.
ప్చ్, హరీష్ రావుకు పూర్తి నిరాశ… సీతమ్మసాగర్ ప్రాజెక్టు పర్యావరణ అనుమతికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు గనుక భిన్నంగా వచ్చి ఉంటే… ఏమాత్రం జాప్యం లేకుండా మరుక్షణం హరీష్ రావు నుంచి ఓ ప్రకటన వచ్చి ఉండేది… అదిలా ఉండేది, స్టీరియోఫోనిక్ ధోరణిలో… రొటీన్ తెలుగు సినిమా ఫార్ములాలో…
‘‘చూశారా, రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వక వైఫల్యం ఇది… కావాలనే సరైన వాదనలు వినిపించని ఫలితం ఇది… కేవలం చంద్రబాబుకు గురుదక్షిణ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి కుట్ర ఇది… పోలవరం- బనకచర్ల- నల్లమలసాగర్ ప్రాజెక్టు కోసం ఇద్దరి సంయుక్త వ్యూహం ఇది… తెలంగాణ ప్రయోజనాల్ని కూడా రేవంత్ రెడ్డి పణంగా పెడుతున్నాడు’’
Ads
…. ఇలా ఉండేదేమో… కానీ సుప్రీం కోర్టు తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమైన తీర్పు వెలువరించింది… ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఓ పెద్ద రిలీఫ్… వార్త వివరాల్లోకి వెళ్దాం…
పాలమూరు- రంగారెడ్డి, సీతమ్మసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ సహా కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి పనులకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం సంతోషాన్ని వ్యక్తం చేసింది…
ఖమ్మం జిల్లాలో చేపట్టనున్న సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు తెలంగాణ జలవనరుల చరిత్రలో కీలక మైలురాయి… ఈ ప్రాజెక్టు ద్వారా 36.57 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఏర్పడుతుంది… సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీటి భద్రత లభిస్తుంది… ఇందులో 3.28 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుంది…
నాగార్జునసాగర్ నీటి కొరత లేదా కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు మరో 3.45 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు ఈ నీటిని ఉపయోగించుకోవచ్చు… సీతమ్మసాగర్ ద్వారా 282.80 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి కూడా సాధ్యమవుతుంది… పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది…
ఈ ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నదికి ఇరువైపులా దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు… గోదావరి వెంట కరకట్టలు నిర్మించడం ద్వారా అశ్వా పురం, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని గ్రామాలు, పంటలకు వరద ముప్పు తగ్గుతుంది…
గోదావరి జలాల సమర్థవాడకంలో ఈ సీతమ్మసాగర్ కేవలం సాగునీటి అవసరాలు, కొత్త ఆయకట్టు కల్పన మాత్రమే కాదు, సాగునీటి భరోసా, విద్యుత్ ఉత్పత్తి, భూగర్భ జలాల పెంపు, వరద నియంత్రణ, ప్రాంతీయ సమగ్రాభివృద్ధికి బలమైన పునాది… కృష్ణాకు సంబంధించి పాలమూరు- రంగారెడ్డికి కూడా ఇది పెద్ద ఊరట!!
Share this Article