.
ఆలియా భట్ కపిల్ శర్మ షోకి వెళ్లింది… అతిథులందరికీ కాఫీ ఇచ్చారు, ఆలియా మాత్రం బ్లాక్ టీ అడిగింది… స్టాఫ్ ఆమెకు టీ తీసుకొచ్చారు, ఇందులో సుగర్ కలిపారా అనడిగింది, చిటికెడు కలిపాం అని చెప్పారు… నో, సుగర్ మంచిది కాదు, పండ్ల ద్వారా మాత్రమే సుగర్ తీసుకోవాలి అని ఆ టీని ఆమె రిజెక్ట్ చేసింది…
కానీ ఆలియా భాట్ ‘సన్ఫీస్ట్ డార్క్ ఫాంటసీ కాఫీ ఫిల్స్ కుకీస్’కు ప్రమోషన్ యాడ్స్ చేస్తుంటుంది… అందులో 100 గ్రాములకు 35 శాతానికి పైగా సుగర్ ఉంటుంది… అంటే నీకు సుగర్ అనారోగ్యకరం, కానీ ప్రజలకు మాత్రం ఈ సుగర్ ఫుల్ కుకీస్ తినండి అని ప్రమోట్ చేస్తావా..? వాటికి బ్రాండ్ అంబాసిడర్వా..? ఇదీ ఆమె మీద సోషల్ మీడియాలో రీసెంట్ పోస్టులు…
Ads
నిజమే… వివరాల్లోకి వెళ్దాం… సెలబ్రిటీల ప్రకటనల గురించి అప్పుడప్పుడూ వివాదాలు వస్తుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో వివాదం కేవలం ప్రకటన గురించే కాదు. ఆ సెలబ్రిటీ చెప్పే మాటలకు, చేసే పనులకు మధ్య ఉన్న వైరుధ్యం గురించీ అవుతుంది. ప్రస్తుతం ఆలియా భట్ చుట్టూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కూడా అలాంటిదే.
తన కూతురు రాహా ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటానని, చిన్న వయసులోనే జంక్ ఫుడ్కు అలవాటు చేయడం తనకు ఇష్టం ఉండదని ఆలియా చెప్పింది. ఒక తల్లిగా ఆమె ఆలోచనను ఎవరూ తప్పుపట్టలేరు. నిజానికి చాలామంది తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచిస్తారు.
కానీ ఇక్కడే సోషల్ మీడియాలో ఒక ప్రశ్న మొదలైంది. పండ్లలోని సహజ చక్కెర తప్ప అదనపు సుగర్ వద్దని చెప్పే ఆలియా భట్… అదే సమయంలో సన్ఫీస్ట్ డార్క్ ఫాంటసీ చాకో ఫిల్స్ వంటి కుకీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం ఎలా సమర్థించుకోవాలి?
పోషకాహార వివరాలను పరిశీలిస్తే, ఈ కుకీల్లో 100 గ్రాములకు సుమారు 35 నుంచి 38 గ్రాముల వరకు చక్కెర ఉంటుంది. అంటే ఉత్పత్తి బరువులో మూడో వంతుకు పైగా సుగర్ ఉన్నట్టే. అందుకే సోషల్ మీడియాలో కొందరు వ్యంగ్యంగా “తనకు మాత్రం పండ్లలోని సుగర్… అభిమానులకు మాత్రం కుకీల్లోని సుగర్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక్కడ ఎవరూ ఆలియా భట్ చట్టవిరుద్ధంగా ఏదైనా చేసిందని చెప్పడం లేదు. ఆమె ప్రచారం చేస్తున్న ఉత్పత్తి కూడా చట్టబద్ధంగానే మార్కెట్లో అమ్ముడవుతోంది. అసలు చర్చ మొత్తం నైతికత చుట్టూనే తిరుగుతోంది. తాను వ్యక్తిగతంగా దూరంగా ఉంచే ఆహారాన్ని, తాను పాటించని అలవాటును, కోట్లాది మంది అభిమానులకు ఆకర్షణీయంగా చూపించడం సరైందేనా?
ఈ ప్రశ్న కొత్తది కాదు… గతంలో పలువురు సినీ తారలు గుట్కా, పాన్ మసాలా, మద్యం సరోగేట్ ప్రకటనల్లో కనిపించారు. కనిపిస్తున్నారు. చట్టపరంగా వాటిలో పెద్ద సమస్య లేకపోయినా, సమాజంపై వాటి ప్రభావం గురించి తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాంటి సందర్భంలో అమితాబ్ బచ్చన్ ఒక పాన్ మసాలా ప్రకటన నుంచి తప్పుకోవడమే కాకుండా, తీసుకున్న పారితోషికాన్ని కూడా వెనక్కి ఇచ్చేశారు. ఆయన చేసినది చట్టపరమైన బాధ్యత కాదు. నైతిక బాధ్యత. అందుకే ఆ నిర్ణయాన్ని చాలామంది గౌరవించారు.
ఆలియా భట్ విషయంలోనూ అసలు ప్రశ్న అదే. సెలబ్రిటీలు ప్రకటనలకు కోట్ల రూపాయలు తీసుకోవచ్చు. అది వారి హక్కే. కానీ ఆ డబ్బు రావడానికి కారణం వారి ప్రభావం. ప్రజలు వారిని నమ్ముతారు. ముఖ్యంగా యువత, పిల్లలు వారిని అనుకరిస్తారు. అందుకే వాణిజ్య ప్రకటన అనేది కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు, సామాజిక బాధ్యత కూడా…
Share this Article