.
బహుశా ఇది మొదటిసారి అనుకుంటా… బెంగాల్లో ఎగ్జిట్ పోల్ నిర్వహించలేకపోవడం, బయటికి ప్రకటించలేకపోవడం మీద యాక్సిస్ మై ఇండియా చేసిన ప్రకటన… ఓ పాపులర్ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ కసరత్తు ప్రారంభించి… ‘ఎవరూ బయటికి ఏమీ వెల్లడించడం లేదు’ అంటూ ఆ పోల్ కసరత్తు ఆపేసి, జనానికి కూడా అదే చెప్పుకోవడం దేశంలో బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా…
సాధారణంగా ఏ ఎన్నికలైనా Axis My India ఎగ్జిట్ పోల్ను చాలామంది పరిగణనలోకి తీసుకుంటారు… కానీ అది ఈసారి బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేకపోవడం సంచలనంగా మారింది… దీనికి కారణం ‘ఓటరు నిశ్శబ్దం’… దాదాపు 70% మంది ఓటర్లు తాము ఎవరికి ఓటేశామో చెప్పడానికి నిరాకరించడంతో, శాంపిల్ సరిగ్గా లేక ఫలితాన్ని ప్రకటించలేమని ఆ సంస్థ స్పష్టం చేసింది… బెంగాల్లో నెలకొన్న భయానక వాతావరణం లేదా ఓటరు మనసులో ఉన్న బలమైన వ్యతిరేకత/మద్దతు ఏదైనా కావొచ్చు… కానీ నాడి మాత్రం ఎవరికీ దొరకలేదు…
Ads
టుడేస్ చాణక్య (Today’s Chanakya) అంచనా… బీజేపీ వైపే మొగ్గు? ఎగ్జిట్ పోల్స్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర ఉన్న ఈ సంస్థ మాత్రం ఈసారి బెంగాల్లో ‘కాషాయ జెండా’ ఎగరబోతోందని జోస్యం చెప్పింది… కాస్త లేటుగా విడుదల చేసినట్టున్నారు… వారి తాజా అంచనాల ప్రకారం… బీజేపీ: 192 స్థానాలు (సుమారు), TMC: 100 స్థానాలు (సుమారు)…
చాణక్య లెక్క నిజమైతే, మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు తెరపడినట్లే… మహిళా ఓటర్లు, నిశ్శబ్ద ఓటింగ్ అంతా బీజేపీకి అనుకూలంగా మారిందని ఈ లెక్కలు చెబుతున్నాయి… కానీ వేర్వేరు సర్వే సంస్థలు వేర్వేరు ఫలితాల్ని చెబుతున్నాయి… ఓ పేద్ద గందరగోళం… నిజానికి సర్వేలు ఎప్పుడూ నిజం కావాలని ఏమీ లేదు, అడ్డంగా బోల్తాకొట్టిన ఉదాహరణలు బోలెడు…
ఐతే ఈసారి బెంగాల్ ఎన్నికల వాతావరణం వేరు… అందుకని అందరిలోనూ ఓ ఉత్కంఠ నెలకొంది… అసలు ఎన్నికల ఫలితాల్ని సరిగ్గా అంచనా వేసే సట్టా బజార్ కూడా ఇప్పుడు ఏమీ అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది… అటు బుకీలు, ఇటు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఎవరి లెక్కల్లో వారు ఉన్నా… గ్రౌండ్ లెవల్లో ఓటరు మాత్రం ‘సైలెంట్’గా ఉండటం రాజకీయ పండితులను విస్మయానికి గురి చేస్తోంది…
సట్టా బజార్ దందా… ఈసారి ఎందుకీ తిరకాసు? సట్టా బజార్ది ‘దందా’ కాబట్టి వాళ్లు రూపాయి పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండరు. కానీ ఈసారి ఫలోడి, ముంబై మార్కెట్ల మధ్య కూడా ఏకాభిప్రాయం లేదు… ముంబై మార్కెట్ బీజేపీకి మెజారిటీ వస్తుందని రేట్లు కడుతోంది… ఢిల్లీ మార్కెట్ TMC మళ్ళీ అధికారంలోకి వస్తుందని పందెం కాస్తోంది… ఎప్పుడూ ఒకే దారిలో ఉండే ఈ మార్కెట్లు ఇలా వేర్వేరుగా ఉండటం చూస్తుంటే… బెంగాల్ తీర్పు ఎంతటి ‘నైల్ బైటింగ్’ ఫినిష్ ఇవ్వబోతోందో అర్థం చేసుకోవచ్చు…
ఈసారి పోలింగ్ శాతం విపరీతంగా పెరగడం, వోటరు సైలెంటుగా ఉండటంతో ఫలితం ఎవరి అంచనాలకూ అందడం లేదు… మే 4 వరకు వేచి చూడాల్సిందే! ఓటరు తన మనసులో ఏముందో ఈవీఎంలలో భద్రపరిచాడు… ఆ రహస్యం బయటపడాలంటే మే 4 వరకు ఆగాల్సిందే… అప్పటివరకు ఈ ఎగ్జిట్ పోల్స్, సట్టా బజార్ అంచనాలు కేవలం చర్చలకు మాత్రమే పరిమితం… చివరకు దీదీ హ్యాట్రిక్ కొడుతుందా లేక బెంగాల్లో కొత్త చరిత్ర మొదలవుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న…
Share this Article