.
[ రమణ కొంటికర్ల ] ……. హైందవ ధర్మం, సనాతన సంప్రదాయాలతో పాటు, వివిధ రకాల మతాలు, వాటి పవిత్ర గ్రంథాల వంటివాటిపై భిన్నరకాల అభిప్రాయాలతో సమాజంలో ఓవైపు విస్తృతమైన చర్చ జరుగుతోంది. అదే సమయంలోనే.. దేశం కాని దేశానికి చెందినవారు భారతీయ సనాతన సంప్రదాయాల వైపు ఆసక్తి కనబర్చడం కనిపిస్తోంది.
ఇలాంటి సమయంలో తన మరణానంతర అంతిమ సంస్కారాలతో కొత్త చర్చకు కారణమయ్యాడు రష్యా – ఉక్రెయిన్ వార్ లో అసువులు బాసిన ఓ రష్యన్ సైనికుడు. యుద్ధభూమి నుంచి ఆధ్యాత్మిక క్షేత్రానికి ఆ సైనికుడి అంతిమ ప్రయాణమే ఈ కథనం!
Ads
సెర్గీ గ్రాబ్లెవ్ రష్యన్ సైనికుడు. తన జీవితంలో సుమారు 18 ఏళ్ల నుంచి రష్యా దేశం నుంచి గోకర్ణంకు తప్పకుండా వచ్చే భక్తుడు. మహాబలేశ్వరంలో దర్శనమనంతరం వారణాసినీ సందర్శించేవాడు. అక్కడ దీక్షాపరుడై నియమ నిష్ఠలతో సత్యాన్ని అన్వేషిస్తూ వస్తున్న సెర్గీ గ్రాబ్లెవ్… అక్కడ కనిపించే వైరాగ్యం, విముక్తి కోసం నిరీక్షించేవారు, మోక్షం కోసం తపన పడేవారిని చూసి పూర్తిగా హైందవ ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లాడు.
తను తీరికలేని సైనిక వృత్తిలో ఉంటూ.. ఆధునిక ప్రపంచంలో ఓవైపు సాంకేతితతో కూడిన యుద్ధరంగంలోని వీరుడై యుండి… ఆధ్యాత్మిక మార్గాన్ని అమితంగా ఆచరించే అరుదైన వ్యక్తుల్లో ఒకడిగా తత్వజ్ఞానంపై ఒక దృక్కోణాన్ని కల్గి ఉండటం సెర్గీ గ్రాబ్లెవ్ లో కనిపించే ఓ వైరుధ్యం.
ఈమధ్య రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కావచ్చు.. గత యుద్ధాల్లో పాల్గొన్న అనుభవం కావచ్చు.. సెర్గీ గ్రాబ్లెవ్ ను శాంతివైపు, భవబంధాల నుంచి విముక్తి వైపు, జనన, మరణాల నుంచి విడుదల కావాలన్న యోచనతో హైందవ ధర్మం వైపు అడుగులేయించొచ్చు బహుశా.
ఎందుకంటే, పుట్టుకతో క్రిస్టియన్ అయిన సెర్గీ గ్రాబ్లెవ్ అంత్యక్రియలు జరిగిన తీరు కూడా ఆయన హైందవ ధర్మాన్ని ఎంతగా అనుసరించేవారనేది చెప్పే విషయం. సెర్గీ గ్రాబ్లెవ్ ఈమధ్య ఎడతెరిపిలేని బాంబుల వర్షంతో యుద్ధభూమిగా మారిన రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ లో అసువులు బాసాడు.
ఈ క్రమంలోనే సెర్గీ గ్రాబ్లెవ్ అంత్యక్రియలు గోకర్ణంలో హైందవ సంప్రదాయంలో జరగడం ఓ విశేషం. ఉక్రెయిన్ తో యుద్ధంలో చనిపోయిన సెర్గీ గ్రాబ్లెవ్ మృతదేహానికి దేశాల సరిహద్దులు దాటి కర్నాటక గోకర్ణం అరేబియా సముద్ర తీరప్రాంతంలో అంత్యక్రియలు జరిగిన తీరు చూస్తుంటే.. తను ఎంతగా హైందవ ధర్మంవైపు ఆకర్షితుడయ్యాడో చెప్పే కథ ఇది. సుమారు రెండు దశాబ్దాలుగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న సెర్గీ గ్రాబ్లెవ్ ఆఖరి ప్రయాణాన్ని ఆయన కోరిక మేరకు గోకర్ణంలో అత్యంత నిష్ఠగా హైందవ ఆచారంలో నిర్వహించారు.
గ్రాబ్లెవ్ కుటుంబం భారత్ కు రాలేదు గానీ.. ఆయన అంతిమ సంస్కారాలను వీడియో కాల్ ద్వారా వీక్షించింది. పిండ ప్రదానాలు, నారాయణ బలి వంటి కర్మకాండలకు పెట్టింది పేరైన మహాబలేశ్వర్ లో ఆయన ఆత్మకు విడుదల లభించింది. ఒక వీర సైనికుడు అసువులు బాసినప్పుడు సాధారణంగా జెండాలు, తుపాకుల మోతలతో జరగాల్సిన అంతిమ సంస్కారానికి భిన్నంగా.. గ్రాబ్లెవ్ అంత్యక్రియలు జరగడం విశేషంగా కనిపించిన దృశ్యం.
సాధారణంగా క్రైస్తవ మతంలో అంతిమ సంస్కారంలో భాగంగా ఖననం చేయడం.. వారిని ఏడాదికోసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ వారికి నివాళులర్పించే కార్యక్రమాలను చూస్తాం. కానీ, తన క్రైస్తవ సంప్రదాయానికి భిన్నంగా విముక్తి, మోక్షానికి మార్గాలుగా విశ్వసించే హైందవ ఆచారంలో అంత్యక్రియలు నిర్వహించడం విశేషం. పితృశాపాలతో పాటు, వివిధరకాల పాపాలకు విముక్తిగా చేసే నారాయణ బలి కార్యక్రమాన్ని కూడా గ్రాబ్లెవ్ అంతిమ సంస్కారాల సందర్భంగా నిర్వహించడంతో ఈ రష్యా సైనికుడి అంతిమ ప్రయాణం చర్చనీయాంశమైంది.
యుద్ధం నుంచి మోక్షం వరకు: గ్రాబ్లెవ్ వైరుధ్య ప్రయాణం!
అకాల, అసహజ మరణాలకు ప్రాయశ్చిత్తం కోసం ఉద్ధేశించిందే నారాయణ బలి. కోటి తీర్థంగా పేరుగాంచిన మహబలేశ్వర్ నారాయణబలికి అత్యంత ప్రముఖమైన క్షేత్రంగా చెబుతుంటారు. శివుడు విష్ణువుకు బలి అర్పించిన ప్రదేశంగా ప్రతీతి. అరేబియా సంద్రపు అలల ఒడ్డున టెంపుల్ టౌన్ గా పిలువబడే గోకర్ణం ప్రధానాలయం ఈ కోటి తీర్థానికి సుమారు 200 మీటర్ల దూరంలో కాలినడకన వెళ్లి వచ్చేటట్టుగా ఉంటుంది.
అసలు నారాయణ బలి ఎలా చేస్తారు..?
కోటి తీర్థంలో మునిగి వచ్చి నారాయణ బలి కార్యక్రమం చేయడం గోకర్ణంలో ఆనవాయితీ. చాలామంది బ్రాహ్మలు ఒక్కరోజులోనే ఈ నారాయణబలిని పూర్తి చేసేవారుంటారు. మరికొందరు రెండు రోజుల పాటు నిర్వహిస్తారు.
నారాయణ బలి సంకల్ప్, వినాయక పూజ, కలశ స్థాపన, ప్రేతావాహన, బ్రహ్మ, విష్ణు, యమ, రుద్ర, సవిత్ర గాయత్రీ మంత్రం, దశ పిండ ప్రదానం, పంచక శ్రద్ధ, నారాయణ బలి హోమం, తిల హోమం, పూర్ణాహుతి, విసర్జన, ప్రక్షాళననంతరం ప్రసాద వితరణ జరుగుతుంది. సాధారణంగా పితృపక్షాల్లో, అమావాస్య రోజున ఎక్కువ మంది ఈ నారాయణ బలి కార్యక్రమాన్ని చేసుకోవడానికి మహబలేశ్వర్ వెళ్తుంటారు.
అలాంటి నారాయణబలి హోమ కార్యక్రమాన్ని రష్యన్ సైనికుడైన సెర్గీ గ్రాబ్లెవ్ కు నిర్వహించడం వెనుక ఆయన నమ్మిన ఆచార సిద్ధాంతాలకు ఆయన మరణానంతరం ఇచ్చిన ప్రాధాన్యతగా భావించాల్సి ఉంటుంది.
మోక్షానికి మార్గంగా మహబలేశ్వర్ ను చెప్పుకుంటారు. 4వ శతాబ్దంలో కదంబ రాజవంశం నిర్మించిన గోకర్ణ ఆలయంలో ఆ విభూదిదారుణ్ని అహంకారాన్ని, ఆత్మలను విముక్తి చేసేవాడిగా కొలుస్తుంటారు భక్తులు. అందుకే, గోకర్ణం అరేబియా ఒడ్డున రిసార్ట్స్ తో ఓ పర్యాటక ప్రాంతంగానే కాకుండా.. ఆ పరమశివుడు ఆత్మలింగం కొలువైన ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది.
సరిహద్దులు దాటిన భక్తే గ్రాబ్లెవ్ ను ఒక పురాతన సంప్రదాయం వైపు మళ్లించింది. తాను విశ్వసించే విశ్రాంతి స్థలంలో తన జన్మ విముక్తికి చివరి ప్రయాణ వేదికైంది.
గ్రాబ్లెవ్ కథ కేవలం ఒక సైనికుడికి హైందవాచారంలో నిర్వహించిన అంత్యక్రియల కథగానే చూడటానికి పరిమితం చేయలేం. వివిధ అంశాలను వివిధ జాతులు, వివిధ దేశాల ప్రజలు భిన్నపార్శ్వాల్లో చూస్తున్నదానికి ప్రతిబింబంగా కూడా చెప్పుకోవచ్చు.
ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మిక విషయాలను సవాల్ చేస్తూ శాస్త్రీయమైన చర్చలు ఒకవైపు బలంగా, తార్కికంగా జరుగుతున్న వేళ.. మరోవైపు భారతదేశ సరిహద్దులను దాటి హిందూధర్మాన్ని ఆచరించేవారి సంఖ్యా అంతకంతకూ కనిపిస్తోంది.
బాలి నుంచి మొదలుకుంటే బ్రెజిల్ వరకు.. రష్యా నుంచి ప్రారంభిస్తే కాలిఫోర్నియా వరకు ఆధునిక జీవనశైలిపై స్పష్టమైన అవగాహనతో ఉన్నవారే.. హైందవ ధర్మంలోని ఆధ్యాత్మికతవైపు అడుగులేయడం.. జననం నుంచి మరణం వరకూ ఇక్కడి ఆచారాలను పాటించాలనుకోవడమూ సమాజ దృక్కోణంలో కనిపించే వైరుధ్యం.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధభూమి నుంచి మహబలేశ్వర్ ఆలయం వరకూ జరిగిన సెర్గీ గ్రాబ్లెవ్ అంతిమ ప్రయాణం మాత్రం మోక్షానికి పాస్ పోర్ట్ అక్కర్లేదని చెప్పే ఓ భిన్న కథనం… మోక్షానికి పాస్ పోర్ట్ అక్కర్లేదని చెప్పే ఓ భిన్న కథనం.. ఆ రష్యా సైనికుడి అంతిమ ప్రయాణం!
Share this Article