.
“ఇండస్ట్రీని పెంట పెంట చేసి పడేశారు”..! రవిబాబు చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉంది? సినిమా వాళ్ల గురించి సినిమా వాళ్లే విమర్శించడం చాలా అరుదు. అలాంటిది దర్శకుడు, నటుడు రవిబాబు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో నడుస్తున్న ప్రమోషన్ ట్రెండ్పై చేసిన వ్యాఖ్యలు మాత్రం కాస్త ఘాటుగానే ఉన్నాయి. తను స్ట్రెయిట్ ఫార్వర్డ్, చెప్పే పాయింట్లలో నిజం ఉంటుంది కూడా…
“టీజర్కు ప్రీ-టీజర్… ఆ ప్రీ-టీజర్కు గ్లింప్స్… దానికి అనౌన్స్మెంట్ డేట్… ఆ అనౌన్స్మెంట్కు మరో ప్రీ-అనౌన్స్మెంట్… ఇండస్ట్రీని పెంట పెంట చేసి పడేశారు” అంటూ రవిబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాటల్లో ఆవేశం కంటే ఆవేదనే ఎక్కువ కనిపిస్తుంది.
Ads
అవే కాదు, ప్రిరిలీజ్ ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, లిరికల్ సాంగ్ రిలీజులు… ప్రచారం సాగుతూనే ఉంటుంది… ఒకప్పుడు సినిమా ప్రమోషన్ అంటే పోస్టర్, రిలీజ్ డేట్, ట్రైలర్. అంతే. సినిమా బాగుంటే ప్రేక్షకుడు మరో పది మందికి చెప్పేవాడు. మౌత్ టాక్… అదే అసలు ప్రచారం. ఇప్పుడు మాత్రం సినిమా విడుదల కాకముందే దాని చుట్టూ వంద ఈవెంట్లు, వంద పోస్టర్లు, వంద వీడియోలు. సినిమా కంటే ప్రచారమే పెద్ద సినిమాగా మారిపోయింది.
రిలీజు రోజున పెయిడ్ రివ్యూలు, సక్సెస్ మీట్లు అదనం… నిజానికి మార్కెటింగ్ అవసరమే. ఈ రోజుల్లో సోషల్ మీడియా లేకుండా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం దాదాపు అసాధ్యం. కానీ మార్కెటింగ్కు, మార్కెటింగ్ ఓవర్డోస్కు చాలా తేడా ఉంది.
ప్రేక్షకుడు ఒక సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటాడు. కానీ రోజూ ఒక నోటిఫికేషన్, వారానికి రెండు పోస్టర్లు, కొత్త కొత్త పేర్లతో అప్డేట్లు వస్తుంటే… ఆసక్తి పెరగడం కంటే అలసట వస్తుంది. ఒక దశలో “సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది?” అనే ఆసక్తి కూడా తగ్గిపోతుంది.
దీనినే మార్కెటింగ్ భాషలో Hype Fatigue అంటారు. అంటే, అతిగా ప్రచారం చేయడం వల్ల ప్రేక్షకుడు విసిగిపోవడం. అది కౌంటర్ ప్రొడక్ట్ అవుతూ ఉంటుంది పెద్ద సినిమాలకు సంబంధించి…
దీనికి తాజా పెద్ద ఉదాహరణ… విజయ్ నటించిన “జననాయకన్” విడుదలకు ముందు ఎంత హడావుడి జరిగిందో అందరూ చూశారు. ప్రతి చిన్న అప్డేట్ను కూడా పెద్ద ఈవెంట్గా మార్చేశారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్తుండటంతో “చివరి సినిమా” అనే భావోద్వేగాన్ని కూడా ప్రచారంలో భాగం చేశారు.
కానీ విడుదల తర్వాత చర్చ ఏమైంది? సినిమా గురించి మాట్లాడిన దానికంటే… “ఇంత హైప్ చేసి చివరకు ఇదేనా?” అనే మాటే ఎక్కువ వినిపించింది. అంటే సమస్య సినిమా మాత్రమే కాదు, దాని చుట్టూ కట్టబడిన భ్రమాత్మక అంచనాలు కూడా.
ఇది “జననాయకన్”కే పరిమితమైన విషయం కాదు. గత కొన్నేళ్లుగా భారీ ప్రమోషన్ చేసిన చాలా సినిమాలు మొదటి రోజు ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. కానీ రెండో రోజు నుంచి ప్రేక్షకుడు కనిపించలేదు. ఎందుకంటే ప్రచారం టికెట్ అమ్మగలదు… కానీ కంటెంట్ మాత్రమే ప్రేక్షకుడిని నిలబెడుతుంది.
రవిబాబు మరో మాట కూడా చాలా ఆలోచింపజేస్తుంది. “జనాలకు పని పాటా లేదనుకుంటున్నారా?”
ఇది ప్రేక్షకుడి సమయానికి సంబంధించిన ప్రశ్న. ఇప్పుడు ప్రేక్షకుడి చేతిలో మొబైల్ ఉంది. ఓటీటీ ఉంది. యూట్యూబ్ ఉంది. వేలాది వినోద మార్గాలు ఉన్నాయి. అలాంటి సమయంలో ప్రతి రెండు రోజులకు ఒక “బిగ్ అప్డేట్” అంటూ అతని దృష్టిని లాగడం కంటే… ఒక మంచి ట్రైలర్తో, ఒక బలమైన కథతో ఆకట్టుకోవడమే తెలివైన మార్కెటింగ్.
చివరికి సినిమా పరిశ్రమ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.
హైప్తో ఓపెనింగ్ వస్తుంది… కంటెంట్తో కలెక్షన్లు వస్తాయి.
మిగతావన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాయి… కానీ థియేటర్లో సీట్లు మాత్రం మంచి సినిమా వచ్చినప్పుడే నిండుతాయి…
https://www.dishadaily.com/cinema/ravi-babu-made-shocking-comments-on-the-industry-547193
నిజానికి ఇది మే నెలలో రేజర్ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో చెప్పింది… తరువాత సదరు టీవీ చానెల్ ఎందుకో ఈ కంటెంట్ ఎడిట్ (డిలిట్) చేసినట్టుంది… ఎందుకో తెలియదు… కానీ తను వెల్లడించిన పాయింట్లు స్టిల్ వాల్యుబుల్… మళ్లీ సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు ఇప్పుడు…
Share this Article