.
ప్రొఫెసర్ నాగేశ్వర్ భ్రష్టుపట్టాడా..? దిక్కుమాలిన వివాదాన్ని నెత్తికెక్కించుకుని, తనకు ఎన్నడూ పట్టని తెలంగాణవాదాన్ని ఆశ్రయించి, తెలంగాణ అస్థిత్వ పటం వెనుక దాక్కుని రక్షణ కోరుకుంటున్నాడా..? ఎందుకు పదే పదే గోకుతున్నాడు..? పబ్లిసిటీ కావాలా..? ఈ ప్రశ్నలన్నీ కొద్దిరోజులుగా చర్చనీయాంశాలు… కానీ తను ఓ విషయాన్ని మాత్రం బలంగా చర్చకు పెట్టాడు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో…
అది బీజేపీ- చంద్రబాబు అవసరార్థం బంధం… దానికి మధ్యవర్తి, సంధానకర్త పవన్ కల్యాణ్… హైకమాండ్కు జగన్ కావాలి, కానీ పరోక్షంగా… చంద్రబాబూ కావాలి, కానీ ప్రత్యక్షంగా… జగన్ లాంగ్ టరమ్ ఫ్రెండ్, చంద్రబాబు ఇన్స్టంట్, టెంపరరీ, టైమ్లీ ఫ్రెండ్..! ఇక్కడ మళ్లీ రెండు కోణాలు…
Ads
1. ఇదే చంద్రబాబు మోదీ పనైపోయిందని భ్రమపడి, ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకుని, మోదీని చివరకు వ్యక్తిగతంగా కూడా దూషించాడు, కాంగ్రెస్ పంచన చేరాడు… దెబ్బతిన్నాడు, మళ్లీ మోదీకి దాసోహం అన్నాడు నానారకాలుగా తిప్పలుపడి… మళ్లీ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే చంద్రబాబు కథ వేరే ఉండేది… బచ్గయా…
2. జగన్ లాంగ్ టరమ్ ఫ్రెండేమీ కాదు, తనకు కేసుల భయం, తప్పనిసరై బీజేపీ చెప్పినట్టు ఆడటం తన అవసరం… అంతే… ఇప్పటికిప్పుడు జగన్ ఏపీ రాజకీయ బరిలో లేకుండా పోయినా సరే, ఆ ప్లేసులో బీజేపీ దూరలేదు… దానికి వ్యూహరాహిత్యం, నాయకత్వలోపాలు, ఏపీ రాజకీయాల్ని అర్థం చేసుకునే సోయి లేకపోవడం…
జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ఇదే చెబుతున్నాడు తన పత్రికలో… మార్మిక పదాలు, పరోక్ష వ్యాఖ్యలు ఏమీ ఉండవ్… స్ట్రెయిటుగా జనానికి అర్థమయ్యేట్టు చెప్పడమే… అందరూ ఏకీభవిస్తారని కాదు… సరే, ఓసారి అది చదవండి… భిన్నమైన కోణం…

Zamin Ryot …. జగన్కు అమిత్ షా అభయ హస్తం; బాబు అలక పాన్పు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బిజెపి రెండు పడవలలో కాళ్లు పెట్టి ప్రయాణిస్తున్నదన్న సత్యం అందరికీ తెలుసు. వారికి జగన్ కావాలి; చంద్రబాబు కూడా కావాలి. ఇద్దరూ తమ వాకిట్లో నిలబడి దేహీ అని యాచించే స్థితిలోనే వుండాలి. అమిత్ షా చిత్రీకరించిన రాజకీయ చిత్రం ఇది.
అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి, వైఎస్ జగన్కు శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తింప చేయాలనే కోరిక ముఖ్యమంత్రిలో, ఆయన కుమారుడిలో బలంగా వుంది. కానీ తన చేతులకు మట్టి అంటుకోకుండా పని జరిగి పోవాలన్నది చంద్రబాబు అంతర్యం. ఆ కోరిక తీర్చగలిగిన వాడు అమిత్ షా ఒక్కడే. ఎన్నో పర్యాయాలు ఆ ముచ్చట నడిచిందని చెప్తారు; కానీ ఎన్నిసార్లు విన్నవించినా అమిత్ షా మనసు మాత్రం కరగడం లేదు.
జగన్ను అరెస్ట్ చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో అవకాశాలున్నాయి. మద్యం కేసు ఒకటి చాలు, బెయిల్ కూడా రాకుండా నెలల పర్యంతం జైలులోనే మగ్గేట్లు చేయడానికి. కానీ అక్కడ రెండు అడ్డంకులున్నాయి.
- మొదటిది – రాష్ట్ర ప్రభుత్వం జగన్ను జైలుకు పంపితే, ఆయన పట్ల సానుభూతి వస్తుందేమో అన్న భయం. అదే పని సిబిఐ, ఇడిల ద్వారా కేంద్రం చేస్తే, మట్టి అంటకుండా మనసులోని కోరిక తీరుతుంది.రెండవ అడ్డంకి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డితో చేసుకున్న రాజీ ఒప్పందం. మద్యం కేసుతో పాటు, పలు ఇతర కేసులలో కూడా పెద్దిరెడ్డి కుటుంబం జోలికి వెళ్లకుండా రాజీ ఒప్పందం జరిగిందని చెప్తున్నారు. అందువల్లే, మద్యం కేసు మధ్యలోనే ముగించారన్న వాదన ఉంది.
జగన్ జోలికి వెళ్లడానికి ఏ కోణం నుంచి కూడా అమిత్ షా ఆసక్తి చూపడం లేదు. నీ అరెస్ట్ జరగదు అని అమిత్ షా వర్గాల నుంచి జగన్కు స్పష్టమైన సందేశం వచ్చిందని చెప్తున్నారు. ఆ ధైర్యంతోనే ఆయన ఇటీవల తరచు తాడేపల్లికి వస్తున్నారు. గతంలో వలె భయం లేదు. చంద్రబాబు మీద నేరుగా ఆరోపణలు సంధిస్తున్నాడు. అమిత్ షా అభయ హస్తం లభించడం కంటే, ఈ దేశంలో మరొక రక్షణ కవచం ఏమి వుంటుంది?
కానీ చంద్రబాబుకు మాత్రం దీన్ని ఇట్లానే వదలి పెట్టాలని లేదు. కేంద్రం నేరుగా జగన్ అరెస్ట్కు సహకరించక పోయినా, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ద్వారా ఆ కోరిక తీర్చాలనే విన్నపం వినిపిస్తున్నదట – ఢిల్లీలో. జగన్ మీద పాత కేసులు చాలానే వున్నాయి. వాటి విచారణకు కూడా హాజరు కావడం లేదాయన. బెయిల్ మీదనే దశాబ్దం పైగా నిక్షేపంగా కాలం గడిపేస్తున్నాడు. ఈ బెయిల్ రద్దయితే, న్యాయస్థానం ఆదేశంతో జగన్ను మళ్లీ జైలుకు పంపవచ్చు. ఆ శక్తి అమిత్ షా ఒక్కరికి మాత్రమే వుందన్నది వాస్తవం.
అందువల్ల, జగన్ అరెస్ట్లో మీ ప్రమేయం వద్దు, నా ప్రమేయమూ వద్దు; న్యాయస్థానాల సహకారంతో ఈ సమస్య పరిష్కరించాలన్నది చంద్రబాబు ప్రతిపాదిస్తున్న మధ్యే మార్గం. జగన్ బెయిల్ రద్దు కోరుతూ రఘురామ కృష్ణమరాజు వంటి వారు న్యాయస్థానాలలో కేసులు వేసి వున్నారు. వాటి విచారణ సహజంగానే ఏళ్ల తరబడి వెనక్కు పోతూ వుంది. అమిత్ షా తలచుకుంటే, రేపు ఉదయానికి విచారణ జరిపించవచ్చు. తీర్పు కూడా చెప్పించవచ్చు. ఆ పుణ్యం కట్టుకోమని ప్రాధేయపడుతున్నాడు చంద్రబాబు. ఆయన అభీష్టం నెరవేరుతుందో లేదో మనకైతే తెలియదు…
Share this Article