.
డీలిమిటేషన్ బిల్లు సమయంలో … జనాభాయే కాదు, అభివృద్ధినీ, హ్యూమన్ ఇండెక్స్ ప్రమాణాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని హైబ్రీడ్ మోడల్ ప్రతిపాదించి జాతీయ స్థాయి మేధావుల దృష్టిని ఆకర్షించిన రేవంత్ రెడ్డి ఈసారి మరో మంచి ప్రతిపాదనతో కేంద్రం దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు…
తను ప్రధాని మోడీని కలిశాడు, నీతి ఆయోగ్ భేటీకి వెళ్లాడు… ఎస్, ప్రధానితో కలిసినప్పుడు రాష్ట్రానికి సంబందించిన అంశాలు తప్పకుండా వస్తాయి… రాకుండా ఎలా ఉంటాయి… తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర అనుమతి ఇవ్వాల్సిన 150 మీటర్ల ఎత్తు దగ్గర నుంచి, రాష్ట్ర పెండింగ్ సమస్యలు కూడా వస్తాయి… తెలంగాణ రాష్ట్ర బీజేపీ బీఆర్ఎస్ ‘మాయలో’ ఎలా ఉందనే వివరాల ఏకరువు కూడా ఉంటుంది…
Ads
తుమ్మిడిహెట్టి వంటి అంశాల్లో కిషన్రెడ్డి వంటి నేతల స్థాయి సరిపోవడం లేదు, సహకరించడం లేదు, మీరే పూనుకోవాలనీ చెప్పాడు… సహజం… సరే, మోదీ కూడా కిషన్ రెడ్డి స్థాయిలోనే రాజకీయాలు ఆలోచిస్తాడానేది వేరే విషయం… ఐతే స్ట్రెయిట్గా తను కీలక తెలంగాణ కోరికలను, అంటే కేంద్రం సహకరించాల్సిన కోరికలను మోదీ ముందు పెట్టాడు… అవి…
1. రీజనల్ రింగ్ రోడ్డు…. 2. మెట్రో-2 విస్తరణ…. 3. హైదరాబాద్–అమరావతి–బందర్ పోర్ట్ ఎక్స్ప్రెస్వే… 4. వరంగల్ ఎయిర్పోర్ట్… 5. హైదరాబాదులో ఐఐఎం… 6. మూసీ పునరుజ్జీవం… 7. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు, కేంద్ర సాయం… 8. భారత్ ఫ్యూచర్ సిటీకి సహాయం… 9. ఇండియా సెమీ కండక్టర్ మిషన్… 10. తుమ్మిడిహెట్టి 150 మీటర్లకు అనుమతి… టెన్ కమాండ్ మెంట్స్…
ఐతే వీటికన్నా… దేశం దృష్టిని ఆకర్షించిన మరో ప్రతిపాదన మాత్రం అభినందనీయం. ఇక్కడ ఉత్తరం-దక్షిణం తేడా లేదు… పార్టీ భేదాలు లేవు… తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ అడగలేదు… హైదరాబాద్కు మాత్రమే ప్రాధాన్యం కోరలేదు… తను ప్రతిపాదించింది “షష్ట నగరి” కాన్సెప్ట్.
హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ, బెంగుళూరు… దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన నాడీ కేంద్రాలైన ఆరు మహానగరాలు. దేశ జనాభాలో దాదాపు 10 శాతం మంది ఇక్కడే నివసిస్తున్నారు. దేశ జీడీపీలో దాదాపు పావు వంతు ఈ నగరాల నుంచే వస్తోంది.
అందుకే ఈ ఆరు నగరాలను కేవలం రాష్ట్రాల రాజధానులుగా కాకుండా, భారత భవిష్యత్తును నడిపించే “విశ్వనగరాలుగా” చూడాలని రేవంత్ ప్రతిపాదించాడు. రూ.6 లక్షల కోట్లతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, నేరుగా ప్రధానమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో గ్లోబల్ స్టాండర్డ్స్తో అభివృద్ధి చేయాలని సూచించాడు.
నిజానికి ఇది ఖర్చు కాదు… పెట్టుబడి. ప్రపంచ స్థాయి నగరాలు కేవలం భవనాలతో రావు… పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశోధన, ఇన్నోవేషన్, అంతర్జాతీయ ప్రభావం వాటి వెంట వస్తాయి. సింగపూర్, షాంఘై, దుబాయ్, సియోల్, టోక్యో వంటి నగరాలు తమ దేశాలను ప్రపంచ పటంలో నిలబెట్టినట్లే… ఈ షష్ట నగరాలు కూడా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టగలవన్నదే ఈ ప్రతిపాదన సారాంశం.
ప్రతిపాదన బాగుంది. ఇప్పుడు చూడాల్సింది ఒక్కటే… మోదీ దీనిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తిగా చూస్తాడా…? లేక భారత భవిష్యత్తుకు సంబంధించిన జాతీయ ఆలోచనగా స్వీకరిస్తాడా…? లేక తను కూడా ఓ కిషన్ రెడ్డి స్థాయిలో ‘ఆగిపోతాడా’..? అదే తేడా… రాజకీయ నాయకుడికి, స్టేట్స్మన్కు..!!
కోల్కతా ఎలాగూ ఓ తాటకి పాలన నుంచి విముక్తి పొందింది కాబట్టి, మోదీ కూడా కాన్సంట్రేట్ చేయకతప్పదు… హైదరాబాద్ సహా మిగతా అయిదు నగరాలూ ఆల్రెడీ దూసుకుపోతున్నాయి కూడా… భౌగోళిక వాతావరణం, బహుళ సంస్కృతి హైదరాబాద్కు పెద్ద ప్లస్ పాయింట్… (ముంబై, చెన్నై కన్నా ప్రత్యేకించి ఐటీ సెక్టార్లో బెంగుళూరు, హైదరాబాద్ పోటాపోటీ…)
Share this Article