.
Subramanyam Dogiparthi …. శోభన్ బాబు సెకండ్ ఇన్నింగ్సులో అంటే తండ్రి పాత్రలు వేయటం ప్రారంభించాక వచ్చిన మల్టీ స్టారర్ సినిమాలలో ఒకటి ఈ బలరామ కృష్ణులు . 1992 నవంబరులో వచ్చిన ఈ సినిమా చేరన్ పాండియన్ అనే తమిళ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో విజయకుమార్ , శరత్ కుమార్ , శ్రీజ , మంజుల , నాగేష్ తదితరులు నటించారు .
తమిళంలో సూపర్ హిట్టయింది . తెలుగులో బాగా ఆడినా ఆ తమిళ లెవెల్లో హిట్ కాలేదు . 14 సెంటర్లలో 50 రోజులు ఆడిన ఈ సినిమా షిఫ్టులతో కొన్ని సెంటర్లలో వంద రోజుల పోస్టర్ పడింది . టూకీగా కధ ఏంటంటే :
బలరామయ్య (శోభన్ బాబు) కుల పట్టింపులు ఉన్న ఓ బూర్జువా . కృష్ణమూర్తి (రాజశేఖర్) , బలరామయ్యలకు తండ్రి ఒకరే అయినా తల్లులు వేరు . రాజశేఖర్ తల్లి తక్కువ జాతి స్త్రీ అని శోభన్ బాబు దూరం పెడతాడు . శోభన్ బాబుకు ఓ కూతురు (రాజీవి) . రాజశేఖరుకు ఓ చెల్లెలు (కల్పన) .
Ads
మారు తమ్ముడు ఇంటి మీద వాలిన కాకిని కూడా తన ఇంటి మీద వాలనివ్వడు శోభన్ బాబు . దీన్ని ఆసరాగా తీసుకుని ఓ ఆషాఢభూతి (గొల్లపూడి మారుతీరావు) ఇద్దరి మధ్య అగ్నికి ఆజ్యం పోస్తూ ఉంటాడు . తన కొడుకు (తనికెళ్ల భరణి) శోభన్ బాబుకు అల్లుడిని చేసి అతని ఆస్తిని కొట్టేయాలని శకుని ప్లాన్ .
ఈలోపు రాజశేఖర్ బంధువు జగపతిబాబు రావటం , అతను శోభన్ బాబు కుమార్తె ప్రేమలో పడటం , ఆ ప్రేమను అంగీకరించకపోవటం , ఆ అమ్మాయి రాజశేఖర్ ఇంటికి చేరటం జరిగిపోతాయి . గొల్లపూడి మారుతీరావు సారా కాంట్రాక్టర్ (రామిరెడ్డి) సహాయంతో శోభన్ బాబు కూతురిని కిడ్నాప్ చేసి భరణికి ఇచ్చి బలవంతపు పెళ్లి చేయ ప్రయత్నిస్తాడు .
క్లైమాక్సులో అన్నదమ్ములు ఒకటయి విలన్లను అందరినీ మట్టుబెట్టటం , జగపతిబాబు , రాజీవిల పెళ్ళి , రాజశేఖర్ , రమ్యకృష్ణల పెళ్ళిళ్ళతో సినిమా శుభాంతం అవుతుంది . సోగ్గాడు , ఇద్దరు భామల ముద్దుల మొగుడు వంటి పాత్రలను వేసే శోభన్ బాబు ఈ బూర్జువా లాంటి పాత్రను చాలా subtle గా , బాగా నటించారు .
రాజశేఖర్ కూడా శోభన్ బాబుకు ధీటుగా నటించారు . శోభన్ బాబు భార్యగా శ్రీవిద్య అద్భుతంగా నటించింది . ముఖ్యంగా క్లైమాక్సులో కులంకన్నా మానవత్వం ముఖ్యమని ఎదిరించి మరిది ఇంటికి వెళ్ళే సీన్లో గొప్పగా నటించింది . ఇతర ప్రధాన పాత్రల్లో రమ్యకృష్ణ , కల్పన , జగపతిబాబు , గొల్లపూడి , రామిరెడ్డి , భరణి , బ్రహ్మానందం , బాబూమోహన్ , డిస్కో శాంతి , రాజీవి తదితరులు నటించారు .
నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే 1990 లలో కూడా తమిళ , తెలుగు సినిమాలలో గ్రామ పెద్దల పంచాయతీలు , కొరడా దెబ్బలు , వగైరా ఉండటం .
రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో వేటూరి , సిరివెన్నెల , నందిగం గని పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , చిత్ర , మాల్గాడి శుభ పాడారు . నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి , అమ్మమ్మో ఎన్నున్నాయో , ఇదేం మొగుడురో , పగ పగ అంటూ సాగుతాయి పాటలు . డిస్కో శాంతిపై మస్తుగున్నది జబర్దస్తుగున్నది అనే మాల్గాడి శుభ పాట మత్తుగా ఉంటుంది .
తణుకు చుట్టుపక్కల అలంపురం , రేలంగి , ఉండ్రాజవరం ప్రాంతాలలో ఔట్ డోర్ షూటింగ్ జరుపుకుంది . స్రవంతి మూవీస్ బేనరుపై నిర్మించబడిన ఈ సినిమాకు దర్శకుడు రవిరాజా పినిశెట్టి . బాగానే తీసారు . తరచూ ఏదో ఒక టివి చానల్లో వస్తూ ఉంటుంది . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనట్లయితే వాచ్ లిస్టులో వేసుకోవచ్చు .
Share this Article