.
ఏపీ పాలిటిక్స్ తీరే వేరు- కాక్రోచ్ డిమాండ్లు గానీ, ఇంకేదైనా గానీ… అధికారపక్షమూ సైలెంట్… ప్రతిపక్షమూ సైలెంట్… తెలంగాణలో అధికార పార్టీ నిరసనలు… తప్పనిసరై విధి లేక బీఆర్ఎస్ నిరసన స్వరాలు… రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల తీరుపై ఇంట్రస్టింగ్ చర్చలు సాగుతున్నాయి… ప్రత్యేకించి బీఆర్ఎస్, వైసీపీ పార్టీల వ్యవహారశైలి మీద!
నెగెటివ్, పాజిటివ్… ఏదైనా సరే, దేశవ్యాప్తంగా “కాక్రోచ్” ఉద్యమం పెద్ద చర్చగా మారింది… జాతీయ రాజకీయాల్ని కుదుపుతున్నాయి, అది అందరూ అంగీకరించాల్సిందే… నీట్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడంలో సీజేపీ సక్సెస్… సరే, వాళ్ల వెనుక అసాంఘిక, విద్రోహ శక్తులు మొహరించాయనేది వేరే సబ్జెక్టు…
Ads
దేశంలోని సెలబ్రిటీలు, ప్రముఖ పార్టీల నాయకులు దీనిపై స్పందిస్తున్నారు… కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న రాజకీయ వైఖరులు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి… సాధారణంగా అధికార పార్టీలు కేంద్రాన్ని విమర్శించడంలో జాగ్రత్త పడతాయి, ప్రతిపక్షాలు ముందుండి పోరాడతాయి. కానీ ఈసారి రెండు రాష్ట్రాల్లోనూ ఆ సాంప్రదాయ రాజకీయ గణితం పూర్తిగా తారుమారైంది.
తెలంగాణలో మొదట బీఆర్ఎస్ కూడా పెద్దగా స్పందించలేదు. కేంద్రంలోని బీజేపీతో నేరుగా ఢీకొనడంలో కొంత సంకోచం కనిపించింది. భవిష్యత్తు సమీకరణాల దృష్ట్యా బీజేపీని గోకదలుచుకోలేదు… అయితే ఉద్యమం విస్తరించడం, విద్యార్థి వర్గాల్లో దీనిపై చర్చ పెరగడం, మౌనం తమకే ప్రతికూలంగా మారుతుందనే రాజకీయ అంచనాలతో కేటీఆర్ రంగంలోకి దిగాడు…
విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు… గతంలోని గ్లోబరినా ఇష్యూను మళ్లీ మళ్లీ కేటీయార్ మెడలో వేయడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది… ఇప్పుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని ఎలుగెత్తుతున్న ఆయన గతంలో టీఎస్పీఎస్సీ లీకేజీల వేళ నైతికంగా ఏం బాధ్యత వహించాడనే ప్రశ్న కేటీయార్ తాజా నిరసనల క్రెడిబులిటీని దెబ్బతీసింది…
ఎలాగూ కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యర్థే కాబట్టి, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఆందోళనలు నిర్వహిస్తున్నాడు కాబట్టి, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన స్థాయిలో స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కూడా నిరసనలు వ్యక్తం చేశారు. మొత్తానికి తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలు రెండూ ఏదో ఒక రూపంలో తమ వైఖరిని బయటపెట్టాయి…
కానీ ఆంధ్రప్రదేశ్లో దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంది.
టీడీపీ, జనసేన మౌనం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. అవి కేంద్రంలోని బీజేపీతో కూటమిలో ఉన్నాయి. అలాంటి సమయంలో నేరుగా కేంద్రాన్ని ఇబ్బందిపెట్టే అంశంపై మాట్లాడకపోవడం రాజకీయంగా అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్న కూటమికి ఢిల్లీతో సంబంధాలు కూడా కీలకమే. (ఈ సమయంలో మోడీ కూటమిలో గనుక చంద్రబాబు ఉండి ఉండకపోతే అసలు చంద్రబాబు వైఖరి ధూంధాం ఉండేది)…
అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది వైసీపీ మౌనం. బీజేపీతో అధికారికంగా పొత్తు లేని పార్టీగా వైసీపీకి మాట్లాడే అవకాశం ఉంది. పైగా గతంలో ఇలాంటి అంశాలపై జగన్ స్పందించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆయన, పార్టీ నాయకత్వం దాదాపు నిశ్శబ్దంగా ఉండటమే రాజకీయ చర్చకు దారి తీస్తోంది…
ఒక దశలో నేనూ కాక్రోచ్ అవుతానన్న నాయకుడు ప్రస్తుతం సైలెంట్… బీజేపీకి కోపం తెప్పించకూడదు, అదొక్కటే ధోరణి… అనేక బిల్లులపైనా అంతే… మెడపై వేలాడుతున్న కేసులు పదే పదే జగన్ రాజకీయ ధోరణిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి… చివరకు తమ ఉనికిని చాటుకోవాల్సిన సందర్భాల్లోనూ నిశ్శబ్దమే దాని మార్గం… అది జనంలో మైనసే…
ఈ పరిణామం ఒక ఆసక్తికరమైన రాజకీయ చిత్రాన్ని చూపిస్తోంది. తెలంగాణలో అధికారం- ప్రతిపక్షం నిరసనలు… ఏపీలో అధికారం- ప్రతిపక్షం సైలెంట్… ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కనిపిస్తున్న వింత రాజకీయ వ్యత్యాసం.
ఒకే జాతీయ అంశంపై తెలంగాణలో "మాట్లాడాల్సిన పోటీ" నడుస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం "మౌన పోటీ" సాగుతోంది. ఇదే రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల తాజా వింత పోకడ...
Share this Article