.
త్రిపురలో విఫలమైన చిన్న పార్టీ.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్! బలమైన శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) నుండి దాదాపు మూడింట రెండు వంతుల మంది ఎంపీలు తిరుగుబాటు చేసి, ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (NCPI) అనే అతి చిన్న పార్టీలో విలీనం కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఎవరూ ఊహించని పరిణామం…
అసలు ఈ పార్టీ ఎవరిది..? ఏమిటి దీని కథ..? పార్టీ నేపథ్యం, తెరవెనుక బాగోతం… ఈ NCPI పార్టీ ఎప్పుడు పుట్టిందో, ఎవరి కోసం పుట్టిందో చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించిన కీలక అంశాలు ఇవి….
Ads
-
అస్పష్టమైన పుట్టుక…: 2023 జనవరి 20న ఈ పార్టీ ఎన్నికల సంఘం వద్ద నమోదైంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనేది అంతుచిక్కని ప్రశ్న…
-
కార్పొరేట్ లింకులు…: పార్టీ కోశాధికారిగా ఉన్న షెవ్లీ కుందు, అదే చిరునామాలో ‘బిశ్వబజార్ ప్రైవేట్ లిమిటెడ్’ మరియు ‘పశ్చిమ బంగా అసంగథిత మహిళా కార్మి అసోసియేషన్’ అనే రెండు సంస్థలను నిర్వహిస్తున్నారు. రాజకీయం కంటే వ్యాపార కోణాలే ఈ పార్టీ వెనుక బలంగా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
-
ఆర్థిక వివరాలు…: ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం కేవలం రూ. 1.13 లక్షల విరాళాలు మాత్రమే చూపిన ఈ పార్టీకి, ఇప్పుడు అకస్మాత్తుగా 20 మంది ఎంపీల మద్దతు లభించడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతా అమిత్ షా మాయ…
త్రిపుర ఎన్నికలు: ఆరంభంలోనే ముగిసిన అధ్యాయం
NCPI నాయకుడు శాంతను దే, త్రిపురలోని గిరిజన ప్రాంతాల్లో (TTAADC) పోటీ చేయడమే తమ లక్ష్యమని చెప్పినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.
-
నామినేషన్ల గందరగోళం…: ఏడు స్థానాల్లో పోటీ చేయాలనుకుంటే, సాంకేతిక కారణాలతో నాలుగు నియోజకవర్గాల్లో నామినేషన్లే తిరస్కరణకు గురయ్యాయి.
-
ఓట్ల లెక్కింపు…: మిగిలిన రెండు స్థానాల్లో కలిపి పార్టీకి వచ్చింది కేవలం 822 ఓట్లు మాత్రమే.
-
అభ్యర్థుల ఆవేదన…: పోటీ చేసిన అభ్యర్థుల మాటల్లో చెప్పాలంటే, ఎన్నికలు ముగియగానే పార్టీ నాయకులు కోల్కతాకు పారిపోయారు. “తమను కేవలం అభ్యర్థులుగా నిలబెట్టడానికే వాడుకున్నారని, ఆ తర్వాత సంబంధాలు తెంచుకున్నారని” అభ్యర్థులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
పార్లమెంట్లో రాజకీయ సంక్షోభం … ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే, ఇది కేవలం ఒక పార్టీ విలీనంలా కాకుండా, తృణమూల్ కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి చేసిన ఒక పక్కా వ్యూహం… త్రిపుర ఎన్నికల తర్వాత నిధుల లేమి, అంతర్గత గొడవలతో పార్టీ ఉనికి, మనుగడే ప్రశ్నార్థకమైన వేళ ఈ టీఎంసీ రెబల్స్ వచ్చి చేరడంతో కథ మొత్తం మారిపోయింది. అఫ్కోర్స్, పార్టీ మార్పిడి చట్టం (Anti-Defection Law) నుండి తప్పించుకోవడానికి జరిగిన ‘షా’లిటిక్స్ ఇవి…
రాజకీయాలు అంటే ఇవే… ఓ అత్యంత అనామక రాజకీయ పార్టీ హఠాత్తుగా జాతీయ స్థాయిలో నిర్ణయాత్మక శక్తిగా మారడం అంటే… అంతా అమిత్ షా అమాత్యవర్యుడి మాయ, లీల..!! ఈ పరిణామాన్ని ఊహించలేని టీఎంసీ, ఇండి కూటమి, రాజకీయ విశ్లేషకులు, మీడియా మొత్తం తెల్లమొహాలు వేశాయి..!!
Share this Article