.
కొత్తగా తమ రక్షణ కోసం, తమ రాజకీయ స్వార్థాల కోసం బీజేపీలోకి వచ్చిన ‘సంఘే’తరులను కాదు… మొదటి నుంచీ ఆటుపోట్లకు ఎదురొడ్డి పార్టీలోనే కొనసాగిన సంఘ్ విధేయ నేతలకే బీజేపీ ప్రాధాన్యం ఇచ్చిందీ అనే విశ్లేషణలు కనిపిస్తున్నాయి రాష్ట్ర అధ్యక్ష ఎంపికల తరువాత…
ఏమో… అది మాత్రమే ప్రధాన అర్హత కాకపోవచ్చు… ఏపీ మాధవ్ గానీ, తెలంగాణ రాంచందర్రావు గానీ… 2000 నోటులాంటి నేతలు… టెంపరరీ అడ్జస్ట్మెంట్లు మాత్రమేనేమో… మరి దీనివల్ల పార్టీకి వచ్చే ప్రయోజనం మాటేమిటి అంటారా..? కాబోయే సీఎంలు ఎవరూ అంటారా..? అసలు ఆ కోణమే ప్రస్తుత పార్టీ అధ్యక్షుల ఎంపికలో లేదు…
Ads
మీరే కాబోయే సీఎంలు అని చెప్పడం బీజేపీలో ఉండదు… మరీ అస్సోం హిమంత విశ్వ శర్మ వంటి సంఘేతరుల పట్ల రేర్ కేసుల్లో తప్ప..! ఎవరూ మేమే కాబోయే ముఖ్యమంత్రులం అనే ఆశల్లో విహరించడానికీ ఎవరికీ అస్సలు ఆస్కారం ఇవ్వదు… అది ఒక పీడీఎస్యూ ఈటల రాజేందర్ కావచ్చు, ఒక కాంగ్రెసీయురాలు డీకే అరుణ కావచ్చు… ఇంకెవరైనా కావచ్చు…
అదే సమయంలో సంఘ్ గీతల్ని దాటి, ఇష్టారాజ్యంగా వ్యవహరించే రాజాసింగ్లూ కావచ్చు… అయితే మరి తెలంగాణలో, ఏపీలో సంఘ్ అర్హతే ప్రధానమైందేమిటి అనేది కీలక ప్రశ్నే… ఒక మాధవ్, ఒక రామచందర్రావు వర్తమాన తెలుగు రాజకీయాల్లో బీజేపీ ఆశయాలు, సంకల్పాలకు ఫిట్ అవుతారా..? క్రౌడ్ పుల్లర్లు కూడా కాదు, లీడ్ చేయగలరా..? జస్ట్, సంఘ్ సంతానం అనేది వోకేనా… కానీ రాజకీయ అవసరాలు..?
ఇప్పటికిప్పుడు ఏపీలో బీజేపీకి మన తదుపరి సీఎం ఎవరు అనే ఆలోచించే చాన్స్ లేదు… మెల్లిగా పవన్ కల్యాణ్నే పార్టీలోకి లాగేసే ఆలోచనలో ఉంది… ఇంకెవరినీ సమర్థ నేతల్ని తనకు ఈ దిశలో, ఈ దశలో పోటీగా నిలపదు… పైగా ఏపీ బీజేపీలో ధాటిగా కాషాయపు బండిని నడిపే సారథులూ లేరు… మరి రామచందర్ రావు..? తనూ అంతే…
రేపు ఇద్దరు సంఘేతరులకు… ఇతర పార్టీ నేతలకు తలుపులు తెరిచి, మీకోసం సీఎం కుర్చీ ఖాళీగానే ఉంటుంది సుమా అని చెబుతున్నదా..? ఆ ఇద్దరూ ఎవరు..? ఆ షిండేలు ఎవరు..? కాంగ్రెస్లో పొగ తట్టుకోలేక రేవంత్ రెడ్డి బయటికి వస్తాడనే ఆశా..? కేటీయార్ పెత్తనాలు భరించలేక హరీష్ రావే వస్తాడనే ఆశా..?
ఒక స్పేస్ క్రియేట్ చేసి ఉంచింది బీజేపీ… ఇవి సరే, అసలు ఎవరు ఈ రామచంద్రరావు..? నిబద్ధత కలిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త తను… రాడికల్స్ ను ఎదురొడ్డి, ఆ దాడులకు గురై, ఉస్మానియాలో ఏబీవీపి జెండాను ఎగరేసిన నేత… బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం చేసిన న్యాయవాది… కాస్త తెలుగుదేశం చంద్రబాబు పట్ల సానుకూలత ఉన్న అనుకూలుడు అనే పేరుంది…
అందుకే చంద్రబాబే చక్రం తిప్పి అక్కడ మాధవ్ను, ఇక్కడ రామచంద్రరావును తనే సెలక్ట్ చేశాడనే ప్రచారం కూడా సాగుతోంది… ఏమో లోగుట్టు అమిత్ షాకు ఎరుక… ఐనా, ఇప్పుడు చంద్రబాబు చెప్పిన మాటకే కదా రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అంశాల్లో చెల్లుబాటు… ఈ ప్రచారం నిజమేనా అనడిగితే… పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చింది, అంతే, అంతకుమించి పెద్ద ప్రాధాన్యం ఏమీ లేదు ఈ ఎంపికల్లో అన్నాడు ఓ సీనియర్ నేత…
Share this Article