.
ఫార్ములా వన్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు డీఓపీటీ అనుమతించిందనే వార్త పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు నిజానికి… మున్సిపల్ ఎన్నికల సభల్లో రేవంత్ రెడ్డి బీజేపీని టార్గెట్ చేయడానికి ఈ ఐఏఎస్ పేరును ప్రస్తావించి, ఎవరిని కాపాడటానికి ఫార్ములా వన్ కేసును నీరుగారుస్తున్నారని విమర్శించాడు…
(ఈ ఐఏఎస్ బీఆర్ఎస్ క్యాంపుకి చాలా ‘సన్నిహితుడు’… ఒక సోమేష్ కుమార్లాగే… బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే అర్వింద్కు మిగతా సీనియర్లను పక్కనపెట్టేసి మరీ సీఎస్ను చేసేవారేమో… అంత గాఢబంధం…)
Ads
అంతే, కొన్నాళ్లుగా పెండింగులో ఉన్న ఈ ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఫైల్ క్లియరైపోయింది… ఈ వార్త బయటికి రాకముందు మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ కేటీయార్ ‘మళ్లీ ఫార్ములా వన్ కేసులో హడావుడి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, నాకు సమాచారం ఉంది’ అన్నాడు… అంటే, ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందుతూనే ఉంది… (బీజేపీతో ఎలాగూ రహస్య దోస్తీ కొనసాగుతూనే ఉందిగా…)
ఐతే ఫార్ములా వన్ కేసులో ఈడీ దర్యాప్తు మాటేమిటి మరి అనడక్కండి… అదీ అలా నానుతూ ఉంటుంది… అటు కాళేశ్వరం కేసును నాన్చినట్టుగానే..! దీనికితోడు అవసరమైతే, అడిగితే ఫార్ములా వన్ కేసును కూడా సీబీఐకి ఇచ్చేస్తాం అంటాడు రేవంత్ రెడ్డి… ఎందుకలా బీజేపీకి అప్పగించేస్తున్నాడు, పోనీ, అప్పగించేస్తాను అంటాడు…
- క్లియర్… తను కేటీయార్, కేసీయార్, హరీష్ రావులను ఏమీ అనడు… ఏమీ చేయడు, ఫార్ములా వన్ కేసులో కేటీయార్ అరెస్టుకు చాన్స్, గవర్నర్ పర్మిషన్ ఉన్నా సరే చేయడు… ఎప్పటికప్పుడు వాళ్లను ఈ కేసుల్లో ‘ఎక్స్పోజ్’ చేస్తుంటాడు… ఫోన్ ట్యాపింగు కేసు విచారణకు కేసీయార్ను రప్పించినట్టుగానే… ఇవేకాదు, గొర్లు- బర్లు, విద్యుత్తు అక్రమాలు తదితర ఏ విషయమైనా సరే… ఎండగట్టడం, జనంలో చర్చ లైవ్గా ఉంచడం, ప్రత్యేకించి ఆ ముగ్గురి అవినీతిని, అరాచకాన్ని ఎప్పటికప్పుడు జనంలో చర్చ జరుగతూ ఉండేలా చూడటం…
అందుకే కేసీయార్ను నేను శిక్షించేది ఏముంది, తనే ఫామ్హౌజులో బందీగా శిక్ష విధించుకున్నాడు కదా అన్నాడు… కేటీయార్ అరెస్టుకు కూడా ఎందుకు రేవంత్ రెడ్డి వెనుకాడుతున్నాడు..? నిజంగా కేసులో మెరిట్ లేదా..? లేక వరుసగా ఎన్నికలు నిర్వహిస్తున్నాడు కదా, ఏమాత్రం సానుభూతి ఫ్యాక్టర్ బీఆర్ఎస్కు రావొద్దనే ఉద్దేశమా..? ఇంకా 3 నగర పురపాలికల ఎన్నికలు, ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రానున్నాయి… మరి..?

హఠాత్తుగా జమీన్ రైతు పత్రికలో వచ్చిన ఓ వార్త గుర్తొచ్చింది… రీసెంటుదే… ఓసారి చదవండి…
- లోకేష్ బాబు తేల్చి చెప్తున్న నిజం… జగన్ జోలికి మేము వెళ్లం – 16 సీట్ల ప్రమాదం తెచ్చుకోము! … మద్యం కేసులో కానీ, మరొక కుంభకోణంలో కానీ ముఖ్యమంత్రి హోదాలో చేసిన తప్పులకు స్పష్టమైన ఆధారాలు లభిస్తున్నప్ప టికీ, జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసు కోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా లేదు…జగన్ను అరెస్ట్ చేసినా, జైలులో పెట్టినా ప్రజలలో సానుభూతి పెరుగుతుంది.
- “గతంలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినందు వల్లనే వైకాపాకు 11 సీట్ల ప్రారబ్దం దాపురించింది. జగన్ను అరెస్ట్ చేసి, 160 సీట్లున్న మేము 16 సీట్ల దుర్గతికి దిగజారాలనుకోవడం లేదు”… లోకేష్ నిక్కచ్చిగా తేల్చి చెప్తున్న మాట ఇది.
- లక్ష కోట్ల రూపాయల మద్యం గోల్మాల్ కేసులో సిట్ దర్యాప్తును అర్ధాంతరంగా నిలువరించి జగన్ను కాపాడడం రాజకీయంగా సరైన నిర్ణయమా అని కొందరు ఆత్మీయులు ప్రశ్నించినప్పుడు లోకేష్ బాబు స్పష్టంగా చెప్పిన సమాధానం ఇది.
- ‘‘జగన్ మీద మాకు చాలా కోపం వుంది. ఆయన వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాము. ఇప్పుడు వాటికి కక్ష తీర్చుకొనే అవకాశం వుంది. కానీ కక్షలు కార్పణ్యాల జోలికి వెళ్లడం నాకు ఇష్టం లేదు. దాని వల్ల ప్రజలలో వైకాపాకు లేనిపోని సానుభూతి వస్తుంది. కక్ష తీర్చుకోవడం వల్ల కలిగేది స్వల్ప కాల సంతోషం మాత్రమే; అది సానుభూతికి దారి తీస్తే రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని నష్టం జరుగుతుంది’’ అని వివరణ ఇస్తున్నాడు లోకేష్ బాబు.
- జగన్ను వదిలేసినా, ఆయనతో కలసి సకల దుర్మార్గాలు చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి.సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారిని కూడా పూర్తిగా వదలి వేయడం దేనికి అన్న ప్రశ్నకు మాత్రం లోకేష్ నుంచి సమాధానం రాలేదు… అందులోని మర్మాన్ని ఎవరికి తోచిన రీతిలో వారు వూహించుకోవచ్చు….
ఇదీ ఆ వార్త… జగన్, కేసీయార్ కేసులకు సంబంధించి అటు ఏపీలో, ఇటు తెలంగాణలో లోకేష్, రేవంత్ రెడ్డి సేమ్ ఆలోచిస్తున్నారు, సేమ్ అడుగులు వేస్తున్నారు అనిపిస్తోంది కదా… అయితే నిజంగా వాళ్లను జైలులో వేస్తే సానుభూతి వస్తుందా..? కేటీయార్ అయితే ‘నేను రెడీ’ అని ఓ దశలో ప్రిపేరయిపోయాడు కూడా… తనే చెప్పాడు…

- లోకేష్ గానీ, రేవంత్ రెడ్డి గానీ… జగన్ మీద, కేసీయార్ మీద కక్షసాధింపులకు వెళ్లరు, నిందితులను కాస్తా బాధితుల్ని చేయరు, కోర్టుల్లో ఈ కేసులు ఎటూ తెమిలేవి కావు, సో, వారిపై ఉన్న అవినీతి ఆరోపణలను ప్రజల్లో నిరంతరం చర్చలో ఉంచడం ద్వారా, వాళ్ల మీద ఉన్న నెగెటివిటీని సజీవంగా ఉంచడం ద్వారా… వారి నైతిక బలాన్ని (Moral Authority) దెబ్బతీయడం వీరి వ్యూహం… అదే పొలిటికల్ ఫాయిదా కూడా..!
సో, నెత్తులపై కేసుల కత్తులు తెగెవి కావు, తెమిలేవి కావు, వేలాడుతూ ఉంటాయి...
నిజానికి ఎవరినో జైలులో వేస్తే సానుభూతి వస్తుందనేది నిజం కాదు… చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినందువల్ల మాత్రమే కాదు జగన్ 11 సీట్లకు దిగజారిపోయింది, అది తన ఐదేళ్ల పాలన తాలూకు ఘోర వైఫల్యాల వల్ల కూడా..!
ఒక్కసారి గుర్తుతెచ్చుకొండి… కేజ్రీవాల్ జైలులో పెట్టారు… ఏమైంది..? సానుభూతి వచ్చిందా..? ఏమాత్రం రాలేదు… ఢిల్లీ ఎన్నికల్లో మట్టిగరిచాడు… బీజేపీ గెలిచింది… మద్యం కేసుల్లో కవితను జైలులో పెట్టారు, కేసీయార్ కుటుంబానికి ఏమైనా సానుభూతి వచ్చిందా..? లేదు కదా..!
సో, జైలులో నేత- జనంలో సానుభూతి అనేది కాదు, ప్రజాజీవితంలో ఉన్న నేతను ఎంత బలంగా, పక్కాగా ఫిక్స్ చేసి, జైలులో వేస్తారనేదే ముఖ్యం..!!
Share this Article