.
ఒక్కొక్క పొర వీడిపోతోంది… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదో వెల్ ప్లాన్డ్ కుట్రపై మెల్లిగానైనా ఓ స్పష్టత వస్తోంది… పాత్రధారులు బయటపడుతున్నారు, సూత్రధారులు ఎవరో బయటపడాల్సి ఉంది…
పార్టీ క్రమశిక్షణ కమిటీ నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చినా సరే, ఒక మంత్రి విషయంలో నిర్ణయం తీసుకోలేని ఎఐసీసీ, హైకమాండ్ ఆ కుట్ర ఏమిటో తెలుసుకోవాలనీ, కట్టడి చేయాలని నిజంగా ప్రయత్నిస్తుందా..? ఏ చర్యలూ తీసుకోలేక, ఇంకా ఇలాంటి కుట్రల్ని పరోక్షంగా ప్రోత్సహిస్తుందా కూడా తేలాల్సి ఉంది…
Ads
నా బిడ్డ ప్లాన్-ఏ ప్రకారం మాట్లాడింది – ప్లాన్-బి ఏమిటో నాకు తెలియదు… అని కొండా మురళి చెబుతున్నాడు… అంటేనే అర్థం అవుతోంది కదా… భట్టి దగ్గరకు వెళ్తాడు, నా బిడ్డ మాటలతో సంబంధం లేదు అంటాడు, తనే ప్లాన్-ఏ అయిపోయింది అంటాడు… అంటే అన్నీ తెలిసీ, బిడ్డతో తనే మాట్లాడిస్తున్నాడు అనే కదా… ప్లాన్-బీ తెలియదు అంటే చర్య తీసుకుంటే మరింత సీరియస్గా రియాక్ట్ అవుతామని హెచ్చరిస్తున్నట్టే కదా…
బిడ్డ తెలియక మాట్లాడింది అని అంటోంది సురేఖ… తెలియక మాట్లాడిందే నిజమైతే ఖండించలేదేం..? సో, అన్నీ ప్లాన్డ్ స్కెచ్ ప్రకారమే జరుగుతున్నాయి అని! మేం పార్టీని వదిలిపెట్టం అంటున్నాడు మురళి… మరోవైపు జనసేన రాష్ట్ర అధ్యక్షుడు కొండా దంపతులు మాతో టచ్లో ఉన్నారు అంటున్నాడు, ఆ వ్యాఖ్య అబద్ధం అయితే దాన్ని ఎందుకు ఖండించలేదు..?
ఎఐసీసీ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది..? మధ్యలో భట్టి, ఉత్తమకుమార్ రెడ్డిలు ఎందుకు ఎంటరయ్యారు..? వాళ్లు క్రమశిక్షణ కమిటీలో లేరు, ఎఐసీసీ బాధ్యులు కారు, ఈ వ్యవహారంపై నిర్ణయాలు తీసుకునే బాధ్యతను హైకమాండ్ అప్పగించిందా..? ఏ హోదాలో..? ఆ భేటీకి ముఖ్యమంత్రి వ్యతిరేకి రాజగోపాలరెడ్డి హాజరు దేనికి..? అన్నీ అనుమానాస్పదాలే కదా…
ఒకవేళ నచ్చజెప్పి, ఆమెతో రాజీనామా చేయించాలని ఎఐసీసీ భట్టికి ఓ పెద్దమనిషిగా బాధ్యతలు అప్పగించిందే అనుకుందాం..,. మరి మళ్లీ ఖర్గే దగ్గరకు వెళ్లి ఏం చర్చిస్తున్నట్టు..? ఈ మొత్తం పరిణామాల వెనుక ఏదైనా బలమైన కుట్ర ఉందని వివరిస్తున్నట్టు అని అర్థం చేసుకోవాలా..?
ఒక ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఒక మంత్రి సురేఖ… వీళ్లపై చర్యకూ ఎఐసీసీ ఎందుకింత సందేహిస్తోంది..? పోనీ, ఎందుకు భయపడుతోంది..? ఈ స్థితిలో గనుక హైకమాండ్ కఠినంగా వ్యవహరించలేకపోతే… రేవంత్ రెడ్డిని చేజేతులా బలహీనపరిస్తే… వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్- బీజేపీ కూటమి అధికారంలోకి రావడం మాత్రం పక్కా..!!
చిన్న విషయం చెప్పి ముగిద్దాం… శాసనసభ ఎథిక్స్ కమిటీ అధ్యక్షుడు రేవూరి ప్రకాష్ రెడ్డి… ఆల్రెడీ ఈ కమిటీ పాడి కౌశిక్ రెడ్డి మీద విచారణ జరపనుంది… 29న భేటీ ఉంది… కడియం శ్రీహరిపై తన సైగలతో అనుచితంగా అవమానించాడని ఆరోపణ… సరే, ఆ కమిటీ ఏం నిర్ణయిస్తుందనేది పక్కన పెడితే… కొండా సుస్మిత డైపర్ నాయకుడని వెక్కిరించిన ప్రకాశ్ రెడ్డే ప్రస్తుతం ఎథిక్స్ కమిటీని లీడ్ చేస్తున్నాడు…
సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేసినా, తొలగించబడినా… తదుపరి చర్యగా ఎథిక్స్ కమిటీకి కూడా సురేఖ కేసు అప్పగిస్తే..? దాన్ని తప్పించుకోవడానికేనా నాకు నా బిడ్డ వ్యాఖ్యలతో సంబంధం లేదు అని పదే పదే చెప్పేది..?! రేవంత్ రెడ్డి మాత్రం సైలెంటుగా ‘కాగల కార్యం హైకమాండ్ చూసుకుంటుంది’ అన్నట్టు గుంభనంగా ఉన్నాడు… కానీ తనకూ తెలుసు, తనపై కుట్రల్ని ఇప్పుడే కత్తిరించకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని!!
కొసమెరుపు :: సురేఖను ఎలాగూ తొలగిస్తారు కాబట్టి అదే సామాజికవర్గం కోటాలో తన బిడ్డకు అవకాశం ఇవ్వాలని కేశవరావు ఆల్రెడీ తన ప్రయత్నాలు ప్రారంభించాడని ఎక్కడో చదివినట్టు గుర్తు..!!
Share this Article