.
భారత్పై ప్రతీకారం ఎక్కడ? ఫైనల్కి రాకముందే పాక్ కథ ముగిసింది! క్రికెట్లో మ్యాచ్ గెలవకముందే మాటల్లో గెలిచేయడం పాకిస్థాన్ క్రికెట్కు కొత్తేమీ కాదు. ఈసారి కూడా అదే జరిగింది. మహిళల టీ20 ఆసియా కప్లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన తర్వాత… “ఇది అయిపోలేదు”, “మళ్లీ కలుస్తాం”, “ఫైనల్లో ప్రతీకారం తీర్చుకుంటాం” అన్న తరహా మాటలు వినిపించాయి.
లెక్క కూడా బాగానే ఉంది. భారత్ అప్పటికే ఫైనల్లోకి వెళ్లింది. పాకిస్థాన్ సెమీఫైనల్ గెలిస్తే… ఫైనల్లో భారత్– పాకిస్థాన్. అక్కడే ప్రతీకారం. కథకు మంచి క్లైమాక్స్. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లకైతే ఇలాంటి కథలు చెప్పడానికి అంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది?
Ads
కానీ క్రికెట్లో ఒక చిన్న సమస్య ఉంది. ఫైనల్కి ముందుగా సెమీఫైనల్ గెలవాలి! అది మాత్రం పాకిస్థాన్ మరిచిపోయినట్టుంది. శుక్రవారం శ్రీలంకతో జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్ తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 130 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాతిమా సనా 36 బంతుల్లో 47 పరుగులతో జట్టును గట్టెక్కించింది. బౌలింగ్లోనూ నాలుగు వికెట్లు తీసింది. కానీ చివరికి ఆమె పోరాటం కూడా సరిపోలేదు. శ్రీలంక 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
(ఫాతిమా సనా అనగానే గుర్తొచ్చింది కదా, మొన్న మన షఫాలీ వర్మ వికెట్ తీయగానే పెవిలియన్ వైపు చూపించి, తన ఓవరాక్షన్తో విమర్శల పాలై, ఐసీసీ నుంచి ఓ డీమెరిట్ పాయింట్ను, ఎంతోకొంత మ్యాచ్ ఫీజు కోతను పొందింది… కానీ నిజానికి ప్రస్తుతం పాకిస్థాన్ వుమెన్ క్రికెట్కు ప్రాణం ఆమె, ఆల్రౌండర్)…
అంటే ఇప్పుడు ఫైనల్లో భారత్ను ఎదుర్కొనేది పాకిస్థాన్ కాదు… డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక! భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్ను 40 పరుగులతో ఓడించి ఫైనల్లోకి వచ్చింది. అది కూడా ఈ టోర్నమెంట్లో భారత్కు పదో ఫైనల్. ఇప్పటివరకు ఆడిన అన్ని ఎడిషన్లలో ఫైనల్ చేరిన ఏకైక జట్టు భారత్.
మరోవైపు శ్రీలంక గత ఎడిషన్లో ఛాంపియన్. ఇప్పుడు మరోసారి ఫైనల్లోకి వచ్చింది. అంతేకాదు, గతసారి ఫైనల్లో భారత్ను ఓడించి టైటిల్ కొట్టింది. అంటే ఇప్పుడు ఫైనల్లో భారత్కు కూడా ఒక పాత లెక్క ఉంది.
ఇక్కడే కథ మరింత ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 5న భారత్– పాకిస్థాన్ మ్యాచ్లో అసలు పాకిస్థాన్ ఏం చేసిందో ఒకసారి గుర్తు చేసుకోవాలి.
55 పరుగులకు ఆలౌట్! అదే పాకిస్థాన్ మహిళల టీ20 చరిత్రలో అత్యల్ప స్కోరు. భారత్ ఆ లక్ష్యాన్ని కేవలం 8.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంటే 68 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ముగిసింది.
అలాంటి మ్యాచ్ తర్వాత కూడా “ఫైనల్లో కలుద్దాం… ప్రతీకారం తీర్చుకుంటాం” అని ఊహించుకోవడం తప్పు కాదు. క్రీడలో ఆత్మవిశ్వాసం ఉండాలి. కానీ ఆత్మవిశ్వాసానికి, ముందుగానే క్లైమాక్స్ రాసేసుకోవడానికి, మాటల్ని కోటలు దాటించడానికి మధ్య చాలా తేడా ఉంటుంది.
ఇప్పుడు పాకిస్థాన్ పరిస్థితి చూస్తే… భారత్తో ప్రతీకారం తీర్చుకోవడానికి ఫైనల్కు రావాలనుకున్నారు. కానీ ఫైనల్కు రావడానికి ముందే శ్రీలంక చేతిలో ప్రతీకారం తీర్చించుకున్నారు!
ఇది పాకిస్థాన్ క్రికెట్లో తరచూ కనిపించే ఒక విచిత్రమైన ట్రెండ్కు మరో ఉదాహరణలా కనిపిస్తోంది. మ్యాచ్కి ముందు పెద్ద మాటలు. ఓడిపోయిన తర్వాత “మేం ఇంకా టోర్నమెంట్లోనే ఉన్నాం” అనే ధైర్యం. మళ్లీ గెలిస్తే పాత మాటలన్నీ గుర్తుచేసుకోవడం. కానీ చివరికి లెక్కలు మాత్రం స్కోర్బోర్డే చెబుతుంది.
మాజీ క్రికెటర్ల మాటల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ల విశ్లేషణలు వింటుంటే పాకిస్థాన్ ప్రతి మ్యాచ్కు ముందు ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్నట్టుంటుంది. కానీ మ్యాచ్ మొదలయ్యాక మాత్రం కొన్నిసార్లు స్కోర్బోర్డు వాళ్ల అంచనాలను చూసి నవ్వుతున్నట్టుంటుంది.
ఈసారి కూడా అదే జరిగింది. భారత్ను ఓడించి ఫైనల్లోకి వచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. కానీ శ్రీలంక మాత్రం “ముందు మమ్మల్ని దాటండి బాబూ” అన్నట్టుగా అడ్డంగా నిలబడింది. ఇక ఫైనల్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది.
ఒకవైపు వరుస విజయాలతో వచ్చిన భారత్. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక. మరి భారత్కు ఇప్పుడు రెండు లెక్కలు ఉన్నాయి. ఒకటి టైటిల్ది. ఇంకొకటి గత ఫైనల్లో శ్రీలంక చేతిలో ఎదురైన ఓటమిది. పాకిస్థాన్ మాత్రం ఈసారి అసలు లెక్కల పుస్తకంలోనే లేదు.
భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలని బయలుదేరిన పాకిస్థాన్కు… ఫైనల్ తలుపు తెరుచుకోలేదు! మాజీ క్రికెటర్ల జోకులు మాత్రం అక్కడితో ఆగవు. వాళ్లు మరో టోర్నమెంట్ కోసం ఇప్పటికే కొత్త ప్రతీకారం కథ రాసుకుంటూ ఉండొచ్చు!
Share this Article