.
మద్యం మత్తులో అసెంబ్లీకి వచ్చాడు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తనకు డోప్ టెస్టు చేయాలి, తనకే కాదు సభ్యులందరికీ టెస్టులు చేయాలంటూ నిన్న పంజాబ్ అసెంబ్లీలో రచ్చ… అసలే వరుస దెబ్బలతో కుదేలవుతున్న ఆప్కు ఈ లిక్కర్ మాస్టర్ ఓ తలనొప్పిగా మారాడు… అదసలే ఉడ్తా పంజాబ్.., కంట్రోల్ చేయాల్సిన ముఖ్యమంత్రే ఎప్పుడూ ‘ఆన్’లో ఉంటాడనేది ప్రధాన ఆరోపణ… ఆరోపణ కాదు, తను అంతే… కేజ్రీవాల్ కీర్తికిరీటంలో మణిమాణిక్యం మరి…
అదేదో తెలుగు సినిమాలో కమెడియన్ ఆలీ ‘హెలో ఎస్కుస్మీ’ అంటూ ఎప్పుడూ తాగి ఊగుతుంటాడు, ఐడియా ఉంది కదా… ఓసారి ఆ పాపులర్ కామెడీ ట్రాక్, సీన్స్ గుర్తుచేసుకొండి… విషయానికొస్తే… ఈ సీఎం గురించి… ఇండియా ఇజ్జత్ తీసిన ఓ సంఘటన గురించి ఓసారి చెప్పుకోవాలి…
Ads
2022 సెప్టెంబర్… రాష్ట్ర ప్రభుత్వ అధికార పర్యటన… ఈ హీరో కూడా ఆ టీమ్లో ఉన్నాడు… తనే లీడ్ చేస్తున్నాడు… జర్మనీ పర్యటన ముగించుకుని వస్తున్నప్పుడు… (ఎందుకు పోయారు? ఏం ఉద్దరించారు అనడక్కండి… ఇండియా నుంచి సాగే అనేకానేక అధికారిక పర్యటనలు జస్ట్ విహారయాత్రలే)… అది ఫ్రాంక్ఫర్ట విమానాశ్రయం…
మన కథానాయకుడు అప్పటికే ఫుల్ ఛార్జింగ్ మీదున్నాడు… అసలు నడవలేని స్థితి, ఊగుతున్నాడు… ఎలాగోలా ఎక్కాడు, కానీ మనిషి సోయిలో లేడు… విమానం లేటవుతోంది… దీంతో ఇతర ప్రయాణికులు ఆ లుప్తాన్స్ విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు… దాంతో విమానం నుంచి తనను దింపేశారు… 4 గంటలు ఆలస్యంగా విమానం టేకాఫ్ అయ్యింది… సుఖ్బీర్ సింగ్ బాదల్ (SAD) వంటి నేతలు ఒక సీఎంగా ఉండి, మొత్తం పంజాబీల పరువు తీశాడంటూ దుమ్ముదులిపాడు…
సరే, ఎప్పటిలాగే ఆప్ ఏదో సర్దిచెప్పుకుంటూ… ఇవన్నీ ఫేక్ ఆరోపణలు, ప్రతిపక్షాల దుష్ప్రచారం అని వివరణ ఇచ్చుకుంది… కేవలం అనారోగ్యం కారణంగానే ఆ విమానం ఎక్కలేదని చెప్పుకుంది… అది అనారోగ్యం కాదు, ఈ రోగమేనని వాళ్లకూ తెలుసు… ఇండియా పరువు తీసిన ఆ యవ్వారం మీద నిజాలు తెలుసుకుంటానని అప్పటి ఏవియేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రకటించాడు, కానీ నిజాలు బయటపడితే ఇండియా పరువు పోతుందనే భావనతో ఇక రెట్టించలేదు, కొనసాగించలేదు… లుఫ్తాన్సా కూడా ఏవో కారణాలు చెప్పింది…
భగవంత్ మాన్ రాజకీయ ప్రస్థానంలో ‘మద్యం అలవాటు’ అనేది అతిపెద్ద, నిరంతర విమర్శ… దీనిపై గతంలో చాలా చర్చలు, వివాదాలు జరిగాయి… ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటుకు కూడా మద్యం సేవించి వచ్చేవారని అప్పట్లో ఎంపీలు సుశీల్ కుమార్ రింకూ వంటి వారు ఆరోపణలు చేశారు…
తల్లి సమక్షంలో ప్రమాణం…: 2019లో ఒక బహిరంగ సభలో భగవంత్ మాన్ తన తల్లి సమక్షంలో ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించాడు… “నేను ఇకపై మద్యాన్ని ముట్టుకోను, నా పూర్తి సమయాన్ని పంజాబ్ ప్రజల సేవకే అంకితం చేస్తాను” అని ప్రమాణం చేశాడు…. ఇది అప్పట్లో పెద్ద వార్త అయ్యింది… కానీ ఓ తాగుబోతు ప్రమాణాలకు స్థిరత్వం ఏముంటుంది..?
ప్రతిపక్షాల విమర్శలు…: ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పంజాబ్లోని ప్రతిపక్షాలు (కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్) తరచూ తనను ‘అమలీ’ (మత్తుకు బానిస) అని విమర్శిస్తూనే ఉంటాయి… AAP నేతలు మాత్రం దీన్ని ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు చేసే కుట్రగా కొట్టిపారేస్తారు… ఆయన ఒక కమెడియన్ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడని, ప్రజల్లో తన ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని వాదిస్తారు… ఇంతకీ సారు గారి బ్రాండ్ ఏమిటో..?!
Share this Article