.
ఎ.సాయిశేఖర్… ఇప్పుడివి జంట నగరాలు కాదు… హైదరాబాద్ విస్తరించీ విస్తరించీ ఇప్పుడు నాలుగు నగరాలుగా రూపాంతరం చెందింది…
అనేక దశల్లో విస్తరణను అనుభవించిన ఈ నగరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా కొత్త స్వరూపాన్ని సంతరించుకుంటోంది… ఓసారి ఈ చతుర్నగరి (క్వాడ్ సిటీ) ప్రస్థాన చరిత్రను చెప్పుకోవాలి…
Ads
నాలుగో నగరమైన “భారత్ ఫ్యూచర్ సిటీ” ఇంకా రూపుదిద్దుకుంటుండగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ను మూడు భాగాలుగా విభజిస్తూ, ప్రస్తుతానికి కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి…
ఇప్పుడు మూడు నగరాలు — GHMC, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్… వీటికి అనుగుణంగా మొదటిసారిగా నాలుగు ప్రత్యేక పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేయబడ్డాయి… మరో ప్రధాన నగరవిభాగం కంటోన్మెంట్ విలీనం మాత్రం ఇంకా ఎదురుచూపుల్లోనే ఉంది…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అనే భారీ పట్టణ స్థానిక సంస్థ ఇప్పటికీ రక్షణ శాఖ ఆధీనంలోనే కొనసాగుతోంది… భారత ప్రభుత్వ డిఫెన్స్ ఎస్టేట్స్ నియంత్రణ నుంచి దీనిని వేరు చేసి, పక్కనున్నహైదరాబాద్ నగర స్థానిక సంస్థల్లో విలీనం చేయాలనే డిమాండ్ విస్తృతంగా వినిపిస్తోంది…

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు “హైదరాబాదీలు” కాదా..? అబిడ్స్, కోటి, బంజారాహిల్స్లో నివసించే వారిలానే వారూ హైదరాబాదీలే… కానీ ఈ విలీన ప్రక్రియ ఇంకా తుది దశకు రాలేదు, కేంద్ర ప్రభుత్వం ఈ దిశలో కొన్ని ముందడుగులు మాత్రం వేసింది…
ప్రస్తుతం కంటోన్మెంట్ ప్రాంతం భౌగోళిక విభజన ఆధారంగా ఏకంగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోకి వస్తోంది…
సరే, నాలుగు నగరాల నిర్మాణం ఆశాజనకంగా కనిపిస్తున్నా…, పరిశుభ్రత, పారిశుధ్యం, వీధిదీపాలు, కుక్కల బెడద, దోమలు, ఘన వ్యర్థాల నిర్వహణ, ట్రాఫిక్ సమస్యలు వంటి ప్రాథమిక పట్టణ సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారాన్ని ఆశిస్తున్నాయి… కొత్త స్థానిక సంస్థలు ప్రజలకు ఏమి అందిస్తాయో రాబోయే సంవత్సరాల్లో కీలకం కానుంది…

దశాబ్దాలుగా హైదరాబాద్ ఎలా మారింది? హైదరాబాద్ — తెలంగాణ రాజధాని — భారతదేశంలో ఐదవ అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరం… ఈ నగర పరిధిలో అనేక మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడి, విలీనం అయి, మళ్లీ విడిపోయి, మళ్లీ విలీనం అయ్యాయి… ఈ పరిణామం 1985 నుంచే వేగం అందుకుంది…
1985లో ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు హయాంలో 12 పరిసర మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి… నలభై ఏళ్లుగా నగర రాజకీయ సరిహద్దులు మారుతూనే ఉన్నాయి… చాలామంది ప్రజలు తాము ఏ నగరానికి చెందుతారో, ఏ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉంటారో తెలియక గందరగోళానికి గురవుతున్నారు…
చరిత్రలో హైదరాబాద్– సికింద్రాబాద్ జంట నగరాలుగానే ప్రసిద్ధి చెందాయి… మిగతావన్నీ పరిపాలనా సౌలభ్యం కోసం సృష్టించబడిన రాజకీయ మున్సిపాలిటీలే…
HUDA తరువాత HMDAగా మారింది… ప్రజలు తాము హైదరాబాద్ వాళ్లమే అన్న భావనతో సాంత్వన పొందారు… ఇప్పుడు HMDAకి చెల్లెలిగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) కూడా వచ్చింది… పట్టణ పరిపాలన మరింత క్లిష్టమైందా…?
మార్పుల నుంచి సరళత వైపు …. పలు ప్రభుత్వాల రాజకీయ నిర్ణయాలు నగర ఆకారాన్ని తరచూ మార్చాయి… అయినప్పటికీ, హైదరాబాద్ ప్రజలు ఈ మార్పులను అంగీకరించి కొత్త పట్టణ సంస్థలను తమవిగా స్వీకరించారు… నగరం అన్ని దిశల్లో విస్తరించింది — కొంత అసంఘటితంగా అయినా…

మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (MCH) స్థాపన…: 1955, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ద్వారా 1955 అక్టోబర్ 2న హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీల విలీనం ద్వారా MCH ఏర్పాటైంది… ఇది జంట నగరాల తొలి ఏకీకృత సంస్థ…
విస్తీర్ణం..: మొదట సుమారు 217 చ.కి.మీ
1960లో పరిసర ప్రాంతాలు కలపడంతో 360 చ.కి.మీకి పెరిగింది.
1975లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (HUDA)ను ఏర్పాటు చేసింది… ఇది 1,348 నుంచి 1,864 చ.కి.మీ ప్రాంతాన్ని కవర్ చేసింది… మాస్టర్ ప్లాన్లు, జోనింగ్, భూవినియోగ నియంత్రణ, లేఅవుట్ అనుమతులు ఇవన్నీ HUDA బాధ్యతలు…
1985లో 12 మున్సిపాలిటీలు – ఎన్టీఆర్ హయాంలో ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఆల్వాల్, మల్కాజ్గిరి, కాప్రా, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, పటాన్చెరు, గడ్డిఅన్నారం, రామచంద్రాపురం — ఇవి 1985లో ఏర్పడ్డాయి… 1991 ఆర్థిక సంస్కరణల తరువాత నగర అభివృద్ధి వేగం పెరిగింది.

చంద్రబాబు నాయుడు – హైటెక్ సిటీ, సైబరాబాద్ మైక్రోసాఫ్ట్ అమెరికా వెలుపల తొలి కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది… రహేజా మైండ్స్పేస్, సైబర్ టవర్స్తో హైటెక్ సిటీ ఏర్పడింది… సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటైంది…
వైఎస్సార్ – GHMC, అంతర్జాతీయ విమానాశ్రయం, ORR 2007లో 12 మున్సిపాలిటీలు, 8 గ్రామపంచాయతీలను విలీనంతో GHMC ఏర్పడింది… హైదరాబాద్ A-1 మెట్రో నగర హోదా పొందింది…
శంషాబాద్లో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, 167 కి.మీ ఔటర్ రింగ్ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి జరిగాయి… పి.వి.నరసింహారావు ఎక్స్ప్రెస్వే నిర్మించబడింది… 2008లో HMDA ఏర్పడింది. మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రారంభమైంది…

కేసీఆర్ – గ్లోబల్ సిటీ విజన్ 2014 తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది… దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, అనేక ఫ్లైఓవర్లు నిర్మించబడ్డాయి… అమెజాన్, గూగుల్, యాపిల్, ఉబర్ వంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి…
2016లో 7 మున్సిపాలిటీలు ఏర్పడి 2019లో కార్పొరేషన్లుగా మారాయి — బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్- జిల్లెల్గూడ, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్, నిజాంపేట్… రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఏర్పడింది… ORR పూర్తిగా ప్రారంభమైంది… మెట్రో రైలు రన్నింగులోకి వచ్చింది…

రేవంత్ రెడ్డి – CURE, 2047 విజన్, GHMC త్రివిభజన భారత్ ఫ్యూచర్ సిటీ, FCDA ఏర్పాటు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి ప్రణాళికలు రూపొందుతున్నాయి… రాచకొండ విలీనంతో మూడు ప్రధాన పోలీస్ కమిషనరేట్లు — హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ ఏర్పడ్డాయి…
ORR లోపల ప్రాంతాన్ని CURE (Core Urban Region Economy), ORR–RRR మధ్య PURE, దాని బయట RAREగా విభజించారు…. GHMC పాలకవర్గం గడువు ముగియడంతో మూడు కార్పొరేషన్లు ప్రత్యేక అధికారుల ఆధీనంలోకి వచ్చాయి… స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రత్యేక అధికారి…
హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు నిలయంగా మారింది… Eli Lily, Amgen, Vanguard, McDonald వంటి సంస్థలు చేరాయి… ఇదే హైదరాబాద్ నగర ప్రస్థానం — జంట నగరాల నుంచి నాలుగు నగరాల దాకా, మహానగర మహిమాన్విత దిశగా సాగుతున్న ఒక అద్భుత ప్రయాణగాథ… (newsmeter.in) వెబ్ సైట్ సౌజన్యంతో....
Share this Article