.
‘‘కత్తి ఒకరికిచ్చి మమ్మల్ని యుద్ధం చేయమంటే ఎలా..?’’ ఇదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ… కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ లేఖ రాయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా, దానిపై స్పందన అన్నమాట… కానీ కత్తి ఒకరికిచ్చారు, మేమెలా యుద్ధం చేయగలం అనేదే నిజమైతే… సీబీఐకి ఇవ్వండి, తెల్లారే కేసీయార్ను మూసేస్తాం అని పదే పదే సవాళ్లు విసిరింది ఎవరు మరి..?
Ads
మరేమైంది..? ఇన్ని నెలలైనా సీబీఐ అడుగు కూడా ముందుకు వేయడం లేదు… దేనికి..? కేసీయార్తో రాబోయే రోజుల్లో పొలిటికల్ అవగాహనో, పొత్తో, సర్దుబాటో, నిమజ్జనమో, విలీనమో జరుగుతుందని ఆశ- నమ్మకం… అందుకే కేసీయార్ మీద ఈ దయ… అసలు కేంద్రం చేతుల్లోకి కాళేశ్వరం కేసు తెచ్చుకోవడమే కేసీయార్ను ప్రొటెక్ట్ చేయడానికి…
పైగా కత్తి ఎవరికిచ్చారు ప్రజలు… మీకు కాదా..? కేంద్రంలో ఉన్నది మీరు కాదా… మామూలు కత్తి కాదు, పెద్ద కరవాలమే ఉందిగా మీ చేతుల్లో, అదీ ప్రజలు ఇచ్చిందే కదా… మరెందుకు యుద్ధం చేతకాదు..? పైగా అరకొర దర్యాప్తు కారణంగానే హైకోర్టులో కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డికి భంగపాటు అంటున్నాడు తను… అది ఘోష్ కమిషన్ అనుసరించిన పద్దతులపై కోర్టు అభ్యంతరాలే తప్ప, కమిషన్ ఏర్పాటును, విచారణను అది తప్పుపట్టలేదు… సీబీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న దర్యాప్తు వేరు..,
అవన్నీ పక్కన పెట్టేసి, పాత సవాళ్లు కూడా మరిచిపోయి… ఇప్పుడు కత్తి- యుద్ధం అని మాట్లాడుతున్నాడు… అంతేకాదు, తుమ్మిడిహట్టి ఎత్తు 150 మీటర్లకు పెంచుకునే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడే బాధ్యత తీసుకోవాలని రేవంత్ రెడ్డి నిన్న చెప్పాడు కదా… అది తెలంగాణ ప్రయోజనం కోసమే కదా… మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా… ఈ విషయంపై వీసమెత్తు స్పందన లేదు కిషన్ రెడ్డి నుంచి..!! రాజకీయాలు తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టవా..?
కాకపోతే, కేసీయార్తో రహస్య దోస్తీ, భవిష్యత్తు కలయికలపై జనంలో బలమైన అభిప్రాయాలు కన్సాలిడేట్ అవుతున్నాయి కాబట్టి… అప్పుడప్పుడూ విమర్శలు తమలపాకుతో కొట్టినట్టు చేస్తుంటారు… పార్లమెంటులో తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చడం నిజం… ఈరోజుకూ ఈ విషయంలో తెలంగాణ బీజేపీ ఎంపీలకు సమాధానం చెప్పుకోవడానికి మొహం చెల్లడం లేదనేదీ నిజం… కాకపోతే మొన్న ఏదో మీటింగులో కేసీయార్ మాట్లాడుతూ ‘‘వెధవ, అలా మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లు’ అన్నాడు…
దీనిపై కిషన్ రెడ్డి ‘‘‘రెండున్నరేళ్ల తర్వాత బయటకు వచ్చి, పార్లమెంటులో వాడు వెధవ వీడు వెధవ అంటూ మాట్లాడుతున్నారు. ఎంపీలను వెధవ అని అంటారా? అది పద్ధతేనా? ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడు మాట్లాడే తీరు ఇదేనా? మైకు దొరగ్గానే నోటికొచ్చినట్లు మాట్లాడుతారా? ఎంపీ సీట్లు గెలవలేదు కాబట్టి ఏమీ చేయలేకపోయినట్లు మాట్లాడారు కదా, మరి ఎమ్మెల్యేగా గెలిచి రెండున్నరేళ్లు ఏం చేశారు? ఎందుకు బయటకు రాలేదు?’’ అని కౌంటర్ ఇచ్చాడు… కేసీయార్కు కౌంటర్ సరే, కానీ తెలంగాణ సమాజానికి సమాధానం మాట..?!
Share this Article