.
Srini Journalist …. దేశ ఆర్థిక విధానాలకు గండికొడుతున్న 441 కిలోల ఉచిత బంగారం టెండర్లు…
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పడిపోకుండా కాపాడటానికి, దేశంలో ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను (డాలర్లను) భద్రపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది.
దేశం నుండి డాలర్లు అనవసరంగా బయటకు పోకుండా ఉండేందుకు, బంగారం దిగుమతులపై సుంకాన్ని (Import Duty) పెంచడమే కాకుండా, ముడి బంగారం దిగుమతులపై కఠినమైన పరిమితులు విధించింది. దేశ ఆర్థిక భద్రత కోసం వీలైనంత వరకు బంగారం వినియోగాన్ని తగ్గించాలని కేంద్రం స్పష్టమైన నిబంధనలు అమలు చేస్తోంది.
Ads
అయితే, ఈ జాతీయ ఆర్థిక వ్యూహాలకు పూర్తిగా విరుద్ధంగా తమిళనాడు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఏకంగా రూ. 755.83 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ, దాదాపు 4,41,667 ఉంగరాల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. పథకం ప్రకారం ప్రతి శిశువుకు ఒక గ్రాము చొప్పున ఇస్తుండటంతో, ఇది మొత్తం 4,41,667 గ్రాములు—అంటే ఏకంగా 442 కిలోల భారీ భౌతిక బంగారం అవుతుంది.
ఒకవైపు దేశవ్యాప్తంగా బంగారం వాడకాన్ని తగ్గించాలని కేంద్రం ప్రయత్నిస్తుంటే, మరోవైపు తమిళనాడు ప్రభుత్వం ఒకే కాంట్రాక్ట్ ద్వారా 442 కిలోల బంగారానికి కృత్రిమ డిమాండ్ సృష్టించడం దేశ ఆర్థిక ప్రయోజనాలనే దెబ్బతీసేలా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఖజానా ఖాళీ అన్న సర్కార్.. మిత్రుడి భేటీ తర్వాతే రూ. 756 కోట్ల టెండర్లా?
ప్రస్తుతం ఒకపక్క అంతర్జాతీయంగా ఇరాన్ సంక్షోభం కారణంగా ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు, విదేశీ కరెన్సీని కేవలం ఆయిల్ లాంటి అత్యవసర దిగుమతులకే వాడాలని, ప్రస్తుత తరుణంలో బంగారం లాంటి వాటి కొనుగోళ్లు దేశానికి అస్సలు ముఖ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రవర్తన ఇప్పుడు తీవ్ర అనుమానాలకు తావిస్తోంది! అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆయన తన ప్రభుత్వం తరఫున ఒక శ్వేతపత్రం (White Paper) విడుదల చేస్తూ, రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీగా ఉందని, ఆర్థిక పరిస్థితి బాగోలేనందున ప్రస్తుతానికి ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయలేనని చాలా నిజాయితీగా ప్రకటించారు.
- ఆ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలు ‘అబ్బా, ఎంత ప్రాక్టికల్ సీఎం’ అంటూ విజయ్ను ఎంతగానో అభినందించారు. అయితే, ఆ ప్రకటన వచ్చిన కొద్దిరోజులకే ప్రముఖ ప్రైవేట్ జ్యువెలరీ సంస్థ ‘జోస్ ఆలుక్కాస్’ అధినేత ముఖ్యమంత్రి విజయ్ను అధికారికంగా కలిశారు. గతంలో విజయ్ ఇదే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం, వారిద్దరి మధ్య ఉన్న పాత స్నేహం అందరికీ తెలిసిందే.
ఈ ఇద్దరు మిత్రుల భేటీ జరిగిన వెనువెంటనే.. ఖజానాలో నిధులు లేవన్న ముఖ్యమంత్రి, ఏకంగా రూ. 756 కోట్ల ప్రజాధనంతో ఈ ఉచిత బంగారం టెండర్లను అత్యంత వేగంగా తెరపైకి తీసుకురావడం రాజకీయ, వ్యాపార వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంటే, తన పాత మిత్రుడి వ్యాపార ప్రయోజనాల కోసమే విజయ్ ఈ భారీ స్కీమ్ను అర్జెంట్గా రంగంలోకి దించారా? అనే పెద్ద ప్రశ్న ఇప్పుడు సర్వత్రా రేకెత్తుతోంది!
Share this Article