.
ఇదుగో, ఇందుకే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అస్సలు కొరుకుడు పడటం లేదు… ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, వందల కోట్ల ఖర్చుతో నెగెటివ్ క్యాంపెయిన్ నడిపిస్తున్నా సరే, రేవంత్ రెడ్డి అలా అలవోకగా కౌంటర్ చేస్తున్నాడు… బీఆర్ఎస్ను, సోకాల్డ్ పెద్ద తలలు కేటీయార్, హరీష్ రావులను ఇరుకునపెట్టేస్తున్నాడు… తాజా ఉదాహరణ… రైతు డిస్కమ్, రైతులకు ఉచిత విద్యుత్తు…
తెలంగాణ రాజకీయాల్లో రైతులకు ఉచిత విద్యుత్ అంశం మరోసారి ప్రధాన చర్చగా మారింది… అయితే ఈసారి చర్చ కేవలం “24 గంటల కరెంట్ వస్తోందా లేదా?” అన్నదానిపై కాదు… “మీటర్లు పెడతారా? ఉచిత విద్యుత్ ఆపేస్తారా?” అనే రాజకీయ ఆరోపణల చుట్టూ తిరుగుతోంది… ఈ వివాదంలో ముఖ్యమంత్రి Revanth Reddy విసిరిన ఒక సవాల్ ఇప్పుడు బీఆర్ఎస్ను ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టింది… అందుకే నో ఆన్సర్…
Ads
గత కొన్ని వారాలుగా K. Chandrashekar Rao నాయకత్వంలో K. T. Rama Rao, T. Harish Rao తదితరులు రైతు డిస్కం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోతోందని, ఆ తర్వాత ఉచిత విద్యుత్ పథకానికి ముప్పు వాటిల్లుతుందని ఆరోపిస్తున్నారు… ఈ ప్రచారాన్ని గ్రామీణ ప్రాంతాల్లో బలంగా తీసుకెళ్లే విఫల ప్రయత్నం చేస్తున్నారు….
కానీ రేవంత్ రెడ్డి ఈ ఆరోపణలకు సాధారణ రాజకీయ ఖండనతో సమాధానం ఇవ్వలేదు…. ఆయన నేరుగా రాజకీయ పందెం వేశారు….
“మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేయదు” అని ప్రకటించారు… ఇది అన్ని రకాల అబద్ధపు ప్రచారానికీ, తప్పుడు బాష్యాలకూ స్ట్రెయిట్ కౌంటర్, అంతేకాదు, రైతులకు కూడా ఓ భరోసా… అబద్ధాల ప్రచారాన్ని పటాపంచలు చేయడం… “మేము మీటర్లు పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ కొనసాగించినా బీఆర్ఎస్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటుందా?” అని ఎదురు ప్రశ్నించాడు… ఈ ఒక్క ప్రశ్నతో రాజకీయ చర్చ దిశే మారిపోయింది.
ఆరోపణల నుంచి సాక్ష్యాల దశకు…
ఇప్పటివరకు బీఆర్ఎస్ పాత్ర ఆరోపణలు చేయడమే…. కానీ రేవంత్ సవాల్ తర్వాత పరిస్థితి మారింది… ఇప్పుడు రైతు డిస్కం వల్ల నిజంగానే ఉచిత విద్యుత్ ప్రమాదంలో పడుతుందని నిరూపించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ మీద పడింది…
రాజకీయంగా చూస్తే ఇది కాంగ్రెస్ వేసిన వ్యూహాత్మక ఎత్తుగడ… ఎందుకంటే బీఆర్ఎస్ ప్రచారం మొత్తం రైతుల్లో అనుమానం కలిగించడంపై ఆధారపడి ఉంది… కానీ ముఖ్యమంత్రి బహిరంగంగా “మీటర్లు ఉండవు, ఉచిత విద్యుత్ ఆగదు” అని ప్రకటించడంతో ఆ అనుమానాల తీవ్రత తగ్గి, బీఆర్ఎస్ అవకాశవాద రాజకీయాలు ఆ పార్టీకే కౌంటర్ ప్రొడక్ట్ కాబోతోంది…
రైతు డిస్కం అంటే అసలు ఏమిటి?
ప్రభుత్వం చెబుతున్న ప్రకారం…. రైతు డిస్కం లక్ష్యం ఉచిత విద్యుత్ను రద్దు చేయడం కాదు…. వ్యవసాయ విద్యుత్ పంపిణీని ప్రత్యేక వ్యవస్థ కిందకు తీసుకువచ్చి మరింత పారదర్శకంగా నిర్వహించడం….
ప్రస్తుతం రైతులకు ఇచ్చే విద్యుత్కు ప్రభుత్వం భారీ సబ్సిడీ చెల్లిస్తోంది… ఆ వ్యవస్థను ప్రత్యేకంగా లెక్కలు చూపే నిర్మాణంలోకి తీసుకురావడం ద్వారా ఆర్థిక క్రమబద్ధీకరణ సాధ్యమవుతుందని ప్రభుత్వం చెబుతోంది… దీనిని రేవంత్ రెడ్డి దేశంలోనే కొత్త ప్రయోగంగా ప్రచారం చేస్తున్నాడు…
అయితే ప్రభుత్వ వివరణల కంటే రాజకీయ ప్రచారం ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ బాగా తెలుసు. అందుకే “డిస్కం అంటే తర్వాత మీటర్లే” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది…
తెలంగాణలో ఉచిత విద్యుత్ అనేది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు… అది రైతు రాజకీయాల్లో ఒక భావోద్వేగ అంశం… చంద్రబాబు గుప్పిట నుంచి ఉమ్మడి ఏపీని అప్పట్లో విడిపించి, వైఎస్కు పట్టం గట్టిన అంశం ఉచిత విద్యుత్తు… అందుకే దీనికి అంత రాజకీయ ప్రాధాన్యత… ఏ ముఖ్యమంత్రీ దాన్ని రద్దు చేయలేడు… పొలిటికల్ కంపల్షన్…
అందుకే “మీటర్లు” అనే పదం వినిపించినప్పుడల్లా రైతుల్లో సందేహాలు తలెత్తడం సహజం… ఈ విషయాన్ని బీఆర్ఎస్ రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోంది… ఓ విఫల ప్రయత్నం…
రేవంత్ రిస్క్ తీసుకున్నాడా? అవును. రాజకీయంగా చూస్తే ఇది చిన్న రిస్క్ కాదు… ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు తన వ్యక్తిగత విశ్వసనీయతను కూడా ఈ అంశంతో ముడిపెట్టాడు… భవిష్యత్తులో రైతు డిస్కం అమలు విధానంలో ఏదైనా వివాదం తలెత్తినా, మీటర్ల అంశం మళ్లీ తెరపైకి వచ్చినా ప్రతిపక్షం ఈ వ్యాఖ్యలనే ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది…
కానీ అదే సమయంలో ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఇంతకంటే బలమైన రాజకీయ సమాధానం కాంగ్రెస్ వద్ద లేకపోవచ్చు… అందుకే తనే స్వయంగా కౌంటర్ ఇచ్చాడు… ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది… రైతు విద్యుత్ అంశాన్ని పూర్తిగా తమ అజెండాగా మార్చుకోవాలనుకున్న బీఆర్ఎస్కు, అదే అంశంపై రేవంత్ రెడ్డి ఊహించని బలమైన కౌంటర్ ఇచ్చాడు..!! దీన్ని బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేయలేదు..!!
Share this Article