.
మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తన దగ్గరకు ఫైల్ రాగానే… కాస్త అటూ ఇటూ తిప్పగానే తనకు ఆ ఫైల్ మర్మం అర్థమైపోయేదట… ఏ ప్రతిపాదనల వెనుక ఏముందో ఇట్టే పట్టుకునేవాడట… అవసరమైతే ఫైల్ తెచ్చిన ఐఏఎస్ అధికారిపైకి కూడా కోపంతో విసిరేసిన సంఘటనలు ఉన్నాయనీ చెప్పుకుంటారు… పాలన అంటే అంత సులభం కాదు…
పైకి చిన్నచిన్నగా కనిపించినా… కొన్ని అడ్డంగా బుక్ చేస్తాయి… రాజకీయంగా, నైతికంగా, చట్టపరంగా..! అందుకే ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అండర్స్టాండింగ్ ది రియల్ ఇష్యూ, టైమ్లీ యాక్షన్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే నాయకుడికి అత్యవసరం… అఫ్కోర్స్, సీఎం దగ్గరున్న టీమ్ జాగ్రత్తగా చూసుకోవాలి… కంట్రాక్టర్ లక్ష్మిరాజం పత్రిక విజయక్రాంతిలో అనుకోకుండా ఓ వార్త కనిపించింది… రేవంత్ రెడ్డి ఓ ఫైల్ మర్మమేమిటో వెంటనే కనిపెట్టేసి, నిక్కచ్చిగా తిప్పికొట్టాడనేది అంశం…
Ads
లక్షల కోట్ల బడ్జెట్లో 90 కోట్ల వ్యవహారం పెద్దగా అనిపించకపోవచ్చుగాక… కానీ చిన్న చిన్న అంశాలకూ జాగ్రత్తగా లేకపోతే బోల్తాకొట్టేస్తామనడానికి ఓ ఉదాహరణ అనిపించింది… విషయం ఏమిటంటే..?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మైనారిటీ, కస్తూర్బా, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, ఆదర్శ పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు.. ఇలా మొత్తం సుమారు 10 రకాల గురుకులాలు, పాఠశాలల్లో చదువుకుంటున్న 9.24 లక్షల మంది విద్యార్థులకు 2026- 27 విద్యా సంవత్సరంలో ట్రాలీ బ్యాగ్లు, యూనిఫాం, బెల్ట్, టై, దుప్పట్లు, సాక్స్, బ్యాగ్, రగ్గులు, మ్యాట్, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, ట్రాక్ సూట్ లాంటి 22 రకాల వస్తువులను ఇవ్వాలని ప్రభుత్వ సంకల్పించింది. ఇందులో నోట్బుక్స్ కూడా ఉన్నాయి. ఏ జిల్లాకు ఆ జిల్లాగా గతంలో ఆయా వస్తువులకు టెండర్లు పిలిచి సరఫరా చేసేవారు…
కానీ ఈసారి కఠిన నిబంధనల పేరిట… ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేటు కంపెనీలకే ఈ టెండర్లు దక్కేలా ఫైల్ తయారైంది… Corporate Cronyism… మొత్తం 150 కోట్లకు టెండర్లు… వీటిలో ఒక్కో నోట్బుక్కు 87 రూపాయలట… ఎందుకయ్యా అంటే… వాటికీ వాటర్ మార్క్ మస్ట్ అని నిబంధన పెట్టారట… దాంతో 60 కోట్లలో ముగియాల్సిన టెండర్ విలువ ఏకంగా 150 కోట్లకు పెరిగింది…
ఇవేమైనా స్టాంపు కాగితాలా..? కరెన్సీ నోట్లా..? బాండ్ పేపర్లా..? పిల్లలు రాసుకునే నోటబుక్స్కు వాటర్ మార్క్ దేనికి..? అదే మాయ..! పైగా స్థానికంగా ఉండే ఎంఎస్ఎంఈలకు ఉపాధి దొరకకుండా, వాళ్ల ఆదాయానికి గండికొట్టే ఉద్దేశం ఇది… ఏ జిల్లాకు ఆ జిల్లాకు టెండర్లు పిలిస్తే.. ధరల్లో, నాణ్యతలో అనేక తేడాలు ఉన్నట్టుగా ప్రభుత్వం గ్రహించిందనీ,.. రాష్ట్ర స్థాయి కామన్ ప్రొక్యూర్మెంట్ విధానంలో వీటిని కొనుగోలు చేసేందుకు వీలుగా, ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటు చేసి టెండర్లు పిలిచామనీ అధికారులు చెప్పారట…
కానీ ఈ వాటర్ మార్క్ సాంకేతికత దేశంలో కొన్ని కార్పొరేట్ కంపెనీలకే ఉంది… ఈ సాంకేతికత దేశంలో కేవలం నాలుగైదు పెద్ద కార్పొరేట్ కంపెనీల దగ్గరే ఉంటుంది కాబట్టి, టెండర్ ఆటోమేటిక్గా వాళ్లకే దక్కుతుంది… ఇది పక్కా “స్పెసిఫికేషన్ మానిప్యులేషన్” (Specification Manipulation)…
రేవంత్ రెడ్డికి విషయం అర్థమై, ఠాట్ అక్కర్లేదు అన్నాడు… దాంతో టెండర్ల పద్ధతి మారింది, ఆ వాటర్ మార్క్ నిబంధన ఆరిపోయింది… దాంతో మొత్తం టెండర్ విలువ 150 కోట్ల నుంచి 60 కోట్లకు దిగివచ్చింది… ఇక్కడ ఎంత మిగిలిందనేది ముఖ్యం కాదు… తక్కువ ఖర్చుతో, మన చిన్న కంపెనీలు, కంట్రాక్టర్లకు కాస్త ఆదాయం వచ్చే పనినీ కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు పిచ్చి నిబంధనలతో అప్పగించే ప్రయత్నం జరిగిందనేది ప్రధానం… ఎస్, సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి ఫైళ్ల పట్ల జాగరూకతతో ఉండాలనేది ఈ కథనం చెప్పే పాఠం..!! (చిన్న పత్రికల్లోనే మంచి వార్తలొస్తున్నాయి… ఈ కథన బాధ్యులకు అభినందనలు)…
Share this Article