.
మోడీ షా తెలంగాణ నాయకత్వం మీద విసుగు పుట్టి, రేవంత్ రెడ్డి లేదా హరీష్ రావు అయితేనే ‘లక్ష్యం’ సాధించలమని నమ్ముతున్నట్టుగా చాలా ప్రచారాలు సాగుతున్నాయి… నిజానికి తెలంగాణలో పార్టీకి ఓ దూకుడు నాయకత్వం కరవైంది… ఎంతసేపూ బీఆర్ఎస్కు సాగిలబడే కార్యాచరణ తప్ప, వాళ్లలో వాళ్ల కీచులాటలు తప్ప, బీఆర్ఎస్ ఓటమి తరువాత దొరికిన పొలిటికల్ స్పేసులోకి వేగంగా జొరబడదామనే సోయి కూడా లేదు…
సరే, రేవంత్ రెడ్డి, హరీష్ రావులు మోడీ అడగ్గానే వెళ్తారా అనేది పక్కన పెడితే… ఫేస్బుక్లో Ravali Babu పోస్టు ఒకటి ఇంట్రస్టింగుగా సాగింది… అందరూ ఏకీభవించాలనేమీ లేదు కానీ… ఇదొక ఆసక్తికరమైన విశ్లేషణ అనిపించింది… ఇలా…
Ads
రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుండి బయటకు వచ్చినప్పుడు, అందరూ ఆయన బీజేపీలోకి వెళ్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మరికొందరు సొంత పార్టీ పెట్టాలని సూచించారు. కానీ, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎంతో సాహసంతో కూడుకున్న నిర్ణయం. కాంగ్రెస్ అనే మహాసముద్రంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నా, ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న రేవంత్ అడుగులు కాంగ్రెస్ వైపే పడ్డాయి.
కొందరు ఆయన్ని హేళన చేశారు, సీనియర్లు వ్యతిరేకించి యుద్ధం ప్రకటించారు. వాటన్నింటినీ దాటుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కి, చివరకు ముఖ్యమంత్రి కుర్చీని అధిరోహించారు. కాంగ్రెస్లో చేరడం వల్లే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారని అనుకోవడం పొరపాటు. ఒకవేళ అప్పుడే ఆయన బీజేపీలోకి వెళ్లి ఉంటే, రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా అత్యున్నత స్థానంలో ఉండేవారు.
కాంగ్రెస్ పార్టీ రేవంత్కు అవకాశం ఇచ్చింది కానీ, పార్టీ నడపడంలో ఆయనకు పూర్తి స్థాయిలో ‘ఫ్రీ హ్యాండ్’ ఇవ్వడం లేదు. ఢిల్లీ పెత్తనం ఇంకా తగ్గడం లేదు. రేవంత్ చేస్తున్న పోరాటాన్ని బీజేపీలో ఉండి చేసి ఉంటే, మోదీ గారు ఆయన్ని మరింతగా ప్రోత్సహించేవారు.
రేవంత్ అవసరం కాంగ్రెస్కు తెలుసు కాబట్టే వారు మౌనంగా ఉంటున్నారు. కానీ, చిల్లు పడ్డ పడవలో ప్రయాణిస్తున్నట్లు రేవంత్కు తెలియంది కాదు. ఆ రోజు రేవంత్ దమ్ము మోదీకి తెలియకుండా, ఆయన బీజేపీలోకి రాకుండా కిషన్ రెడ్డి పావులు కదిపారు.
రేవంత్ బీజేపీలోకి వస్తే తన ఆటలు సాగవని కిషన్ రెడ్డి భావించారు. కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ (పాత తెరాస)తో స్నేహం చేయాలన్న కోరిక బలంగా ఉండేది. రేవంత్ వస్తే ఆ పొత్తు కుదరదని ఆయనకు బాగా తెలుసు. ఏపీలో టీడీపీ- బీజేపీ స్నేహానికి అడ్డుకట్ట వేయడానికి కిషన్ రెడ్డి, జగన్కు కోవర్టులా పనిచేశారని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది.
కానీ, మోదీ తెలివిగా టీడీపీతో స్నేహానికి చివరికి ఒప్పుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో కిషన్ రెడ్డి మాటలు విని రేవంత్ను వదులుకోవడం పెద్ద తప్పు అని మోదీ గ్రహించారనిపిస్తుంది. “ఒక్క రేవంత్, వంద మంది కిషన్ రెడ్డిలతో సమానం” అని బీజేపీ నాయకులకు ఇప్పుడు అర్థమైంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నా, పరిస్థితులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు.
మాస్ ఇమేజ్ ఉన్న నాయకత్వం లేక బీజేపీ సతమతమవుతోంది. తెలంగాణలో అధికారం దక్కాలంటే రేవంత్ రెడ్డి లేదా హరీష్ రావు బీజేపీకి అవసరమని మోదీ గుర్తించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ వేసిన గాలానికి ఈ ఇద్దరు నాయకుల్లో ఎవరో ఒకరు తగులుతారని తెలంగాణ బీజేపీ ఆశగా ఎదురుచూస్తోంది.
ఢిల్లీ రేవంత్కు ఎర్ర తివాచీ పరిచింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల అపాయింట్మెంట్ కంటే, దేశ ప్రధాని అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డికి క్షణాల్లో వస్తుందంటే.. రేవంత్ దమ్ము, ఆయన రాజకీయ వ్యూహం చాలామందికి అర్థం కావడం లేదు. రేవంత్ కత్తికి ఇరువైపులా పదును ఉందని ఇప్పుడు కొందరికి మాత్రమే తెలిసిన సత్యం.
Share this Article