.
ఏపీ పాలిటిక్స్లో టీడీపీ గానీ, జనసేన గానీ, వైసీపీ గానీ… వాళ్ల సోషల్ మీడియా యాక్టివిస్టులు… రాజకీయ, కుల వైరంలో భాగంగా… అసలు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని మహిళల్ని కూడా బజారుకు లాగి, నానా బూతులతో హీనంగా అవమానిస్తున్న తీరు కొన్నాళ్లుగా చూస్తేనే ఉన్నాం… మరీ ఘోరంగా ఇటు జగన్ ఫ్యామిలీని లాగారు, అటు చంద్రబాబు ఫ్యామిలీని లాగారు.., విచక్షణ, సభ్యత, సంస్కారం వంటి పదాలు ఇక్కడ నిషిద్ధం…
కానీ ఆ సెగ బయటి వ్యక్తులకూ సోకుతోంది… ఉదాహరణకు టీవీ సెలబ్రిటీ రష్మీ గౌతమ్… వైసీపీ తీవ్రంగా ట్రోల్ చేస్తోంది ఆమెను బూతులతో… నిజానికి ఆమె రాజకీయాల్లో లేదు, ఏపీ కులకురుక్షేత్రం బాపతు కులమూ కాదు, అసలు ఏపీయే కాదు… కానీ ఎందుకు టార్గెట్ అయ్యింది…? ఆ కారణేమిటంటే..?
Ads
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను, కొరతను నిరసిస్తూ ఇటీవల తిరుపతిలో వైకాపా నేత భూమ కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి నిరసన చేపట్టాడు… చంద్రబాబు వైఫల్యం ఎక్స్పోజ్ చేయాలనేది తన ఉద్దేశం కావచ్చు… సరే, రాజకీయాల్లో ప్రతిపక్షాలకు ఇవన్నీ సాధారణం…
ఈ నిరసనలో భాగంగా ఓ ఎద్దుల బండిపై ఆటోను పెట్టడంతోపాటు అందులో కొందరు ఎక్కారు..వారి బరువు మోయలేక ఎద్దు ఇబ్బందిపడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి… రాజకీయ ప్రచారాల కోసం మూగ జీవాలను హింసించడం సరికాదంటూ ఈ వీడియోను ఉద్దేశించి రష్మి పోస్ట్ పెట్టింది…
నిరసనలు తెలపడానికి ఎన్నో పద్ధతులున్నాయి, మూగజీవాలను ఇబ్బంది పెట్టడం దేనికి..? ఇది క్రూరత్వం అని రష్మి పోస్ట్ పెట్టింది… మూగజీవాలను బానిసలుగా మార్చే సంస్కృతిని ఇకనైనా ఆపితే మంచిది, ఎద్దు అనుభవించిన నరకాన్ని మీరు వెయ్యి రెట్లు అనుభవిస్తారు అంటూ శాపనార్ధాలు పెట్టింది…
ఇంకేముంది..? ఆమెను ట్రోల్ చేస్తున్నారు… మరీ నీచమైన వ్యాఖ్యలు కూడా… ఆమె కూడా నేను ఏ పార్టీకి, ఏ కులానికి, ఏ మతానికీ వ్యతిరేకం కాదు, మూగజీవాలకు సంబంధించి మాత్రమే స్పందిస్తున్నాను అంటూ… హేయంగా ఉన్న ట్రోల్స్కు జవాబులిస్తోంది…
కరోనా లాక్ డౌన్ పీరియడ్లో కూడా బజారులోకొచ్చి మూగజీవాలను ఫీడ్ చేసింది ఆమె… మొన్నామధ్య వీథికుక్కల విషయంలో సుప్రీం దాకా వెళ్లిన వివాదంపై స్పందించింది… జీవకారుణ్యవాది… రాజకీయాలకో, ట్రోలింగులకో భయపడి ఊరుకోదు… తన మనసులో ఉన్నది చెబుతుంది…

నాన్ వెజ్ తింటూ నీతులు ఎందుకు అని ఎవరో అంటే..? నేను బ్రాహ్మిణ్, నాన్ వెజ్ అస్సలు తినను, అంతే కాదు, లెదర్ ప్రొడక్ట్స్ కూడా వాడను అని బదులిచ్చింది…. ఆత్మీయులనే కాదు..పెంపులు జంతువులను కూడా చివరి వరకు కంటికి రెప్పలా కాపాడే కుటుంబం మాది అంటోంది… అవమానాలు కూడా నాకు కొత్త కాదు, పండుగల టైమ్లో జంతు బలుల గురించి మాట్లాడినా నన్ను తిట్టారు, నాపై దేశ ద్రోహి ముద్రవేశారు, నేను జంతు సంరక్షణ గురించి మాట్లాడితే మరో అంశాన్ని ముందుకు తీసుకొచ్చి నన్ను విమర్శించడం అలవాటైపోయింది అనేది రష్మి వాదన…
సాధారణంగా సినిమాలు, టీవీలు, ఇతర గ్లామర్ ఫీల్డుల్లో ఉన్నవాళ్లు వివాదాలకు జడుస్తారు, దూరంగా ఉంటారు… కానీ రష్మి భయపడకుండా స్ట్రెయిటుగా ఆ బూతుల్ని యథాతథంగా ప్రస్తావిస్తూ రిప్లయ్ ఇస్తోంది… ఇది ఒకరకంగా వైసీపీకే నెగెటివ్… ఓ చిన్న స్థాయి టీవీ ఆర్టిస్టుపై మొత్తం పార్టీ మూకుమ్మడిగా ఈ దాడి చేయాలా అని..!!

ఈ వైసీపీ ట్రోలింగు దగ్గరకే వద్దాం… ఎస్, ఆమెకు తెలుగు రాజకీయాలతో సంబంధం లేదు, ఏపీలో రాజకీయంగా రోజూ కాట్లాడుకునే కులాలకు చెందినదీ కాదు… జంతుప్రేమ, జీవకారుణ్యం దాటి ఆమె తన వ్యాఖ్యల్ని దాటనివ్వలేదు… అవును, నిరసనలో ఏదో మూగజీవి బాధపడితే, ఈమె నిరసించింది… దీనికి ఆమెపై ఈ రేంజ్, మరీ ఈ స్థాయి ట్రోలింగా..?

ఇలాంటి పార్టీకి కౌంటర్ ప్రొడక్ట్స్ అవుతాయి… పార్టీ పట్ల, సంబంధిత నాయకుల పట్ల జనంలో నెగెటివిటీ పెంచుతాయి… తిరుపతిలో జరిగిన ఓ నిరసనను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నెగెటివ్గా చర్చనీయాంశం చేశారు, మరేం ఫాయిదా..? రష్మి వ్యక్తిగతానికొస్తే… ఆమె తండ్రిది యూపీ, తల్లి ఒడియా… ఉండేది విశాఖ… సో, ఆ కుటుంబంలో భిన్న సంస్కృతులు, ఆచారాలు కనిపిస్తాయి… జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తప్ప మరో షో చేయదు… వేరే చానెళ్లకూ వెళ్లదు…
ఇదే జబర్దస్త్ షో మాజీ యాంకర్ అనసూయ వివాదాల స్టయిల్ వేరు… ప్రధానంగా తనను ఎవరైనా ఆంటీ అని పిలిచినా, తన డ్రెస్సింగ్ గురించి మాట్లాడినా కస్సుమంటుంది… శివాజీతో పంచాయితీ అదే… కేసులు పెడుతుంది… ఆమధ్య కొందరి మీద కేసులు కూడా నమోదైనట్టు గుర్తు… రష్మిది డిఫరెంట్… ఈమెది ‘పెటా’ టైప్ తత్వం…!!
Share this Article