.
ఒక వార్త… తలసరి ఆదాయం విషయంలో 5 రాష్ట్రాలు ప్రపంచ బ్యాంక్ నిర్దేశించిన ‘ఎగువ మధ్య-ఆదాయ’ (upper middle-income) స్థాయిని అధిగమించాయి. అందులో తెలంగాణ మూడో స్థానంలో ఉంది.
— ఢిల్లీ: $6,217
Ads
— కర్ణాటక: $5,579
— తెలంగాణ: $5,407
— తమిళనాడు: $5,329
— గుజరాత్: $4,734
ఈ స్థాయిని చేరుకోవడానికి కొద్దిగా వెనుకబడినవి:
— మహారాష్ట్ర: $4,628 ($8 తేడాతో)
— హర్యానా: $4,627 ($9 తేడాతో)
— కేరళ: $4,610 ($26 తేడాతో)
.
ఈ రిపోర్టు రాగానే బీఆర్ఎస్ ప్రాపగాండిస్టులు వెంటనే అందుకున్నారు… కేసీయార్ పాలనలో తెలంగాణ సంపన్న రాష్ట్రంగా ఎదిగి, కోటిరతనాల వీణ అయ్యిందని..!! నిజంగా తెలంగాణ మంచి స్థితిలో ఉందా..? జీఎస్డీపీ పెరిగితే, ఆ పరిమాణాన్ని జనాభాతో భాగించి తలసరి ఆదాయం లెక్కేయడం శాస్త్రీయమేనా..? మరి కేసీయార్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై మోపిన ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులు ఏ లెక్కల్లోకి రావాలి..? అది సగటు మనిషి లయబులిటీ కాదా..?
ఉదాహరణకు ఓ ఐటీ కంపెనీ 10 వేల కోట్ల ఎగుమతులు సాధించింది, అది జీఎస్డీపీలోకి వస్తుంది, కానీ అది సగటు మనిషి అభివృద్ధికి ఎలా సూచించగలదు? జస్ట్, ఫర్ డిబేట్ సేక్…
1. తలసరి ఆదాయం ప్రాముఖ్యత ఏమిటి? ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు ‘ఎగువ మధ్య-ఆదాయం’ వంటి ప్రమాణాలను నిర్ణయించడం వెనుక కొన్ని ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి… ఒక రాష్ట్రం తన ప్రజల అవసరాలను తీర్చుకోవడానికి ఎంత ఆర్థిక శక్తిని కలిగి ఉందో ఇది ప్రాథమికంగా సూచిస్తుంది. (మరి అప్పుల మాటేమిటి?)
తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మెరుగైన మౌలిక సదుపాయాలు, కొనుగోలు శక్తిని కలిగి ఉంటాయని, తద్వారా పెట్టుబడులు పెరగడానికి ఇది ఒక సంకేతంగా పనిచేస్తుంది. (ఆచరణలో, వాస్తవంలో ఇదొక భ్రమ. మౌలికవనరులు, ప్రభుత్వ రాయితీలు, మానవవనరులు, శాంతిభద్రతలు వంటి చాలా అంశాలు పెట్టుబడులను శాసిస్తాయి)
వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకోవడానికి, ఒక ప్రామాణిక కొలమానంగా ఇది ఉపయోగపడుతుంది. (దీంతో సగటు మనిషికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు)
తలసరి ఆదాయం అనేది కేవలం సగటు (Average) మాత్రమే. ఇది ‘అసమానతలను’ (Inequality) పూర్తిగా దాచిపెడుతుంది. 10 వేల కోట్ల ఎగుమతులు జరిగినప్పుడు, అది జీఎస్డీపీలో కనిపిస్తుంది, ఆ కంపెనీ లాభాలు పెరుగుతాయి. కానీ, ఆ కంపెనీలో పనిచేసే ఉన్నత స్థాయి ఉద్యోగులకు వచ్చే వేతనాలు, క్లీనింగ్ సిబ్బందికి వచ్చే వేతనాల మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది.
తలసరి ఆదాయం పెరిగినప్పుడు, సంపద మొత్తం సమాజంలో సమానంగా పంచబడినట్లు కాదు. పైన ఉన్న 1% వ్యక్తుల సంపద పెరిగినా, సగటు లెక్కల్లో అది మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందినట్లుగా కనిపిస్తుంది. దీనినే “అగ్రిగేషన్ సమస్య” (Aggregation Problem) అంటారు.
2. అసలైన అభివృద్ధిని కొలవడానికి ఉన్న మార్గాలేంటి? ఒక మనిషి జీవన ప్రమాణం పెరిగిందో లేదో తెలుసుకోవడానికి తలసరి ఆదాయం సరిపోదు. అందుకే ఆర్థికవేత్తలు ఇతర సూచీలను ఉపయోగిస్తారు…
మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MPI…): ఇది కేవలం ఆదాయమే కాకుండా విద్య, ఆరోగ్యం, పోషకాహారం, జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
GINI కోఎఫీషియంట్…: ఆదాయ అసమానతలను కొలవడానికి దీనిని ఉపయోగిస్తారు. ఇది ఎంత తక్కువగా ఉంటే, సంపద అంత సమానంగా పంపిణీ అయినట్లు అర్థం.
HDI (Human Development Index): ఆయుర్దాయం, వైద్యం, విద్య, అక్షరాస్యత, తలసరి ఆదాయం కలిపి దీనిని లెక్కిస్తారు. ఇది తలసరి ఆదాయం కంటే కొంత మెరుగైన చిత్రం చూపుతుంది.
మీడియన్ ఇన్కమ్ (Median Income)…: మొత్తం ఆదాయాన్ని సగటు చేయడం కంటే, సగం మంది జనాభా ఏ ఆదాయ స్థాయి కంటే పైన ఉన్నారో చూసే ‘మీడియన్’ లెక్క వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
జీఎస్డీపీ పెరగడం, ఆర్థిక భాషలో తలసరి ఆదాయం పెరగడం అంటే అభివృద్ధి జరగడం అని కాదు. అది కేవలం ఆర్థిక కార్యకలాపాల పెరుగుదల మాత్రమే. ఒక రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందిందా లేదా అని చెప్పడానికి… ఆ పెరిగిన సంపద అట్టడుగు వర్గాలకు ఎలా అందుతోంది? ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల నాణ్యత ఎలా ఉంది? నిరుద్యోగిత రేటు ఎంత ఉంది? అనే అంశాలు తలసరి ఆదాయం కంటే చాలా ముఖ్యం…
Share this Article