.
మొన్నమొన్నటిదాకా మహిళా రిజర్వేషన్లు దేశంలో ఓ చర్చనీయాంశం… అఫ్కోర్స్, దశాబ్దాలుగా ఈ అంశం చర్చనీయాంశమే… అడ్డంకులు దాటవు, ఆ రిజర్వేషన్లు కూడా ఎంతకూ సాకారం కావు… సరే, ఆ కథ వేరు… కానీ అవి సాకారం అయినప్పుడు రాష్ట్రాలవారీగా సీట్లలో రిజర్వేషన్లు ఇస్తారు సరే, కానీ దేశం మొత్తం ఓ యూనిట్గా తీసుకుని సీఎం పోస్టులకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేసే చాన్సుందా..?
అంటే… మున్సిపల్ చైర్పర్సన్లు, జెడ్పీలకు ఇచ్చినట్టుగానే అన్నమాట… అబ్బో, ఆశ దోశ అప్పడం వడ అని నవ్వుకుంటున్నారా..? సరే, ఆ డిస్కషన్ పక్కకు పెడితే… మమత బెనర్జీ ఓటమితో ఇక ప్రస్తుతం దేశంలో మిగిలింది ఒకే ఒక్క సీఎం… అదీ దేశరాజధాని ఢిల్లీలో బీజేపీకి చెందిన రేఖా గుప్తా…
Ads
నిజానికి పైపైన ఓసారి పరిశీలిస్తే… సొంత బలంతో, పార్టీలను బలంగా నడిపించి, కేడర్ను బలోపేతం చేసుకుని, తమకంటూ రాజ్యాల్ని క్రియేట్ చేసుకుని, అధికారం పొందినవాళ్లు జస్ట్, వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు కదా… ఉదాహరణకు ఒక జయలలిత, ఒక మమతా బెనర్జీ, ఒక మాయావతి, ఒక మెహబూబా ముఫ్తీ… ఇప్పటివరకు మొత్తం 18 మంది మహిళలు సీఎంలుగా చేస్తే… మెజారిటీ ‘టైమ్లీ అడ్జస్ట్మెంట్ సీఎంలు’ మాత్రమే…
మగ పురుష్ జైళ్లపాలైనప్పుడో… వేరే సందర్భాల్లోనో… సీఎంలు అయినవాళ్లే అధికులు… లేదా సొంత బలం గాకుండా పార్టీబలంతో ముఖ్యమంత్రులు అయినవారు… ప్రజెంట్ సిట్యుయేషన్ చూద్దాం… దేశంలోని 20కిపైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ అధికారంలో ఉంది… అయితే ఒక్కరు మాత్రమే మహిళా సీఎం…
ఇక విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ, జార్ఖండ్, జమ్ముకశ్మీర్, పంజాబ్లలో పురుషులే సీఎం పీఠాలపై ఉన్నారు… తాజాగా జరిగిన ఎన్నికల్లో అసోం, పశ్చిమ బెంగాల్ లో బీజేపీ విజయం సాధించినప్పటికీ… ఆ రాష్ట్రాల్లో మహిళలు సీఎం పదవిని దక్కించుకోవడం అసాధ్యమే… తమిళనాడు విజయ్, కేరళలో ఎవరో చూడాలి, కానీ నాట్ లేడీ… పుదుచ్చేరి కూడా…
చట్టసభల్లో రోజురోజుకూ మహిళల సంఖ్య పెరుగుతోంది… ప్రస్తుత లోకసభలో 74 మంది మహిళా ఎంపీలు ఉన్నారు… దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 400 నుంచి 450 మంది మహిళా ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు… కానీ మహిళా ముఖ్యమంత్రుల సంఖ్య ఒకటికి పడిపోయింది…
దేశంలో ఇప్పటివరకు 18 మంది మహిళలు వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేశారు… 1963 లో ఉత్తరప్రదేశ్ సీఎంగా సుచేతా కృపలానీ దేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా రికార్డుల్లోకెక్కింది… అత్యధిక కాలం పనిచేసి మహిళా సీఎం షీలా దీక్షిత్ (ఢిల్లీ) చరిత్రలో నిలిచింది… ఆమె 15 ఏండ్లకు పైగా ఢిల్లీని పాలించింది… ఇక బెంగాల్ తాజా మాజీ సీఎం మమతా బెనర్జీ కూడా… పదిహేను ఏండ్ల పాటు సీఎంగా కొనసాగింది…
జయలలిత తమిళనాడుకు ఐదు పర్యాయాలు సీఎంగా సేవలందించగా, రాజస్థాన్ సీఎంగా వసుంధర రాజే రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తించింది… ఓసారి జాబితా మొత్తం చూద్దాం…
- సుచేతా కృపలానీ – ఉత్తరప్రదేశ్ (తొలి మహిళా సీఎం)… మమతా బెనర్జీ- పశ్చిమ బెంగాల్ … జయలలిత – తమిళనాడు… మాయావతి – ఉత్తరప్రదేశ్… షీలా దీక్షిత్ – ఢిల్లీ … వసుంధర రాజే సింధియా – రాజస్థాన్… ఉమా భారతి – మధ్యప్రదేశ్… రబ్రీ దేవి – బీహార్ …. నందిని సత్పతి – ఒడిశా… మెహబూబా ముఫ్తి – జమ్ము కశ్మీర్ … ఆనందిబెన్ పటేల్ – గుజరాత్ … రాజీందర్ కౌర్ – పంజాబ్… శికళా కాకోద్కర్ – గోవా… అన్వారా తైమూర్ – అస్సాం… వీఎన్. జానకి రామచంద్రన్ – తమిళనాడు… అతిషి- ఢిల్లీ… రేఖా గుప్తా – ఢిల్లీ… సుష్మా స్వరాజ్ – ఢిల్లీ…
Share this Article