.
Subramanyam Dogiparthi …. చాలా మంచి ఎమోషనల్ , సెంటిమెంటల్ సినిమా 1992 ఆగస్టులో వచ్చిన ఈ అక్కమొగుడు సినిమా . రాజశేఖర్ నట జీవితంలో ఏంగ్రీ మేన్ గా ఎన్ని సినిమాలు ఉన్నా తండ్రిలాంటి ఈ అక్కమొగుడు పాత్ర ప్రేక్షకులు మరచిపోలేనిది . అసలీ కధను నేసిన సుజయ మూవీస్ యూనిట్ని ముందుగా అభినందించాలి . టైటిల్సులో కధ క్రెడిట్ యూనిట్టుకి ఇవ్వడం జరిగింది . అసలు ఎవరు వ్రాసారో ! బాగా వ్రాసారు .
ఒక స్త్రీ మానాన్ని కాపాడే క్రమంలో హంతకుడు అయి ఏడేళ్లు జైలుశిక్షను అనుభవించి కార్ మెకానిక్ అవుతాడు హీరో . అతని షెడ్డుకి ఎదురింట్లో నలుగురు చెల్లెళ్ళను సాకుతూ సుహాసిని ఉంటుంది . మొదట్లో హీరోని ద్వేషించినా తర్వాత అతని గొప్పతనం తెలుసుకుని దగ్గర అవుతుంది . భార్యాభర్తలు అవుతారు .
Ads
ఆ తర్వాత అక్కమొగుడు తండ్రి అయి నలుగురు మరదళ్ళ పెళ్ళిళ్ళు జరిపేందుకు కంకణం కట్టుకుంటాడు . ఇంతలో అతనికి ప్రాణాంతక అనారోగ్యం ఉందని తెలవటంతో ఆఘమేఘాల మీద మరదళ్ళ పెళ్ళిళ్ళు ఫైనలైజ్ చేసి , పెళ్లి మంటపంలోనే ప్రాణాలు వదలటం , అదే సమయంలో సుహాసిని బిడ్డను కనటం జరుగుతాయి . మరదళ్ళే తండ్రిలాంటి బావ పాడెను మోస్తారు . కా చింతే మరణే రణే అనే సూక్తితో సినిమా ముగుస్తుంది .
బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకుని అంతే బిర్రుగా సినిమాను నడిపించిన దర్శకుడు క్రాంతికుమార్ని మెచ్చుకోవాలి . సెంటిమెంటల్ , ఎమోషనల్ సీన్లను అద్భుతంగా పండించారు . 1990s లో ఇలాంటి సెంటిమెంటల్ సినిమాని ప్రేక్షక రంజకంగా తీయటం గొప్ప విషయం .
సుహాసిని గొప్పగా నటించింది . తల్లిలాగా చెల్లెళ్ళను పెంచుతూనే అప్పుడప్పుడు స్త్రీ సహజమైన అసూయతో చెల్లెళ్ళ మీదే విరుచుకుపడే సన్నివేశాల్లో బాగా నటించింది . రాజశేఖర్ , సుహాసినిల తర్వాత చెప్పుకోవలసింది కోట శ్రీనివాసరావు నటననే . రక్తకన్నీరులో నాగభూషణం డైలాగ్ డెలివరీతో నటించారు .
నలుగురు చెల్లెళ్ళుగా దివ్యవాణి , కిన్నెర , అంజలి , రాధ ; ఇతర పాత్రల్లో మల్లికార్జున రావు , అచ్యుత్ , సుధారాణి , జయలలిత , బెనర్జీ తదితరులు నటించారు . రాజ్- కోటి చాలా శ్రావ్యమైన సంగీతాన్ని , చక్కటి బేక్ గ్రౌండ్ స్కోరుని అందించారు . నేటి తరం సంగీత దర్శకులు , దర్శకులు తప్పక అధ్యయనం చేసుకోండి . మీ సినిమాలు audible అవుతాయి , తద్వారా చూడబుల్ అవుతాయి .
ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పాట అక్కాచెల్లెళ్ళ మధ్య సరదాగా సాగే పాట . అక్కమ్మ అక్కమ్మ అందాల చుక్కమ్మ ఏమమ్మా వైనమేమమ్మా పాట . వరకట్నం సినిమాలో కృష్ణకుమారి , సావిత్రి మధ్య సాగే మరదలా మరదలా తమ్ముని పెళ్ళామా అంటూ సాగే సరసం పాట గుర్తుకొస్తుంది .
నలుగురు చెల్లెళ్ళ పాట శుభలేఖ రాసినట్టే కన్ను కొట్టె అక్కగారు , శ్రీమంతం పాట సంసారం సంతానం సతి కోరేటి ఆది సౌభాగ్యం , చెలియ చెలియ మదంతా గోలగోల , భజన సేయవె మనసా అంటూ సాగే పాటలు శ్రావ్యంగా ఉంటాయి . పాటల్ని వేటూరి వ్రాయగా బాలసుబ్రమణ్యం , మిన్మినీ , చిత్ర శ్రావ్యంగా పాడారు . (Minmini అంటే రోజా సినిమాలో చిన్ని చిన్ని ఆశ సాంగ్ పాడిన గాయని)
తరచూ ఏదో ఒక చానల్లో వస్తూ ఉంటుంది . నాకు బాగా నచ్చిన సినిమా . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనట్లయితే తప్పక చూడతగ్గ సినిమా .
Share this Article