబుతోంది?:
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం, చట్టసభల్లో (పార్లమెంట్/ అసెంబ్లీ) ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎంతమంది విడిపోయినా, వారు సభలో తమకంటూ ఒక “ప్రత్యేక గుర్తింపు కలిగిన వర్గం” (Recognized Group) లేదా “స్వతంత్ర బ్లాక్” ఏర్పాటు చేసుకోవడానికి చట్టం అంగీకరించదు. అలా గ్రూప్గా కూర్చుంటామంటే మరుక్షణమే వారిపై అనర్హత వేటు పడుతుంది.
2. మహారాష్ట్ర తరహా ‘మేమే అసలు పార్టీ’ క్లెయిమ్ ఇక్కడ సాధ్యం కాదు
మహారాష్ట్రలో శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)లు విడిపోయినప్పుడు వారి పదవులు ఊడకపోగా, వారే అసలైన పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నారు కదా అనే ప్రశ్న రావచ్చు. కానీ, అక్కడి వ్యూహానికి, బెంగాల్ ప్రస్తుత పరిస్థితుల్లో తేడా ఉంది.
మహారాష్ట్ర తిరుగుబాటుదారులు వాడిన అస్త్రం: “మేము పార్టీ మారలేదు, మూల పార్టీయే మాది” అని ఎన్నికల సంఘం (EC) ముందు నిరూపించుకోవడం. అందుకోసం వారు రెండు విభాగాల్లో మెజారిటీ చూపించారు:
లెజిస్లేటివ్ వింగ్: చట్టసభల్లోని మెజారిటీ (80% పైగా ఎమ్మెల్యేలు షిండే వైపు వెళ్లారు).
ఆర్గనైజేషనల్ వింగ్: పార్టీ పునాది శ్రేణులు (జిల్లా అధ్యక్షులు, జాతీయ కార్యవర్గం, కౌన్సిలర్లు).
టీఎంసీ విషయంలో ఎందుకు కుదరదంటే…
టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు లోక్సభలో 2/3 వంతు సంఖ్యాబలాన్ని సాధించగలరేమో కానీ, పశ్చిమ బెంగాల్లోని పార్టీ ఆర్గనైజేషనల్ కమిటీలన్నింటినీ… ఇదే భయసందేహాలతో మమతా బెనర్జీ రద్దు చేసింది… ఢిల్లీలో కూర్చున్న 20 మంది ఎంపీలు వెళ్లి, “బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాదే” అని ఎన్నికల సంఘం (EC) ముందు క్లెయిమ్ చేస్తే అది ఒక్క నిమిషం కూడా నిలబడదు…
3. సుప్రీం కోర్టు తీర్పు – ‘పొలిటికల్ పార్టీ’ వర్సెస్ ‘లెజిస్లేచర్ పార్టీ’
2023లో శివసేన వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన “సుభాష్ దేశాయ్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మహారాష్ట్ర” తీర్పు ఈ తిరుగుబాటుదారుల ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లింది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ లైన్ గీసింది.
సుప్రీంకోర్టు తీర్పు సారాంశం:
సభలో ఉండే ప్రజాప్రతినిధుల గ్రూప్ (Legislature Party) అనేది స్వతంత్రమైనది కాదు. అది కేవలం మాతృ పార్టీ (Political Party) కింద పనిచేసే ఒక విభాగం మాత్రమే. సభలో ఎవరికి ఎంత మెజారిటీ ఉన్నా.. బయట ఉన్న మాతృ పార్టీ (పొలిటికల్ పార్టీ) అధిష్టానం జారీ చేసే విప్ (Whip) కే ఎంపీలు కట్టుబడి ఉండాలి. సభలోని మెజారిటీ సభ్యులు కలిసి తమకు నచ్చినట్లు విప్ను మార్చేయడానికి వీల్లేదు.
ఈ తీర్పు ప్రకారం… రేపు లోక్సభలో టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు విడిగా కూర్చున్నా, బయట మమతా బెనర్జీ నియమించిన చీఫ్ విప్ జారీ చేసే ఆదేశాలనే వారు పాటించాలి. ఒకవేళ ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినా, లేదా సభకు గైర్హాజరైనా… మాతృ పార్టీ ఫిర్యాదు మేరకు స్పీకర్ వారిపై తక్షణమే అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది.
4. విలీనమే శరణ్యం (Merger is the Only Way)
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పారా 4 ప్రకారం.. తిరుగుబాటు ఎంపీల ముందున్న చట్టబద్ధమైన, ఏకైక సురక్షిత మార్గం: మరో రాజకీయ పార్టీలో అధికారికంగా విలీనం కావడం.
నిబంధన: టీఎంసీ లోక్సభ సభ్యుల్లో కనీసం 2/3 వంతు మంది ఏకతాటిపైకి వచ్చి, తాము అస్తిత్వాన్ని కోల్పోయి పూర్తి స్థాయిలో బీజేపీలోనో లేదా ఎన్డీయేలోని మరో అధికారిక పార్టీలోనో “విలీనం” (Merge) అవుతున్నట్లు ప్రకటించాలి.
రెండో వైపు అంగీకారం: ఈ 2/3 వంతు మంది విలీన ప్రతిపాదనను అవతలి పార్టీ (ఉదాహరణకు బీజేపీ) కూడా అధికారికంగా అంగీకరిస్తూ తీర్మానం చేయాలి.
అప్పుడు మాత్రమే చట్టం వారికి రక్షణ కల్పిస్తుంది. అంతేకానీ, మేము విలీనం కాము, బీజేపీకి బయట నుండి మద్దతు ఇస్తూ ‘టీఎంసీ (రెబెల్)’ లేదా ‘ప్రజాస్వామ్య టీఎంసీ’ అనే పేరుతో ప్రత్యేక బ్లాక్గా చట్టసభల్లో కొనసాగుతామంటే మాత్రం స్పీకర్ చేతిలో అనర్హత వేటు పడటం ఖాయం.
చట్టం ముందు రాజకీయ వ్యూహాలు పారవు!
మహారాష్ట్రలో జరిగిన రాజకీయ భూకంపం వేరు, చట్టంలోని నిబంధనలు వేరు. మహారాష్ట్ర కేసు తర్వాత సుప్రీంకోర్టు కంటికి నిద్రలేకుండా చట్టాన్ని మరింత పటిష్టం చేసింది. కాబట్టి, టీఎంసీ ఎంపీలు కేవలం సంఖ్యాబలాన్ని చూసుకుని విర్రవీగితే సరిపోదు. వారు ఎంపీ పదవులను కాపాడుకోవాలంటే.. తమ సొంత జెండాను, అస్తిత్వాన్ని పూర్తిగా వదిలేసి, వేరే పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధపడాలి (విలీనం అవ్వాలి). అలా కాకుండా “మధ్యంతర మార్గాలు” వెతుకుతామంటే చట్టపరంగా వారి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లే….
Share this Article