.
నాలుగు రోజులు సావాసం చేస్తే వాళ్లు వీళ్లవుతారు, వీళ్లు వాళ్లవుతారు. సహజం. రహస్యంగా దోస్తీ చేసేవారు మరీ త్వరగా మారిపోతారు… నిన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాంచందర్రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేసిన ప్రశ్న, చేసిన డిమాండ్ చదివితే ఇదే అనిపించింది…
గంగ చంద్రముఖిగా మారినట్టు… రాంచందర్రావు కూడా ఒక హరీష్రావులా మారిపోయాడేమో..! తనేమంటాడు అంటే..? ‘‘తుంగభద్ర నీటి వాటాల విషయంలో నువ్వు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో అంతర్గతంగా ఏం మాట్లాడావు? ఏం హామీలు పొందావు? అసలేం జరిగింది? నిజం చెప్పు? జనం కోరుతోంది?’’
Ads
అంతేకాదు, నవేలీ, గుండ్రేవుల ప్రాజెక్టులతో ఇక ఆర్డీఎస్కు 5, 6 టీఎంసీలు కూడా రాకుండా పోయే ప్రమాదం ఉందనీ ఆందోళన వ్యక్తం చేశాడు… అయ్యా, రాంచందరా..? ఆర్డీఎస్కు ఆల్రెడీ ఐదారు టీఎంసీలు రావడం లేదు మహాశయా, రేవంత్ రెడ్డి తుంగభద్ర మూడు రాష్ట్రాల సీఎంలు ప్లస్ కేంద్ర మంత్రి భేటీలో ఆందోళన వ్యక్తం చేసింది అదే…
ఆర్డీఎస్ ఆధునీకరణ జరగక, తుంగభద్రలో పూడిక తదితర కారణాలు… ఇంకా నవేలి, గుండ్రేవుల కూడా కడితే మరింత నష్టం… నిజానికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న బీజేపీ నేతలు ఏదైనా మాట్లాడాలంటే ముందు సబ్జెక్టు స్టడీ చేస్తారు, మరేమిటి ఈయన పాపం?
హరీష్, కేటీయార్లతో సీక్రెట్ దోస్తీ చేసీ చేసీ… తనూ వాళ్లలాగే మాట్లాడుతున్నాడా..? అవును, వీళ్లు వాళ్లయ్యారు..! మరీ హరీష్ రావులా తయారైతే ఎలా మాస్టారూ..? పైగా మూడు రాష్ట్రాల నడుమ ఎంవోయు అనే ప్రతిపాదన తెచ్చింది కేంద్ర మంత్రి…
రాంచందర్రావు మరిచిపోయినట్టున్నాడు… కేంద్రంలో ప్రభుత్వం బీజేపీదే… అంటే తమరు ఓ రాష్ట్ర శాఖకు నాయకత్వం వహిస్తున్న పార్టీయే… మరీ కాషాయం పింక్ అయిపోతే ఎలా మాస్టారూ..? ఏమయ్యా పాటిల్, నువ్వు రేవంత్ రెడ్డికి ఏం చెప్పావు? ఏం హామీలు ఇచ్చావు? అసలు ఏం జరిగిందో, నీ ఆలోచన ఏమిటో చెప్పు అని పాటిల్ను కదా అడగాల్సింది… తను మీవాడే కదా… గుర్తులేదా..?
పదే పదే హరీష్ రావు, కేటీయార్ల ప్రెస్మీట్లు వినీ వినీ… ఉన్న వివేచన కూడా ఎగిరిపోయిందా..? ఎస్, తుంగభద్ర ఎగువన కర్నాటక ప్రాజెక్టులు కడుతోంది , దిగువన ఏపీ కడుతోంది, తెలంగాణ ఆందోళన అదే, రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దగ్గర వ్యక్తం చేసిందీ అదే. దానికి కేంద్ర మంత్రి ఏదో ప్రపోజల్ ముందు పెట్టాడు…
బీజేపీయేతర ప్రభుత్వాలైనా సరే కర్నాటక, తెలంగాణ మీరు న్యాయం చెప్పండి, ఆల్టర్నేట్ చెప్పండి, వింటాం అని సానుకూలంగా స్పందించాయి. సరే, చంద్రబాబు ప్రస్తుతానికి ఎన్డీయేలోనే ఉన్నాడు. మరి తుంగభద్ర విషయంలో తెలంగాణకు ఏదో జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేయడం అంటే… రాంచందర్రావు పార్టీ కేంద్రంలో ఉండి, ఏదో ప్రతిపాదిస్తూ ఏదో అన్యాయం చేయబోతోందనే సంకేతాల్ని తెలంగాణ సమాజంలోకి పంపిస్తున్నట్టా..?
ఇక్కడ కిషన్ రెడ్డి స్పందన హుందాగా ఉంది, సంయమనంతో ఉంది… మెట్రోపై తను ఒక్క పొల్లు మాట మాట్లాడలేదు, ఇద్దరు కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీలో తను ఉన్నా సరే, బయటకు ఏమీ చెప్పలేదు…
హరీష్ రావుకు ఓ గురుఫోబియా… అదొక చిత్రమైన మానసిక స్థితి… ఇరాన్ మీద అమెరికా బాంబులు వేసినా, రష్యా మీద ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసినా… తన గురువు చంద్రబాబుకు, శిష్యుడు రేవంత్ రెడ్డి సమర్పించే గురుదక్షిణ అంటాడు… తుంగభద్రలోనూ అంతే…
ఎవరు శిష్యుడు? ఎవరు గురువు? ఎవరి రాష్ట్రం వాళ్లది… ఎవరి రాజకీయం వాళ్లది… ఎవరి ప్రయోజనాలు వాళ్లవి… ఎవరూ నిర్దేశించరు, ఎవరూ శాసించరు… హరీష్ రావుకు తెలియక కాదు, రాంచందర్రావుకు అర్థంగాక కాదు… కాకపోతే ముందే చెప్పుకున్నట్టు… సావాసంతో వాళ్లు వీళ్లయితే, వీళ్లు వాళ్లయితే వచ్చే తిప్పలు ఇవి..!!
Share this Article