.
గ్లోబరీనా… గుర్తుందా..? ఏడేళ్ల క్రితం, కేసీయార్ పాలన కాలంలో మన ఇంటర్ పిల్లల జీవితాలతో ఆడుకుంది… అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు… మొదట్లో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం వెనకేసుకొచ్చింది ఆ సంస్థను… అది కేటీయార్ స్నేహితుడిదనే రాజకీయ ఆరోపణలు కూడా వచ్చాయి అప్పట్లో… (అది కేటీయార్ బినామీ సంస్థగా నిన్న మీడియా చిట్చాట్లో రేవంత్ రెడ్డి ఆరోపించాడు మళ్లీ)… తరువాత చాలా వివాదాలు, కోర్టు దాకా వెళ్లాయి సంస్థ వైఫల్యాలు… కానీ ఆ Globarena Technologies కథ ముగియలేదు… ఆ పడగ నీడ అలాగే ఉంది… కాకపోతే వేరే పేరుతో… కొత్త పేరు Coempt Edutech …
అప్పటి విషాదం, వైఫల్యం… ప్రభుత్వం పిల్లల జీవితాలతో, భవిష్యత్తుతో ఆడుకున్న తీరు గుర్తుందా..? ఈ గ్లోబరీనా తప్పులతడక ఒప్పందాలు, పరీక్ష మార్కుల మూల్యాంకనం, రీవెరిఫికేషన్, ఫలితాల క్రోడీకరణలో తప్పుల వల్ల… మెరిట్ పిల్లలు ఫెయిలయ్యారు… దాదాపు 25 మంది పిల్లలు చనిపోయారు… దాదాపు 3 లక్షల మంది పిల్లలతో అది ఆడుకుంది… విషాదం ఏమిటంటే..? బోర్డుకు అసలు ఆ సంస్థతో అప్పటికి అధికారిక ఒప్పందమే లేదు…
Ads
తరువాత పౌరసమాజం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఓ త్రిసభ్య కమిటీ వేస్తే… అది గ్లోబరీనా నిర్వాకమే కారణమని తేల్చింది… విద్యార్థుల తరఫున దాఖలైన పిటిషన్లపై స్పందించిన తెలంగాణ హైకోర్టు సమగ్ర రీ-వెరిఫికేషన్కు ఆదేశించింది… 3.82 లక్షల ఫెయిల్ విద్యార్థుల్లో 1,183 మంది వాస్తవానికి పాస్ అయినప్పటికీ కోడింగ్ లోపాల కారణంగా ఫెయిల్గా నమోదయ్యారని తేలింది… మొత్తం ఫెయిల్ విద్యార్థులతో పోలిస్తే ఈ సంఖ్య కేవలం 0.16 శాతం మాత్రమేనని పేర్కొంటూ హైకోర్టు మొత్తం పరీక్షా వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది…
తప్పనిసరై ఇక బోర్డు దాన్ని వదులుకుంది… సీజీజీ సంస్థకు పరీక్షల డేటా ప్రాసెసింగ్ అప్పగించింది… అదే 2019లో ఆంధ్రప్రదేశ్లోని జేఎన్టీయూ కాకినాడ కూడా గ్లోబరీనా టెక్నాలజీస్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది… రూ.20 కోట్ల విలువైన ఈ-లెర్నింగ్ ప్రాజెక్టులో నాణ్యతలేని కంటెంట్ అందించిందనీ, పన్నుల విషయంలో అక్రమాలు జరిగాయని విశ్వవిద్యాలయం ఆరోపించింది… అనంతరం మధ్యవర్తిత్వ (Arbitration) ప్రక్రియకు వెళ్లింది…
ఇప్పుడు సీబీఎస్ఈ వివాదం ఏమిటి?
ప్రస్తుతం సీబీఎస్ఈ పరీక్షల డిజిటల్ ప్రాసెసింగ్, మూల్యాంకన సంబంధిత అంశాల్లో గ్లోబరీనా పాత్రపై మళ్లీ చర్చ జరుగుతోంది… 2019 తెలంగాణ కమిటీ నివేదిక ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పింది. అది “సాఫ్ట్వేర్ వైఫల్యం” మాత్రమే కాదని, “సిస్టమిక్ నెగ్లిజెన్స్“ అని పేర్కొంది… అంటే టెక్నాలజీ తప్పు చేసినా, దాన్ని తనిఖీ చేయాల్సిన వ్యవస్థ కూడా విఫలమైందన్న మాట…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన CBSE OSM (On-Screen Marking) వివాదం అసలు ఏమిటంటే — ఈ ఏడాది (2026) CBSE తొలిసారిగా భారీ స్థాయిలో డిజిటల్ మూల్యాంకన వ్యవస్థను అమలు చేసింది… సంప్రదాయంగా ఎగ్జామినర్లు ఫిజికల్ ఆన్సర్ షీట్లు చెక్ చేసే విధానానికి బదులుగా, స్కాన్ చేసిన కాపీలను ఆన్లైన్లో చూసి మార్కులు వేయించే విధానాన్ని తీసుకొచ్చింది…
ఫలితాలు వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు అనేక ఫిర్యాదులు చేశారు…
- తమ ఆన్సర్ షీట్ స్థానంలో వేరే విద్యార్థి షీట్ కనిపించడం.
- స్కాన్ చేసిన కాపీలు బ్లర్గా ఉండటం.
- కొన్ని పేజీలు పూర్తిగా చెక్ కాకపోవడం.
- పేజీ వారీ మార్కులు, మొత్తం మార్కులు సరిపోకపోవడం.
- రీ-వెరిఫికేషన్ పోర్టల్ పదేపదే క్రాష్ కావడం.
- ఊహించని విధంగా 20-40 మార్కుల వరకు తేడాలు రావడం.
ఈ ఫిర్యాదులు అంత పెద్ద స్థాయికి వెళ్లాయి కాబట్టి లక్షలాది మంది విద్యార్థులు తమ స్కాన్ కాపీలు కోరారు… ఒక విద్యార్థికి తన ఫిజిక్స్ పేపర్ స్థానంలో వేరే విద్యార్థి ఆన్సర్ షీట్ అప్లోడ్ అయిన ఘటన వైరల్ కావడంతో వివాదం మరింత పెరిగింది… తర్వాత CBSE కూడా ఆ పొరపాటు జరిగినట్లు అంగీకరించింది…
- 4 లక్షలకుపైగా విద్యార్థులు తమ ఆన్సర్ షీట్ల కాపీలు కోరారు…
- 11 లక్షలకు పైగా ఆన్సర్ బుక్ కాపీల కోసం దరఖాస్తులు వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి…
- JEEలో మంచి ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు బోర్డుల్లో ఆశ్చర్యకరంగా తక్కువ మార్కులు రావడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు…
అందుకే ఈ వివాదం ఇప్పుడు “మార్కులు తక్కువ వచ్చాయి” అనే స్థాయిని దాటి… “భారతదేశంలో అతిపెద్ద విద్యా బోర్డు డిజిటల్ మూల్యాంకన వ్యవస్థ నిజంగా నమ్మదగినదేనా?” అనే పెద్ద ప్రశ్నగా మారింది… ఈ ప్రశ్న పదే పదే అదే గ్లోబరీనా, ప్రస్తుత కోఎంప్ట్ ఎడ్యుటెక్ కంపెనీ నిర్వాకాల వైపు వేలెత్తి చూపిస్తోంది…
- CBSE OSM వ్యవస్థ కోసం కాంట్రాక్ట్ పొందిన సంస్థ Coempt Edutech… ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా Rahul Gandhi, ఈ సంస్థ గతంలో Globarena Technologies పేరుతో పనిచేసిందని, 2019 తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదంలో పేరు వచ్చిన అదే సంస్థ అని ఆరోపించారు…
ఇంకో మలుపు ఏమిటంటే — ఒక యువ సైబర్ రిసెర్చర్ OSM పోర్టల్లో భద్రతా లోపాలు ఉన్నాయని, సిద్ధాంతపరంగా మార్కులు మార్చే అవకాశాలు ఉండొచ్చని ఆరోపించాడు… దీంతో సోషల్ మీడియాలో “పోర్టల్ హ్యాక్ అయింది” అనే ప్రచారం మొదలైంది… అయితే CBSE దీనిని పూర్తిగా ఖండించింది…
- పరీక్షల నిర్వహణలో, లీకేజీల బాగోతాల్లో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యం చాలా ఉంది… విద్యార్థుల జీవితాలతో ఆడుకునే గ్లోబరీనా, ప్రస్తుత కోఎంప్ట్ కంపెనీలో మంత్రి సన్నిహితులు ఎవరైనా ఉన్నారా..? మోదీ ఈ మంత్రి నిర్వాకం, వైఫల్యాన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు..? అసలు ఆ సంస్థకు జాతీయ స్థాయి పరీక్షల డేటా ప్రాసెసింగ్ బాధ్యతల్ని, పాత తప్పుల్ని విస్మరించి ఎలా కట్టబెట్టినట్టు..? ఇదేనా లింక్..?

Share this Article