.
మోడీ తనను కలిసి రమ్మన్నది అభివృద్ధి విషయంలోనే తప్ప… ఏదో పార్టీలోకి రమ్మన్నట్టు కాదు అని రేవంత్ రెడ్డి స్వయంగా వివరణ ఇచ్చినా సరే… బీఆర్ఎస్ క్యాంపు తమ సహజ శైలిలో ‘బీజేపీలోకి రేవంత్ రెడ్డిని మోడీ ఆహ్వానిస్తున్నాడు, చూశారా, ఈ ఇద్దరూ ఒకటే, ఇప్పటికే కలిసి పనిచేస్తున్నారు’ అనే నెగెటివ్ క్యాంపెయిన్ తీసుకుంది… సరే, దాని సహజగుణం వదిలేస్తే…
సరే, డిబేట్ కోసం… నిజంగానే మోడీ బీజేపీలోకి రావాలని రేవంత్ రెడ్డిని ఆహ్వానించాడనే అనుకుందాం కాసేపు… అది దేనికి సంకేతాలు అనుకోవాలి..? తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు తలదించుకోవాల్సిన అంశం ఇది… ఎలాగంటే..?
Ads
1) ప్రస్తుత తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలెవరికీ రాష్ఠ్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే సీన్ లేదనీ, వారిలో లేని ఏదో ప్రత్యేకత, నాయకత్వ ప్రతిభ రేవంత్ రెడ్డిలో ఉందని మోడీ గుర్తించినట్టు లెక్క… పార్టీలు వదిలేయండి కాసేపు… ఒకరకంగా మోడీ ఇచ్చిన సర్టిఫికెట్ అనుకోవాల్సిందే కదా… (సరే, రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి పార్టీ మీద, ప్రభుత్వం మీద మంచి కంఫర్టబుల్ గ్రిప్ కలిగి ఉన్నాడనీ, పక్క చూపులు చూడాల్సిన అవసరం ఏమీ లేదనేది వేరే చర్చ… కాంగ్రెస్ హైకమాండ్ తనకు సరైన ప్రయారిటీయే ఇస్తోంది)…
2) తెలంగాణలో బిజెపి నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, ముఠా రాజకీయాల పట్ల ప్రధానమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడనే సంకేతాల్ని ఇస్తున్నట్టే కదా… అనేక వర్గాలతో ఓ పర్ఫెక్ట్ నాయకత్వం తెలంగాణ బీజేపీకి కరువైందనే హైకమాండ్ అసంతృప్తిని తెలియజేస్తున్నట్టే కదా…
3) కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన వివాదాన్ని కొందరు నేతలు రాజకీయం చేసి పార్టీకి నష్టం కలిగించడం కూడా మోడీకి నచ్చలేదని సమాచారం…
4) ఎంతసేపూ కేసీయార్ కనుసన్నల్లో పనిచేసే బీజేపీ ముఖ్యుల వైఖరి, వ్యవహార ధోరణి హైకమాండ్కు నచ్చడం లేదనీ అనుకోవచ్చు… ఎందుకంటే, బీజేపీయేతర పార్టీల ఎన్నికల ఖర్చును భరిస్తాననడం, ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాను స్వయంగా ఆపరేట్ చేసి, బీజేపీని జాతీయ స్థాయిలో బదనాం చేయాలనుకోవడం, ఏకంగా పార్టీ జాతీయ కార్యదర్శిని అరెస్టు చేయాలని విశ్వప్రయత్నం చేయడం వంటివి బీజేపీ హైకమాండ్కు కేసీయార్ పట్ల తీవ్ర అభ్యంతరం… ఐనా సరే, కేసీయార్ వైపే తెలంగాణ బీజేపీకి ఎందుకు నెట్టుతున్నారు, ఎవరి కోసం అనే విమర్శలున్నవే…
చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో ఎక్కువ సమయం…: రాష్ట్ర బిజెపి నేతలకు తక్కువ సమయం ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో మోదీ ఎక్కువ సమయం గడపడం స్థానిక నేతలను ఆందోళనకు గురిచేసింది… తెలంగాణలో కూడా ఏపీ కూటమి తరఫునే ఎన్నికల్లో పోటీచేస్తామని మోడీ సంకేతాలు ఇచ్చినట్టు అనుకోవాలా..?
ఎన్నికల వ్యూహం…: హైదరాబాద్ మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఏపీ ఓటర్లను ప్రభావితం చేయగల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల పైనే మోదీకి ఎక్కువ నమ్మకం ఉందా..? జుబిలీ హిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాష్ట్ర బీజేపీ పెద్దల పనితీరు మీద తీవ్ర సందేహాల్ని లేవనెత్తిందా..?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే స్థితిలో బిజెపి ఉన్నప్పటికీ, నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల మోడీ తీవ్ర అసహనానికి గురయ్యారని, రేవంత్కు సర్టిఫికెట్ ఇవ్వడం, ఏపీ కూటమి ముఖ్యలతో ఎక్కువసేపు హైదరాబాదులోనే గడపడం ఆ సంకేతాలేననే చర్చ బీజేపీ కేడర్లోనే జరుగుతూ ఉండటం ఇక్కడ గమనార్హం..!!
Share this Article