.
నిజంగా మన క్రికెట్ ప్రేమికులకు మొక్కాలి… మన క్రికెట్ పిచ్చికి సాటి వచ్చేదేమీ లేదనిపిస్తుంది… రాత్రి ఐపీఎల్ మ్యాచ్ సంగతే తీసుకొండి… లక్నో జట్టు… వరుసగా అయిదు మ్యాచులు ఓడిపోయి ఉంది… పాయింట్ల టేబుల్లో చివరి స్థానం దానిదే… ముంబై జట్టు… వరుసగా మూడు మ్యాచులు ఓడిపోయి ఉంది… పాయింట్ల టేబుల్లో లక్నోకు పైన 9వ స్థానంలో ఉంది అదే… ఆ రెండింటి నడుమ పోటీ…
ఎంత పోరాడినా, ఎవరు గెలిచినా… ఆ స్థానాలు మారవు… ఆ రెండూ ప్లేఆఫ్కు వెళ్లే సీన్ కూడా లేదు… కానీ ఇదేదో ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నంత గట్టిగా, శ్రద్ధగా ఆడారు… అది మెచ్చుకోవచ్చు… ఏ మ్యాచునూ వదలొద్దునే స్పిరిట్ మంచిదే… ఇంత అప్రధానమైన మ్యాచ్ కదా, చూడటానికి ఎవరొస్తారులే అనుకున్నారా..?
Ads
నో, వాంఖడే స్టేడియం కిటకిటలాడిపోయింది… మన నగరంలో క్రికెట్ మ్యాచ్, మన పేరు పెట్టుకున్న ముంబై జట్టు ఆడుతోంది… గెలుపా ఓటమా జానేదేవ్, వెళ్లాల్సిందే, చూడాల్సిందే, కేరింతలు కొట్టాల్సిందే… ఇదుగో ఇదే ఐపీఎల్ జట్లకు కాసుల వర్షం కురిపించేది…
ఇక్కడ చెప్పుకోదగిన మరో విశేషమూ ఉంది… కాస్తోకూస్తో ఆశలు ఉన్న స్థితిలో జట్టులో మార్పులు చేసుకున్నా బాగుండేదేమో… ఈ అప్రధాన మ్యాచ్కు రెండు జట్లు పలు మార్పులు చేసుకుని మరీ రంగంలోకి దిగాయి… ఈసారి విశేషం ఏమిటంటే..? గాయం కారణంగా పలు మ్యాచులకు దూరమైన రోహిత్ శర్మ బ్యాటింగుకు వచ్చాడు ఇంపాక్ట్ ప్లేయర్గా… తనదైన శైలిలో దంచి కొట్టాడు…
ఏమాటకామాట… లక్నో ప్లేయర్లు మార్ష్, పూరన్, చివరలో హిమ్మత్ సింగ్ దంచి కొట్టడంతో 228 పరుగులు చేశారు… ఒక దశలో ఓపెనర్ల ధాటి ఆట చూస్తే 300 దాకా కొడతారేమో అనిపించింది… వాళ్ల ఓనర్ తిట్టేకొద్దీ నాసిరకం ఆట ప్రదర్శించే రిషబ్ పంత్ మళ్లీ ఫెయిల్… ఇక్కడ బుమ్రా గురించి చెప్పాలి, 10 మ్యాచుల్లో కేవలం మూడు వికెట్లు… ఈ మ్యాచులో ధారాళంగా పరుగులు ఇవ్వడమే కాదు, ఎడాపెడా నోబాల్స్ వేశాడు… అసలు తను బుమ్రానేనా..?
తరువాత బ్యాటింగ్ చేసిన ముంబై ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ 83, 84 పరుగులు చేశారు ధాటిగా… వాళ్ల స్పీడ్ చూస్తే పదీపన్నెండు ఓవర్లలో ముగించేస్తారనిపించింది… ఎప్పటిలాగే సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ఫెయిల్… కెప్టెన్ హార్దిక్ పాండ్యా లేకపోవడంతో సూర్యకుమారే కెప్టెన్గా వ్యవహరించాడు… ఎట్టకేలకు ముంబై గెలిచింది, లక్నో ఓడింది… ఇంత టార్గెట్ ఛేజ్ చేయడం ముంబైకి ఇదే ప్రథమం… సరే, ఫలితం ఏమిటో తెలుసా..? పాయింట్ల పట్టికలో అవి తమ యథాస్థానాల్లోనే పదిలంగా ఉన్నాయి..!!
Share this Article