.
Jagannadh Goud …. రాజస్థాన్ రాయల్స్ అనగానే కొందరికి మన బుడ్డోడు వైభవ్ సూర్యవంశి గుర్తుకు వస్తాడు. ఇంకొందరికి రాజస్థాన్ రాయల్స్ IPL టీం ఓనర్ లక్ష్మీ మిట్టల్ గుర్తుకు వస్తాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అయిపోయాక ఒక ముసలాయన తన SUV బెంజ్ లో ఎక్కటానికి తనతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారా లేరా అని ఒక సాధారణ మధ్యతరగతి మనిషిలా లెక్క పెట్టుకుంటున్నాడు కదా, అతను రాజస్థాన్ రాయల్స్ ఓనర్ మాత్రమే కాదు, ఒకప్పటి ప్రపంచ ఉక్కు చక్రవర్తి – లక్ష్మీ నివాస్ మిట్టల్.
20 యేండ్ల కిందటే, 2005 లో ప్రపంచ ధనవంతుల జాబితాలో లక్ష్మీ నివాస్ మిట్టల్ మూడవ స్థానంలో నిలిచాడు. ప్రపంచ టాప్-10 ధనవంతుల లిస్ట్ లోకి వచ్చిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు మిట్టల్. ఆ రోజుల్లో అంబానీ, అదానీ, టాటా, బిర్లాలందరినీ కొనేయగల కెపాసిటీ ఉన్న మనిషి లక్ష్మీ నివాస్ మిట్టల్.
Ads
భారత దేశం అనగానే మిగతా వారికి ఏమి గుర్తు వస్తుందో నాకు తెలియదు కానీ నాకయితే మొదటగా గుర్తు వచ్చేది స్టీల్ (ఉక్కు), సిమెంట్… మన దేశం సిమెంట్, ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి, రెండవ స్థానాల్లో ఉంటుంది. ఆధునిక ప్రపంచ నిర్మాణం అంతా వాటి చుట్టూనే ఉంటుంది.
1950 లో రాజస్థాన్ లోని సాధారణ వ్యాపార కుటుంబంలో పుట్టిన లక్ష్మీ నివాస్ మిట్టల్ 1970-75 కాలంలో మన దేశంలో వ్యాపారంలో నియంత్రణలు, ఉక్కు ఉత్పత్తిలో పరిమితులు ఉండటం వలన ఇండోనేషియా వెళ్ళి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాడు.
చాలా మంది కొత్త కంపెనీలు నిర్మిస్తారు. కానీ లక్ష్మీ నివాస్ మిట్టల్ వేరే పద్ధతి ఎంచుకున్నారు. ప్రపంచంలో నష్టాల్లో ఉన్న ఉక్కు కర్మాగారాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని లాభాల్లోకి తీసుకురావడం ఆయన ప్రత్యేకత.
- కజకిస్తాన్, రొమేనియా, పోలాండ్, దక్షిణాఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో నష్టాల్లో ఉన్న ఉక్కు పరిశ్రమల్ని, కంపనీలని కొనుగోలు చేసి విజయవంతం చేశారు లక్ష్మీ నివాస్ మిట్టల్. 15 సంవత్సరాల్లో సుమారు 47 కంపెనీలను కొనుగోలు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ స్టీల్ సామ్రాజ్యాన్ని స్థాపించి దానికి చక్రవర్తి గా మారాడు లక్ష్మీ నివాస్ మిట్టల్.
అలాంటి మనిషి ఒక సాధారణ మధ్యతరగతి మనిషిలాగా తనతోపాటు మ్యాచుకి వచ్చిన వాళ్ళు అందరూ తన కారులో ఎక్కారా లేరా అని చూసుకోవటం చూసి నేను ఆశ్యర్యపోలేదు… కారణం లక్ష్మీ నివాస్ మిట్టల్ కొడుకు ఆ రోజుల్లో అమెరికాలో చదువుతున్నప్పుడు తన వ్యాపార సమావేశాలన్నీ అమెరికాలోని న్యూయార్క్ లోనే పెట్టేవాడు.
కొడుకు ఆ సమావేశాలు చూసి నేర్చుకోవాలి అనేది అతని ఉద్దేశ్యం. గొప్ప గొప్పవాళ్ళు పిల్లల పెంపకం మీద ఏ విధంగా దృష్టి పెడతారో నేను లక్ష్మీ నివాస్ మిట్టల్ గారిని చూసి తెలుసుకున్నాను.
20 యేండ్ల కిందట ఒక ఇంటర్వ్యూలో మీ విజయంలో మీ భార్య వాటా ఎంత అంటే, నా విజయంలో 100 కి 100 శాతం పాత్ర నా భార్యదే అన్నాడు. కుటుంబానికి, విలువలకి ప్రాధాన్యత నిచ్చే వ్యక్తి లక్ష్మీ నివాస్ మిట్టల్.
లండన్లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్ ప్రాంతంలో లక్ష్మీ మిట్టల్ కొనుగోలు చేసిన ఇల్లు ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యక్తిగత నివాసంగా వార్తల్లో నిలిచింది. ఆ ఇంటిని “తాజ్ మిట్టల్” అని కూడా పిలిచేవారు. ఎందుకంటే తాజ్ మహల్కు ఉపయోగించిన అదే గనుల నుంచి తీసిన మార్బుల్తో దాని అలంకరణలో భాగం చేశారు.
ఎన్నో సేవా కార్యాక్రమాలు చేస్తాడు ఇండియా, ప్రపంచ దేశాల్లో. విద్యా సంస్థలకు విరాళాలు, ఆసుపత్రులకు సహాయం, విద్యార్థులకు అవకాశాలు. నాకు తెలిసి యూరప్ లో ఫుట్ బాల్ టీంస్ కి స్పాన్సర్ కూడా చేశాడు కొన్ని దేశాల్లో.
ఇటీవల లక్ష్మీ నివాస్ మిట్టల్ కంపనీ ఆర్సెలర్ మిట్టల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో భారీ ఉక్కు కర్మాగార ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు ₹70,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇది భారత ఉక్కు రంగంలో అతిపెద్ద పెట్టుబడులలో ఒకటిగా భావిస్తున్నారు. ఇది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్తో తాజా ఒప్పందం. వాళ్ళ అబ్బాయి ఆదిత్య మిట్టల్ తమ కంపనీ, ఆర్సెలర్ మిట్టల్ ని చూసుకుంటున్నాడు.
రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామం నుంచి ప్రారంభించి, ప్రపంచ ఉక్కు పరిశ్రమను ప్రభావితం చేసిన భారతీయ వ్యాపార దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్. 60 కి పైగా దేశాల్లో ఉక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి, ఆ రోజుల్లోనే ప్రపంచం అంటే ఒక మార్కెట్ అని భావించి తన కలని సాకారం చేసుకొని ఎందరి కలలనో సాకారం చేసిన ఉక్కు సామ్రాజ్య చక్రవర్తి ఒక సాధారణ మనిషిలాగా తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఉన్నారా లేరా అని లెక్క వేసుకుంటుంటే – ఇతనే నా అతను అనిపించి అతని గురించిన అన్ని విశేషాలూ గుర్తుకు వచ్చాయి…
Share this Article