.
12 వేల కోట్ల ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వే (Delhi–Dehradun Expressway) పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకుండా ఆగిపోయింది. కారణం… లోనీ (Loni) ప్రాంతంలోని మండోలా (Mandola) గ్రామంలో ఉన్న ఒకే ఒక్క ఇల్లు… సుమారు 1,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు ఎక్స్ప్రెస్ వే మెయిన్ క్యారేజ్వే, ఎగ్జిట్ రాంప్కు సరిగ్గా మధ్యలో ఉంది…
ఈ రాంప్ ద్వారానే ఎక్స్ప్రెస్ వేను ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వే (EPE) తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇది లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చే వాహనాలు సాఫీగా మారడానికి వీలుండదు. సదరు ఆస్తి యజమాని పరిహారం విషయంలో కోర్టును ఆశ్రయించడం వల్ల ఈ వివాదం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. జాతీయ రహదారుల సంస్థ (NHAI) అధికారులు పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం దక్కలేదు…
ఈ 12,000 కోట్ల ప్రాజెక్టు దాదాపు 95% పూర్తయినప్పటికీ, ఈ చిన్న ముక్క మిగిలిపోవడం వల్ల కలిగే నష్టాలు ఇవే:
Ads
-
ట్రాఫిక్ మళ్లింపు…: అనుసంధానం లేకపోవడం వల్ల వాహనాలు పాత లోనీ రోడ్డు గుండా వెళ్లాల్సి వస్తోంది, దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతోంది.
-
ఆర్థిక భారం…: ప్రాజెక్టు ఆలస్యం అవుతున్న కొద్దీ మెయింటెనెన్స్, నిర్మాణ ఖర్చులు పెరుగుతున్నాయి.
-
ప్రయాణికుల ఇబ్బందులు…: ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కు 2.5 గంటల్లో చేరుకోవాలన్న లక్ష్యం ఈ అడ్డంకి వల్ల వాయిదా పడుతూ వస్తోంది…
‘స్వాభిమాన్’ ఇల్లు – ఒక ఆత్మాభిమాన పోరాటం: ఈ ఇంటి యజమాని, స్థానిక రైతులు దీనిని కేవలం ఒక భవనంగా చూడటం లేదు. వారు దీనిని “స్వాభిమాన్ భవన్” అని పిలుస్తున్నారు. భూసేకరణలో తమకు జరిగిన అన్యాయానికి, తక్కువ పరిహారానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి ఇది ఒక చిహ్నంగా మారింది.
రైతుల డిమాండ్- నిరసన: మండోలా విలేజ్ చుట్టుపక్కల రైతులు గత కొన్నేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. తమ భూములకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం చాలా తక్కువగా ఉందని, మార్కెట్ ధర ప్రకారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ ఒక్క ఇంటిని కూల్చడానికి అధికారులు ప్రయత్నించినప్పుడల్లా, వందలాది మంది రైతులు అక్కడికి చేరుకుని అడ్డుకుంటున్నారు. దీనివల్ల ఇది ఒక శాంతిభద్రతల సమస్యగా (Law & Order issue) మారింది.
ఇంజనీరింగ్ పరంగా ఎదురవుతున్న సవాళ్లు: ఎగ్జిట్ రాంప్ డిజైన్…: ఎక్స్ప్రెస్వే నుండి ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వే (EPE) కు మారే రాంప్ సరిగ్గా ఈ ఇంటి మీదుగానే వెళ్లాలి. ఈ ఇల్లు ఉన్న చోట పిల్లర్లు వేయడం లేదా మట్టిని నింపడం సాధ్యపడటం లేదు. ఈ లింక్ లేకపోవడం వల్ల అక్షరధామ్ (ఢిల్లీ) నుండి వచ్చే ప్రయాణికులు నేరుగా డెహ్రాడూన్ వైపు వెళ్లడానికి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
NHAI అధికారులు, జిల్లా యంత్రాంగం యజమానితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ప్రత్యామ్నాయంగా ఎక్కువ డబ్బు లేదా వేరే చోట భూమి ఇస్తామన్నా రైతులు లొంగడం లేదు. వారి ప్రధాన డిమాండ్ ఏంటంటే.. కేవలం ఆ ఒక్క ఇంటికే కాకుండా, ఆ ప్రాంతంలోని బాధితులందరికీ పెంచిన రేట్ల ప్రకారం పరిహారం ఇవ్వాలి.
ఒక పక్క ₹12,000 కోట్ల భారీ ఆధునిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మరోపక్క రైతుల ఆత్మాభిమాన పోరాటం (Swabhiman). ఈ రెండింటి మధ్య నలుగుతున్న ఈ వివాదం పరిష్కారమైతే తప్ప, ఢిల్లీ-డెహ్రాడూన్ ప్రయాణం పూర్తిస్థాయిలో సుఖమయం కాదు… ఇది కేవలం భూమి సమస్య మాత్రమే కాదు, ప్రభుత్వానికి, సామాన్యుడికి మధ్య జరుగుతున్న సుదీర్ఘ న్యాయపోరాటం…
Share this Article