Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వ్యూహాత్మక అడుగు… తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ ‘ఎన్టీఆర్’ కార్డ్…!

May 29, 2026 by M S R

.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎన్టీయార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ, చేసిన ఒక ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. “ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో, ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. వారిద్దరి కలయికే మా ప్రజా పాలన” అని వ్యాఖ్యానించడం కేవలం ఒక సాధారణ ప్రకటన కాదు; దాని వెనుక ఒక బలమైన రాజకీయ ముద్ర, లోతైన వ్యూహం దాగి ఉన్నాయి.

రాజకీయ వైరుధ్యాలను పక్కనబెట్టి, కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆవిష్కరించడం తెలంగాణ రాజకీయాల్లో ఒక అరుదైన ప్రతీకాత్మక ఘట్టం. ఒక రాజకీయ విశేషం.

Ads

రేవంత్ రెడ్డి ప్రత్యర్థుల విమర్శలకు జడిసేరకం కాదు… తన రాజకీయ ఆలోచనలు తనవి… విమర్శకులను పక్కకు తోసేస్తూ తను అనుకున్న బాటలో తను ధైర్యంగా ముందుకెళ్లిపోతుంటాడు… ‘వైనాట్, ఎన్టీయార్ విగ్రహాన్ని ఎందుకు పెట్టకూడదు’ అనే కోణంలో జనానికి బహిరంగంగానే తన వివరణ, సమర్థన చెప్పుకున్నాడు… అంబేడ్కర్, ఇందిరమ్మ, ఎన్టీయార్ చూపిన బాటల్లో మా ప్రభుత్వం వెళ్తోందని స్పష్టంగా, సాహసించి ప్రకటించాడు… కేసీయార్‌కు రాజకీయ భిక్ష కూడా ఎన్టీయార్ పుణ్యమే అంటూ కేసీయార్, తన పార్టీ ముఖ్యులు ఎవరూ ఇక దీనిపై నోరెత్తే సాహసం చేయకుండా అడ్డుకట్ట వేశాడు రేవంత్ రెడ్డి.

(రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసే బీఆర్ఎస్ కూడా ఎన్టీయార్‌ను ఓన్ చేసుకునే ప్రయత్నం ఎలా చేసిందో, తను కూడా ఎక్కడెక్కడ విగ్రహాలు పెట్టిందో కూడా మనం నిన్న ముచ్చటించుకున్నాం) 

1. వ్యక్తిగత మూలాలు – రాజకీయ సాహసం
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచే ప్రారంభమైంది. ఎన్టీఆర్ సిద్ధాంతాలు, ఆ పార్టీ క్యాడర్‌తో ఆయనకు ఉన్న భావోద్వేగ అనుబంధం బహిరంగ రహస్యమే. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కూడా ఆయన ఎన్టీఆర్ పట్ల తన గౌరవాన్ని దాచుకోలేదు. గతంలో ప్రధాని మోదీని ‘బడే భాయ్’ అని సంబోధించినా, ఇప్పుడు ఎన్టీఆర్ వారసత్వాన్ని ఓన్ చేసుకున్నా.. అధిష్ఠానం ఏమనుకుంటుందనే సంకోచం లేకుండా, కన్విన్స్ చేయగలననే ధీమాతో, తనదైన శైలిలో, భిన్న సమీకరణాల రాజకీయ పంథాను నిర్మించుకునే సాహసాన్ని రేవంత్ ప్రదర్శిస్తున్నాడని చెప్పవచ్చు.

2. సెటిలర్స్ ఓటర్లకు స్పష్టమైన సంకేతం
ఈ చర్య వెనుక అత్యంత కీలకమైన సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు ఉన్నాయి…

ఆంధ్రా మూలాలున్న ఓటర్లు….: హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాల్లో ఆంధ్రా మూలాలున్న ఓటర్లు (సెటిలర్స్) అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలరు.

సామాజిక సమీకరణాలు…: ఎన్టీఆర్ పట్ల సానుకూలత ఉన్న కమ్మ సామాజిక వర్గంతో పాటు, టీడీపీ పాత ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి ఇదొక చక్కని మార్గం.

సమగ్ర తెలుగు అస్తిత్వం…: కేవలం ప్రాంతీయ భావజాలానికే పరిమితం కాకుండా, ‘తెలుగు ఆత్మగౌరవాన్ని’ కూడా కాంగ్రెస్ గౌరవిస్తుందనే నమ్మకాన్ని ఈ చర్య కలిగిస్తుంది.

3. బీఆర్‌ఎస్‌కు పరోక్ష చెక్.. టీడీపీ శూన్యతపై కన్ను
తెలంగాణ ఉద్యమ కాలం నుండి బీఆర్‌ఎస్ (గతంలో టీఆర్‌ఎస్) తీవ్రమైన ప్రాంతీయ సెంటిమెంట్‌ను, ఆంధ్ర పాలకుల వ్యతిరేకతను రాజకీయ ఆయుధంగా వాడుకుంది. అయితే, మారుతున్న కాలంతో పాటు ఆ సెంటిమెంట్ ప్రభావం తగ్గుతోంది. కోరి తెచ్చుకున్న కేసీయార్ పాలన తెలంగాణ సమాజానికి ఆశించిన ఫాయిదా ఇవ్వలేదు సరికదా, రకరకాలుగా బీఆర్ఎస్ నాయకుల దోపిడీ పెరిగి, ప్రజలు విసిగిపోయి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను తలకెత్తుకున్నారు…

ఇప్పుడు రేవంత్ రెడ్డి “తెలుగు ప్రజల నడుమ సుహృద్భావం – తెలంగాణ గౌరవం” అనే సరికొత్త సమీకరణ కథనాన్ని తెరపైకి తెచ్చాడు. తెలంగాణలో టీడీపీ ప్రస్తుతం బలహీనపడి, అసలు నాయకుడంటూ ఎవరూ లేని నేపథ్యంలో, ఎన్టీఆర్ అభిమానులను, ఆ పార్టీ వదిలిన రాజకీయ శూన్యతను (Political Vacuum) బీఆర్‌ఎస్ లేదా బీజేపీ హస్తగతం చేసుకోకుండా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నమిది.

అవకాశవాదమా? చారిత్రక అవసరమా?
ఒకవైపు తెలంగాణ ఆత్మగౌరవ పోరాట చరిత్రకు, ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన ‘సమైక్య తెలుగు’ భావజాలానికి మధ్య చారిత్రక విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, రాజకీయ ప్రయోజనాల కోసం చారిత్రక వ్యక్తులను వాడుకుంటున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. అయినాసరే, యువతలో ఎన్టీఆర్‌ను ఒక రాజకీయ నాయకుడి ‘తెలుగు ఆత్మ గౌరవానికి ప్రతీక’గా చూసే ధోరణి ఎక్కువగా ఉంది. దీన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కేవలం ఒక విగ్రహానికి పరిమితం కాలేదు. ఇది తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు, ఆంధ్ర- తెలంగాణ భావోద్వేగాల మధ్య మారుతున్న సంబంధాలకు ఒక సంకేతం. కాంగ్రెస్ తన రాజకీయ పరిధిని మరింత విస్తరించుకోవడానికి, భవిష్యత్తు ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా ఎదగడానికి రేవంత్ రెడ్డి వేసిన ఈ పక్కా వ్యూహాత్మక అడుగు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

బీజేపీకి కౌంటర్

మోదీ గానీ, తన పార్టీ గానీ పదే పదే కాంగ్రెస్ పార్టీని ‘తల్లిని చంపారు, బిడ్డను బతికించారు- విద్వేషం నింపి రాష్ట్ర విభజన చేశారు’ వంటి విమర్శలు చేస్తుంటుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో..! అది నెగెటివ్ క్యాంపెయిన్. దీనికి సరిగ్గా భిన్నమైన పాజిటివ్ రాజకీయ కోణంలో రేవంత్ రెడ్డి ‘తెలంగాణ ఆత్మగౌరవం- తెలుగు ప్రజల నడుమ విద్వేష రహిత పరస్పర సహకారం, గౌరవం’ అనే కోణంలో అడుగులు వేయడం బీజేపీకి కౌంటర్..!

ఒకవైపు తమ పార్టీకే చెందిన వైఎస్ పాలనను మెచ్చుకుంటూ, మరోవైపు ఎన్టీయార్‌ను స్మరిస్తూ… రేవంత్ రెడ్డి చాలా బ్యాలెన్స్‌డ్ సాము చేస్తున్నట్టే..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జగములేలినవాని సగము నివ్వెరబోయె, సగము మిగిలినవాని మొగము నగవైపోయె…
  • Vaibhav Suryavanshi is illegal … Do you know why…
  • అందరూ కక్షకట్టారు, వివక్ష ప్రదర్శించారు… ఆ గ్రేట్‌నెస్ చంపలేకపోయారు…
  • ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో “సక్సెషన్ ఎరా” ప్రారంభమైందా?
  • ఎన్టీయార్ వేషం వేస్తే విలన్ ఏమిటి..? హీరో ఏమిటి..? జస్ట్, ఎన్టీయార్… అంతే..!
  • నేనే తారలాగా వచ్చా నీ కోసం – నన్నే ఆదుకున్న నీవే ఆకాశం
  • వ్యూహాత్మక అడుగు… తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ ‘ఎన్టీఆర్’ కార్డ్…!
  • Byju’s …. ఎగిరెగిరి పడటం ఎంతసేపు..? విరిగిపడటం ఎంతసేపు..?
  • అనంత శ్రీరాముడు ఓ రోత ప్రబుద్ధుడు… ‘పెద్ది’కి పెద్ద మరక పూశాడు…
  • సిద్దరామయ్య విధేయ రాజకీయాల్లో ఇమిడేనా..? భవిష్యత్ ఏమిటి..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions